● రెండేళ్ల కిందట సమూల మార్పులు తీసుకొచ్చిన గత ప్రభుత్వ
రెండేళ్ల క్రితం వరకు పది పరీక్షలను 11 రోజుల పాటు 11 పేపర్లు నిర్వహించేవారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యేవారు. ముఖ్యంగా పరీక్షలంటే విద్యార్థుల్లో ఆందోళన ఉండేది. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరు సబ్జెక్టులు, ఏడు పేపర్లుగా మార్చింది.దీంతో విద్యార్థులపై కొంత మేర ఒత్తిడి తగ్గింది. ఈ ఏడాది అదే విధానాన్ని అనుసరించనుండడంతో పాటు ప్రతి పరీక్షకు ఒక రోజు విరామం ఇచ్చారు. జిల్లాలోని 447 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు చెందిన 22,939 మంది, గతంలో ఫెయిలైన విద్యార్థులు 835 మంది మొత్తం 23,774 మంది విద్యార్థులు 119 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. అయితే పదో తరగతి పరీక్షలు అనగానే విద్యార్థుల్లో హడావుడి, మానసిక ఒత్తిడి సాధారణం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఒకింత పరీక్షే. గతంలో 11 రోజులు పరీక్షలు రాయాల్సి ఉండడంతో విద్యార్థులు ఒత్తిడికి గురయ్యేవారు. అయితే ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టులు, ఏడు పేపర్ల విధానంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గింది. అలాగే పరీక్షకు పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ప్రకటించడంతో గత విద్యాసంవత్సరం మాదిరిగానే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఏడు పేపర్లు నిర్వహించనున్నారు.
గతంలో ఇలా..
పదో తరగతి పరీక్షలు చాలా సంవత్సరాల నుంచి 11 పేపర్లుగా నిర్వహించేవారు. హిందీ మినహా తెలుగు, ఇంగ్లీషు, గణితం, సోషల్, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 50 మార్కుల చొప్పున రెండు పేపర్ల ప్రకారం జరిగేవి. కరోనా ప్రభావంతో 2019–20 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేశారు.కరోనా తీవ్రత తగ్గడంతో 2021–22 విద్యా సంవత్సరంలో 11 పేపర్లను 7 పేపర్లకు కుదించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, సోషల్ సబ్జెక్టుల్లో ఒక్కో పేపర్కు 100 మార్కులు చొప్పున ఫిజిక్స్, బయాలజీ పేపర్లు ఒక్కో పేపర్కు 50 మార్కులు నిర్దేశించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత విధానానికి స్వస్తి పలకడంతో విద్యార్థులకు భారం తగ్గింది.
ఒత్తిడి తగ్గి బాగా చదువుకోవచ్చు..
ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గి పరీక్షలు బాగా రాసే అవకాశాలు ఉన్నాయి. పరీక్షకు పరీక్షకు మధ్య సెలవు రావడం విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఉపాధ్యాయులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అంశాల వారీగా తర్ఫీదు ఇస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. నూతన విధానం ద్వారా పరీక్షల సంఖ్యతో విద్యార్థులపై భారం తగ్గుతుంది.
– కె మోహనరావు, డిప్యూటీ డీఈవో
● రెండేళ్ల కిందట సమూల మార్పులు తీసుకొచ్చిన గత ప్రభుత్వ
Comments
Please login to add a commentAdd a comment