నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన శ్రీస్వామివారు గజవాహనంపై, నవ వధువుగా శ్రీలక్ష్మీదేవి దివ్య అలంకార శోభితమై ప్రత్యేక పల్లకిలో 8.30గంటలకు ఊరేగింపుగా బయలుదేరి ఉత్తర మాడవీఽఽధిలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపైకి చేరుకున్నారు. కల్యాణ వేదికపై శ్రీస్వామి, అమ్మవారిని ఎదురెదురుగా అధిష్టింపజేసిన అర్చకులు.. కల్యాణానికి శ్రీకారం చుట్టారు. అర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా ప్రధానా ర్చకులు శ్రీస్వామివారికి జంజరాధారణ (యజ్ఞోపవీతం)గావించారు. 10.44 గంటలకు జీలకర్ర బెల్లం ధరించారు. 10.50 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, సన్నాయిమేళాలు మోగుతుండగా, భక్తులు జయజయద్వానాల మధ్య మాంగల్యధారణ గావించి, ఆతరువాత ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన బీర్ల అయిలయ్య,
ఎంపీ కిరణ్కుమార్రెడ్డి
ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య , ఎంపీ కిరణ్కుమార్రెడ్డి స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే టీటీడీ, పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం వారు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను అర్చకులు స్వామి, అమ్మవారికి సమర్పించారు. కల్యాణంలో దేవాదాయ శాఖ కమి షనర్ శ్రీధర్, కలెక్టర్ హనుమంతరావు దంపతులు, జిల్లా జడ్జి జయరాజు, ఈఓ భాస్కర్రావు, అనువంశి ధర్మకర్త నరసింహమూర్తి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉదయం శ్రీరాముడిగా దర్శనమిచ్చిన నృసింహుడు
ఉదయం స్వామివారిని శ్రీరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగించారు.
ఫ యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు.
నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment