రెడ్డెమ్మ మాటల వెనక మత్తులబు ఏమిటో !
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి సర్కార్లో గంజాయితో పాటు మత్తు డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని అసెంబ్లీ వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కడపలో పానీయాలల్లో మత్తు కలిపి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని హాట్ కామెంట్ చేశారు. యువకులు మత్తు డ్రగ్ ఇంజక్షన్లు వేసుకుంటున్నారంటూనే మెడికల్ స్టోర్స్లో మత్తు డ్రగ్స్ విక్రయాలు కట్టడి చేయాలన్నారు. గంజాయి తగ్గుము ఖం అంటూనే ఆ స్థానంలో మత్తు డ్రగ్స్ వచ్చి చేరినట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి 9నెలలు కావస్తోంది. గంజాయి కట్టడి చేస్తున్నామని చెప్పుకోవడం మినహా ఆశించిన స్థాయిలో కంట్రోల్ కాలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. గంజాయి స్థానంలోకి డ్రగ్స్ వచ్చి చేరినట్లు చెప్పుకొచ్చారు. వాస్తవంలో పరిశీలిస్తే గంజాయి కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. కౌన్సెలింగ్ ఇస్తూనే డీ ఆడిక్షన్ సెంటర్ సెంటర్కు పంపుతున్నారు. మరోవైపు డ్రగ్స్లాగా ఉపయోగించే ఓపీ యార్డ్స్ మాత్రలు, ఇంజక్షన్లు విక్రయాలు చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆ మేరకు జిల్లాలో రెండు మెడికల్స్టోర్స్పై ఆరోపణలు రావడంతో సీజ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మత్తు మందుల విక్రయాలు చేపట్టరాదని డ్రగ్స్ డీలర్లు, ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే...
ఇదివరకూ జిల్లా కేంద్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, కట్టడి చేయాల్సిందిగా అప్పటి ఎస్పీ హర్షవర్ధనరాజుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా అసెంబ్లీ వేదికగా గంజాయితోపాటు మత్తు డ్రగ్స్ వల్ల ఇలాంటి వైపరీత్యాలు అధికమయ్యాయని సోమవాళం గళం విప్పారు. పానీయాల్లో మత్తు డ్రగ్స్ కలుపుతూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకూ అధికారికంగా నమోదు కాకపోయినా, అధికారపార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నిజంగా ఉందా.. ప్రచార ఆర్భాటమా!
కడపలో నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే స్థానికంగా సమీక్షలు చేపట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యతయుతమైన ప్రజాప్రతినిధిగా మత్తు మందులు విక్రయించేవారిని కట్టడి చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు అధికారికంగా ఒక్క కేసు నమోదు కాలేదు.పైగా వీటి నివారణకు అలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో కట్టడి చేసే చర్యలు చేపట్టకపోగా, ప్రచార ఆర్భాటాలకే ఎమ్మెల్యే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. మత్తు డ్రగ్స్, గంజాయి విక్రయాలు కట్టడిలో కూటమి సర్కార్ విఫలమైందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఇప్పటికీ గంజాయి లభ్యమౌతోందని, దానికి తోడుగా అదనంగా మత్తు డ్రగ్స్ విక్రయాలు ఉన్నాయని ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పష్టం చేశారు. దీనిని కట్టడి చేసేందుకు హోంమంత్రి ఎలాంటి చర్యలు చేపడతారో ఆలోచించాలని కూడా కోరడం విశేషం.
అమ్మాయిలను టార్గెట్ చేస్తూ మత్తు పానీయాలు
కడప ఎమ్మెల్యే
మాధవి రెడ్డి
హాట్ కామెంట్
Comments
Please login to add a commentAdd a comment