ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీన్ని ఈ నెల 10 (గురువారం)న అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ‘కంటి వెలుగు’ కింద రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన తనకు అత్యంత ప్రాధాన్య రంగాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపైన కూడా సీఎం దృష్టి సారించారు.