నగరంలోని ఓ ప్రముఖ స్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్ను అవాక్కయ్యేలా చేశారు.