భూదానం.. వజ్రోత్సవం | - | Sakshi
Sakshi News home page

భూదానం.. వజ్రోత్సవం

Apr 18 2025 1:26 AM | Updated on Apr 18 2025 1:26 AM

భూదాన

భూదానం.. వజ్రోత్సవం

భూదానోద్యమం పురుడుపోసుకుని 74 ఏళ్లు పూర్తి

భూదాన్‌పోచంపల్లి : భూదాన ఉద్యమానికి అంకురార్పణ జరిగి నేటికి (శుక్రవారం) సరిగ్గా 74 ఏళ్లు పూర్తయ్యాయి. అడిగిందే తడవుగా వెదిరె రాంచంద్రారెడ్డి ఒకటి, కాదు రెండు కాదు.. ఏకంగా 100 ఎకరాల భూమి 1951 ఏప్రిల్‌ 18న దానంగా ఇచ్చి పోచంపల్లిలో భూదానోద్యమానికి నాందిపలికారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దాంతో పోచంపల్లికి భూదాన గంగోత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. భూదానోద్యమానికి బీజం పడి 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా భూదాన వజ్రోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించి ప్రజలలో భూదాన స్ఫూర్తిని కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.

స్ఫూర్తినిచ్చిన భూదానం..

మహాత్మాగాంధీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయంలో సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్‌ ఆహ్వానం మేరకు 1951 ఏప్రిల్‌15న హైదరాబాద్‌ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి వెంటనే పాదయాత్రగా బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం హరిజనవాడలో తిరిగి ఆ రోజు రాత్రి పీర్లకొట్టం (ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు అనగా ఏప్రిల్‌ 18న చెరువు సమీపంలో నున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెల్లబోసుకున్నారు. దాంతో వినోబాభావే స్పందిస్తూ, మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా అని అడగటంతో అక్కడే ఉన్న పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి వెంటనే లేచి తన తండ్రి జ్ఞాపకార్ధం 100ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి నిండుసభలో వినోబాభావేకు అందించారు. దాన రూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. దీనికి గుర్తుగా పోచంపల్లిలో భూదానస్తూపాన్ని నిర్మించారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి విశ్వవ్యాప్తమై పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇలా 100 ఎకరాలలో మెదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి 44 లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టబడింది. మహోన్నతమైన భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగడానికి దోహదపడింది.

పోచంపల్లితో విడదీయని అనుబంధం

ఆచార్య వినోబాభావేకు పోచంపల్లితో విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 గాంధీ వర్ధంతి జనవరి 30న రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబాభావే పేర్కొనడం విశేషం. వినోబాభావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.

టూరిజం పార్కులో నేడు ప్రత్యేక కార్యక్రమాలు

భూదానోద్యమం ఆవిర్భవించి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా పోచంపల్లిలో శుక్రవారం భూదాన వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గాంఽధీగ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినోబాబావే మందిరంలో ఉదయం శాంతి యజ్ఞం, ఆచార్య వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేయనున్నట్లు తెలిపారు.

సర్వోదయ మండలి ఆధ్వర్యంలో..

భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో స్థానిక టూరిజం పార్కులో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్‌ గురువారం తెలిపారు.

ఆర్థిక అసమానతలు

తొలగించిన భూదానం

భూదానోద్యమం ద్వారానే

దేశంలో భూసంస్కరణలు

నేడు పోచంపల్లిలో

భూదాన వజ్రోత్సవాలు

ప్రారంభానికి నోచుకోని వినోబాభావే మందిరం

2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోచంపల్లిని సందర్శించిన సందర్భంగా.. శిథిలావస్థకు చేరిన వినోబాభావే మందిరాన్ని పునఃనిర్మించాలని భూదానయజ్ఞబోర్డు చైర్మన్‌ గున్నా రాజేందర్‌రెడ్డి వినతి మేరకు రూ.50లక్షలు మంజూరు చేశారు. దాంతో వినోబాభావే మందిరాన్ని 2014లో పునఃనిర్మించి నాటి భూదానోద్యమ ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. కానీ, గత పదకొండు ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. వినోబాభావే మందిరానికి తాళం వేసి ఉండటంతో పోచంపల్లికి వచ్చిపోయే పర్యాటకులు వినోబాభావే మందిరాన్ని సందర్శించకుండానే నిరాశతో వెనుతిరిగిపోతున్నారు. భూదా నోద్యమం ద్వారా మన జిల్లా, రాష్ట్రం, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిపెట్టిన వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని వారి వారసులు గత ప్రభుత్వానికి విన్నవించినా నేటికి ఆ కల కూడా నెరవేరలేదు. అలాగే వెదిరె రాంచంద్రారెడ్డి పేరిట తపాల బిళ్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా అదీ కార్యరూపం దాల్చలేదు.

భూదానం.. వజ్రోత్సవం1
1/3

భూదానం.. వజ్రోత్సవం

భూదానం.. వజ్రోత్సవం2
2/3

భూదానం.. వజ్రోత్సవం

భూదానం.. వజ్రోత్సవం3
3/3

భూదానం.. వజ్రోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement