
తూర్పులో ‘ఫొటో’ రాజకీయం
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో రాజకీయం రాజుకుంటోంది. సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని, రాష్ట్రం వాటా చాలా తక్కువ అంటూ.. ఎక్కువ వాటా ఇస్తున్న ప్రధాని మోదీ చిత్రపటం లేకుండా, తక్కువ వాటా ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో ఎలా పెడతారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని 27వ డివిజన్ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్లోని ఎస్ఆర్ఆర్ తోట, 37వ డివిజన్ తూర్పుకోటలోని కొత్తగడ్డ, 18వ డివిజన్ లేబర్ కాలనీలోని గాంధీనగర్ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆయా రేషన్ షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచే వస్తున్నాయని, కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందంటూ బీజేపీ నాయకులు వివిధ రేషన్ షాపుల వద్ద ఆందోళనకు దిగి ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఇతర నేతలు గిర్మాజీపేటలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఓ రేషన్ దుకాణం వద్ద ప్రధాని మోదీ చిత్రపటం పట్టుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతల రాకతో కాస్త గొడవ జరిగినా.. ఆ తర్వాత పోలీసుల రాకతో సద్దుమణిగింది. ఓవైపు కాంగ్రెస్ సన్న బియ్యం క్రెడిట్ తమదేనని చెప్పుకుంటుంటే.. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని ఇంకోవైపు బీజేపీ డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ
చిత్రపటం పెట్టాలి..
కమలం వర్సెస్ కాంగ్రెస్గా మారిన
సన్నబియ్యం పంపిణీ