మద్యంపై.. మహిళల సమరం | - | Sakshi
Sakshi News home page

మద్యంపై.. మహిళల సమరం

Published Sat, Mar 8 2025 1:15 AM | Last Updated on Sat, Mar 8 2025 1:15 AM

మద్యం

మద్యంపై.. మహిళల సమరం

బెల్టు దుకాణాలు బంద్‌ చేయించిన అతివలు

క్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చెయ్యలేనిది. మహిళలు ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. గ్రామాల్లో మద్యం మహమ్మారికి యువత బానిస కావడం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో ఆ ఊళ్లలో మహిళలు కొంగు నడుముకు చుట్టారు. మద్యం మహమ్మారిని పారదోలాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నిర్వహించే బెల్ట్‌ దుకాణాలపై సమరం సాగించారు. మద్యం అమ్మకాలను అడ్డుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట మహిళలు.

– చిట్యాల, రాజాపేట

నెలరోజులుగా మద్యం

అమ్మడం లేదు

మా గ్రామంలో పదిహేనుకు పైగా బెల్ట్‌ దుకాణాల్లో మద్యం అమ్మేవారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యానికి బానిసై ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు మృతిచెందాడు. వెంటనే గ్రామంలో బెల్ట్‌ దుకాణాలను అరికట్టాలని మహిళలమంతా కలిసి ర్యాలీ నిర్వహించాం. మద్యం అమ్మితే జరిమానా విధించాలని తీర్మాణించాం. నెల రోజులుగా గ్రామంలోని బెల్ట్‌ దుకాణాలను తొలగించారు. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.

– బొంగు శ్రీలత, మహిళా సంఘం

ప్రధానకార్యదర్శి, ఏపూరు

మద్యం అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని నిర్ణయం

ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట

చిట్యాల మండలం ఏపూరు గ్రామం జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1950 మందికిపైగా జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన పురుషులు ఎక్కువగా డ్రైవర్లుగా, కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పదిహేనుకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల బ్రాండ్‌లకు చెందిన మద్యం లభిస్తుంది. దీంతో ఆ గ్రామంలోని యువకులతో పాటు చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు సైతం ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలలు పోగొట్టుకున్నారు. మరికొందరు చేసిన పనిచేసిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో ఆ గ్రామ మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు.

మద్యంపై యుద్ధం మొదలైంది ఇలా..

ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (20) ఫిబ్రవరి 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ యువకుడి మృతికి మద్యం మహమ్మారే కారణమని భావించారు. ఆ యువకుడు మృతి చెందిన రోజే గ్రామంలో మద్యపానం నిషేధానికి నడుం బిగించారు. ఆ గ్రామంలోని మహిళ సంఘం అధ్యక్షురాలు వలిగొండ సునీత, ప్రధానకార్యదర్శి బొంగు శ్రీలత, వీబీకే బండ అనురాధ ఆధ్వర్యంలో మహిళలంతా ఏకమై బెల్ట్‌ దుకాణాలను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. గ్రామంలో బెల్ట్‌ దుకాణాల వద్దకు వెళ్లి మద్యం అమ్మొదని హెచ్చరించారు. గ్రామంలో బెల్ట్‌ దుకాణాలు నిర్వహిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేలు జరిమానా.. మద్యం అమ్మినవారి సమాచారం అందిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం అందజేస్తామని తీర్మాణించారు. ఆ రోజు నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
మద్యంపై.. మహిళల సమరం1
1/1

మద్యంపై.. మహిళల సమరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement