షాబాద్: మార్కెట్లో వంట నూనె ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డిమాండ్ నేపథ్యంలో నూనె గింజల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నా రు. మండల పరిధి ముద్దెంగూడ, రేగడిదోస్వాడ, తిర్మలాపూర్, బొబ్బిలిగామ, కొమరబండ, గోల్లూరుగూడ తదితర గ్రామాల రైతులు.. ఈ సంవత్సరం తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు, వేరు శనగ తదితర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు పలు కారణాలతో నష్టాలను తెచ్చిపెడుతుండటం, నూనె గింజల పంటలకు మద్దతు ధరతో పాటు ఆదాయం వస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు.
వేలాది ఎకరాల్లో తెల్ల కుసుమ
గతంలో మండల పరిధిలో ఎక్కడా తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ ప్రత్యామ్నాయపంటలు వేసుకోవాలనే ప్రభుత్వ సూచన మేరకు.. ఈ యాసంగి సీజన్లో 1,048 ఎకరాలకు పైగా పొద్దు తిరుగుడు, 2,814 ఎకరాలకు పైగా తెల్ల కుసుమ సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
కనువిందు చేస్తున్న పొద్దుతిరుగుడు
షాబాద్ మండల పరిధిలోని ముద్దెంగూడ, కొమరబండ, బొబ్బిలిగామ, తిర్మలాపూర్, లక్ష్మారావుగూడ, తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ, రేగడిదోస్వాడ, ఏట్ల ఎర్రవల్లి తదితర గ్రామాల శివారుల్లో చెరువులు, బోరు బావుల కింద రైతులు నూనె గింజల పంటలు వేశారు. పొద్దు తిరుగుడు పంట పూత దశలో ఉండి ఆకర్షిస్తోంది. గతేడాది మండలంలో పొద్దు తిరుగుడు 254 ఎకరాల్లో సాగు చేయగా, ప్రస్తుతం 1,048 ఎకరాలు సాగవుతోంది. వేరుశనగ 68 ఎకరాలు కాగా.. ఇప్పుడు 218 ఎకరాలు,తెల్ల కుసుమ 1,542 ఎకరాలు కాగా.. ప్రస్తుతం 2,814 ఎకరాల్లో సాగు చేశారు. జొన్న, శనగఅంతర పంటగా 317 ఎకరాలు సాగు చేయగా, ప్రస్తుతం 624 ఎకరాల వరకు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. వాణిజ్య పంటలు ఏపుగా పెరుగుతుండటంతో.. మద్దతు ధరపై రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.
రోజురోజుకూపెరుగుతున్న ఆయిల్ ధరలు
పత్తి, మొక్కజొన్న సాగుకురైతులు స్వస్తి
ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు
తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు,వేరు శనగ పంటలపై ఆసక్తి
నూనె గింజల సాగు.. బాగు