
బెట్టింగ్ భూతం.. బలవుతున్న జీవితం
ఓ వైపు ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై విచారణకు సిట్ ఏర్పాటు చేసి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్లపైనిషేధాజ్ఞలు విధించింది. అయినప్పటికీ కొందరు బుకీలు ఐపీఎల్ మ్యాచ్లకు పందేలు నిర్వహిస్తున్నట్లు.. రూ.లక్షల్లో ఈ దందా సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పరిగి: క్రికెట్ బెట్టింగ్తో యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఐపీఎల్ పోటీలు ప్రారంభమవడంతో రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడుతున్నారు. జిల్లాలోని నలుమూలల కొందరు యువతను దీనికి ఉసిగొలిపి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభం అయిన నాటి నుంచి జిల్లాలో ఈ వ్యవహారం చాపకింద నీరుగా విస్తరిస్తోంది. పోలీసులు పైకి అలాంటిది ఏమీ లేదని చెబుతున్నా మూలాలను వెతికి పట్టి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నా యి. జిల్లాలోని పట్టణ, మండల, గ్రామాల్లో కొందరు వ్యాపారస్తులు, యువత పోలీసుల కల్లుగప్పి ఈ తంతును యథేచ్ఛగా నడిపిస్తున్నారు. ఈ మోజులో పడి లక్షల రూపాయలు పొగొట్టుకుంటున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడాలేకుండా స్థాయికి తగ్గట్టు వందల నుంచి వెయ్యి, వెయ్యి నుంచి లక్షల వరకు పందెం కాస్తున్నారు. హోటళ్లు, బేకరీలు, కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, పాన్షాపులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశతో యువత పెడదోవ పడుతున్నారు.
యువత, విద్యార్థులే టార్గెట్
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్ వ్యవహారం సాంకేతికంగా దూసుకుపోతోందని సమాచారం. వాట్సాప్లాంటి సామాజిక మాధ్యమాలతో పాటు యాప్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. బుకీలు అత్యాధునిక పరిజ్ఞానంతో యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దందాను కొనసాగిస్తున్నారు. టాస్వేసిన క్షణం నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్లను బంతి బంతికి, మ్యాచ్కి ఇలా ఆట ముగిసే వరకు బెట్టింగ్ వేస్తున్నా రు. యాప్లలో కాస్తున్న వారికి నిర్వాహకులు జట్టుకు రేటింగ్ ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో పాటు ఇద్దరు వ్యక్తుల, యువకుల మధ్య బంతికి లేదా, మ్యాచ్కి బెట్టింగ్ కాస్తుంటారు. గెలుపొందిన వారికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు. ఓడిపోయిన వారు డబ్బులు చెల్లించకపోతే యువకులు గొడవలకు దిగుతున్నారు. కొంత మంది యవకులు అప్పులు చేసి బెట్టింగ్ వేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పోలీసులకు చిక్కకుండా కోడ్ లాంగ్వేజ్
ఐపీఎల్ బెట్టింగ్లు జిల్లాలో జోరందుకున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందే పందేలు మొదలవుతున్నాయి. ఎవరు టాస్ గెలుస్తారు? ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటారు? ఏ బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు? తదితర అంశాలతో పాటు ప్రతి బంతికి పందెం ఉంటుంది. ఇలా ఒక్కో ఆటగాడిపై వ్యక్తిగతంగానూ బెట్టింగ్ అధిక సంఖ్యలో సాగుతుంది. కొన్ని చోట్లు పోలీసులకు దొరక్కుండా కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
ఆన్లైన్ వేదికగా పందేలు
ఐపీఎల్ మ్యాచ్లకు రూ.లక్షల్లో అప్పులు
తీర్చే మార్గం లేక దా‘రుణాలు’
నిఘా ఉంచాం
బెట్టింగ్లు ఆడుతున్న వారిపై నిఘా ఉంచాం. ఎక్కడైనా స్థావరాలు ఏర్పాటు చేసి బెట్టింగ్లు ఆడుతున్నారా అనే విషయాలను తెలుసుకుంటున్నాం. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడతుంటే పోలీసులకు సమాచారం అందించాలి. ఈ వ్యసనంతో కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది. ఇప్పటికే యువతకు అవగాహన కల్పిస్తున్నాం.
– శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి

బెట్టింగ్ భూతం.. బలవుతున్న జీవితం