యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. పూజల్లో భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి.
తలనీలాల టెండర్ రూ.6కోట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం తలనీలాలు సేకరించే లైసెన్స్ హక్కు, దేవస్థానంచే సేకరించబడిన తలనీలాల విక్రయానికి సంబంధించిన టెండర్ను ఆలయ ఈఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టెండర్లలో 15 మంది పాల్గొనగా.. తమిళనాడుకు చెందిన కేఎం ఎంటర్ ప్రైజెస్ వారు రూ.6కోట్లకు దక్కించుకున్నారు. కాగా.. గతేడాది జూలైలో టెండర్ కాలపరిమితి ముగిసింది. దీంతో 9 సార్లు నిర్వహించినా సరైన ధర రాకపోవడంతో టెండర్లు రద్దు పరిచారు. తొమ్మిది పర్యాయాలు రూ.3కోట్లకు మించి టెండర్ ధర రాకపోవడంతో మంగళవారం 10వ సారి టెండర్ నిర్వహించినట్లు ఈఓ భాస్కర్రావు వెల్లడించారు. దేవస్థానం సేకరించిన తలనీలాల స్టాక్ను సోమవారం 3వ సారి బహిరంగ వేలం నిర్వహించామని, ఇందులో 26 మంది టెండర్దారులు పాల్గొనగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్దంకి, బాపట్లకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర హెయిర్ మర్చంట్ వారు కిలో ఒక్కంటికి రూ.19వేలకు తీసుకున్నారని పేర్కొన్నారు.
పంచాయతీ నిధుల వ్యయంపై విచారణ
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ నిధుల వ్యయంపై ఎంపీడీఓ రాములు నాయక్, ఎంపీఓ పద్మావతి మంగళవారం పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 2019–23లో ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పులు, వ్యాపార అనుమతులకు సంబంధించి ఆన్లైన్ చేయకుండా అక్రమాలకు పాల్పడినట్లు మండల కేంద్రానికి ఎండీ హైమద్ ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి సునంద ఆదేశం మేరకు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఎంపీఓ పద్మావతి మాట్లాడుతూ.. 2019–23వరకు గ్రామ పంచాయతీ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో విచారణ చేయలేకపోతున్నామని, జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. మెయిన్ రోడ్డు వద్ద 94 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఐదు అంతస్తుల నిర్మాణంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా నాయకుడు బొబ్బల ఇంద్రారెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సీసీ రోడ్లు నాణ్యత లేకుండా నిర్మించారని గజరాజు కాశీనాథ్, యాస ఇంద్రారెడ్డి, కొరె భిక్షపతి పేర్కొన్నారు. విచారణలో పంచాయతీ కార్యదర్శి ఆనంద్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల
సమస్యలు పరిష్కరించాలి
వలిగొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి కిష్టాఫర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఉద్యమకారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంధమల్ల శ్రీనివాస్, చౌటుప్పల్ మండల్ ఉపాధ్యక్షుడిగా ఈపూరి శేఖర్ను నియమిస్తూ నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పబ్బు లక్ష్మయ్య, చీమ కండ్ల శ్రీనివాస్, జోగు యాదయ్య, నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన