ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగల నుంది. టీటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ (ఎస్సీ) లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో ఆయన పార్టీకి గుడ్బై చెబుతున్నారని, గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 20 రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి మోత్కుపల్లితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మోత్కుపల్లి ఖమ్మం జిల్లా మధిర స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.