
10 నుంచి ఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించాలి
కాళోజీ సెంటర్: ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో రెండో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించడానికి ఈనెల 10, 11, 12 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే చేయాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ సూచించారు. సర్వే నిర్వహించేందుకు డైట్ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా ఎంపిక చేసి రెండు రోజుల శిక్షణను కరీమాబాద్ పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి టాంజరీన్ యాప్లో నమోదు చేయాలని చెప్పారు. మొదటి రోజు తెలుగు, రెండో రోజు గణితం, మూడో రోజు ఆంగ్లంలో పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. రిస్సోర్స్పర్సన్స్ బి.కుమారస్వామి, ఎం రఘుపతి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నారు.
శోభారాణికి పురస్కారం
నర్సంపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో నర్సంపేట లీడ్ గ్రంథాలయ నిర్వాహకురాలు కాసుల శోభారాణి శుక్రవారం ధాత్రిరత్న సేవా పురస్కారాన్ని అందుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నందుకు ఆమెకు రెడ్క్రాస్ సొసైటీ బాధ్యులు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీంరెడ్డి, జిల్లా వైస్ చైర్పర్సన్ విజయకుమారి ఆమెను అభినందించారు.
ఇంటర్ పరీక్షలకు
245 మంది గైర్హాజరు
కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. 5,152 మంది జనరల్ విద్యార్థులకు 4,979 మంది, 885 మంది ఒకేషనల్ విద్యార్థులకు 813 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొత్తం 245 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
సరిపడా ఎరువులు, పురుగు మందులు
● ఎఫ్సీఓ మార్గదర్శకాల మేరకు
నిల్వచేయాలి
● జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ
● గొర్రెకుంటలో గోదాంల తనిఖీ
గీసుకొండ: ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీఓ) మార్గదర్శకాల ప్రకారం ఎరువులు, పురుగు మందులను నిల్వచేయాలని, లేదంటే వారికి నోటీసులు ఇచ్చి లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట పరిధిలోని ఎరువులు, పురుగుల మందుల గోదాములను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్లు, కోరమండల్ నిల్వగోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్కు సరిపడా ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు అందుబాటులో ఉన్నాయని, మోతాదును మించి పంటలకు వేయవద్దని, వ్యవసాయ అధికారులు సూచనలను పాటించాలని కోరారు. గోదాంలలో గడువు ముగిసిన పురుగుల మందులను వేరుగా భద్రపరిచి లేబ్లింగ్ చేయాలని పేర్కొన్నారు. కంపెనీలు సంబంధిత పురుగుల మందుల ప్యాకింగ్పై తయారీదారు, అమ్మకందారు, ఉత్పత్తికి సంబంధించిన వివరాలను స్పష్టంగా ముద్రించాలని ఆదేశించారు. తనిఖీల్లో ఆమె వెంట మార్క్ఫెడ్ డీఎం వై.రజినీకాంత్రెడ్డి, ఏఓ హరిప్రసాద్బాబు, గోదాంల ఇన్చార్జ్ అశ్వక్అహ్మద్ ఉన్నారు.

10 నుంచి ఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించాలి

10 నుంచి ఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించాలి
Comments
Please login to add a commentAdd a comment