ఈ నెల 7వ తేదీ తెలంగాణ బంద్కు తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు ఇచ్చింది. జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత చైర్మన్ కోదండరామ్ విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలపాటు బంద్కు పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో చేయతలపెట్టిన శాంతి ర్యాలీని రద్దు చేసినట్లు చెప్పారు. శాంతి ర్యాలీకీ బదులుగానే బంద్ అని, సీమాంధ్ర సభకు వ్యతిరేకంగా బంద్ కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగానే బంద్కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం వ్యవస్థను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడే శాంతి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తామని చెప్పారు. విభజనకు సహకరిస్తే ఏపీఎన్జీవోల సభను తామే విజయవంతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆయన వ్యవహార శైలికి వ్యతిరేకంగానే బంద్కు పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా సీమాంధ్రుల సభకు అనుమతి ఇచ్చారన్నారు. సంఘవిద్రోహ శక్తులపై పెట్టవలసిన కేసులను విద్యార్థులపై పెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి రాజుగారు తలచుకుంటే ఏదైనా జరుగుతుందన్నట్లుగా ఉందని విమర్శించారు.