
2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..
వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి సీఎం రేవంత్రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు.. 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్ సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. మంత్రి సురేఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క)తో కలిసి జాబ్మేళాను ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సుమారు 65 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 18 వేల మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. తొలుత నిర్వహించిన ఇంటర్వ్యూలో 17 మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు మంత్రులు, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడు తూ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశల వారీగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ఇక ఆగదు.. ఉద్యోగాల కల్పనలో నంబర్ వన్గా నిలిచామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాబ్మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు వేల మందికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈఓ రెడ్డి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఏ కౌసల్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.
అస్తవ్యస్తం.. ఆగమాగం
జాబ్మేళా నిర్వహించిన ఫంక్షన్ హాల్ ఇరుకుగా ఉండడం.. అధిక సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో నరక యాతన అనుభవించారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకు సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ లిఫ్టులు పనిచేయలేదు. అన్నపానీయాలు అందజేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. క్యూలైన్లో గంటల తరబడి వేచిఉన్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ అనుచరులను పైరవీలతో ఆయా కంపెనీల ప్రతినిధులకు అప్పగించారు. హాల్ కిక్కిరిసిపోవడంతో తోపులాట కారణంగా గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి.
నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం
ఉద్యోగ అవకాశాలను
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..