Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On TDP Mahanadu1
మహానాడు ‘ఆత్మ’కథ!

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు. మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.మహానాడు వేదికపై స్క్రీన్‌ మీద కనిపించిన ఎన్టీఆర్‌ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్‌ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.ఎన్టీఆర్‌ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్‌ ఆత్మ ప్లేట్‌ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు. ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.పార్టీ కోసం లోకేష్‌ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్‌ మీట్‌ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్‌ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్‌ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్‌ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్‌ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్‌ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్‌ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్‌ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ మోహన్‌ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.మహానాడు సమయంలోనే టెన్త్‌ క్లాస్‌ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్‌ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది. ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.జగన్‌ మోహన్‌ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్‌ సిక్స్‌’ గురించి గానీ ఏ చర్చా లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్‌ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్‌ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్‌ ఆధారపడి ఉన్నది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్‌ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్‌ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్‌ సిక్స్‌’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్‌’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్‌ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత. ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Rasi Phalalu: Daily Horoscope On 01-06-2025 In Telugu
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. పాతబాకీలు వసూలవుతాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: శు.షష్ఠి రా.12.02 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఆశ్లేష రా.1.42 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: ప.2.24 నుండి 4.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు, అమృత ఘడియలు: రా.12.15 నుండి 1.50 వరకు.సూర్యోదయం : 5.28సూర్యాస్తమయం : 6.27రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.మిథునం.... బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.సింహం... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.కన్య.... చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.తుల.... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.వృశ్చికం...... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.ధనుస్సు.... కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం..... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.మీనం... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

YS Jagan Slams Nara Lokesh Chandrababu Over 10th Valuation Errors3
బాబుగారూ.. ‘టెన్త్‌’లో మీరు, మీ కొడుకు ఫెయిల్‌: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌(Nara Lokesh) టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్‌ మార్క్స్‌ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను’’ అని జగన్‌ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్‌ ఫలితాలు సరైనవేనా?

Opal Suchata Chuangsri has been crowned Miss World 20254
Miss World 2025: మిస్‌ వరల్డ్‌ చువాంగ్‌శ్రీ

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌–2025గా థాయ్‌లాండ్‌ భామ ఒపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ(21) ఎంపికైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన 72వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలేలో ఆమె విజయం సాధించింది. ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ క్రిష్టినా పిష్కోవా ఆమెకు రూ. 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్‌ను అలంకరించింది. ఈ విజయంతో ఆమె దాదాపు రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీతోపాటు లండన్‌లో ఏడాదిపాటు నివాసం, డిజైనర్‌ దుస్తులు, నగలు వంటి బహుమతులు, ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా ఉచిత విమాన ప్రయాణ సౌలభ్యం, స్టార్‌ హోటళ్లలో ఉచిత బస వసతి పొందనుంది. మొదటి రన్నరప్‌గా ఇథియోపియాకు చెందిన హాసెట్‌ డెరెజె అడ్మాస్సు, రెండో రన్నరప్‌గా పోలాండ్‌కు చెందిన మజా క్లాజ్డా, మూడో రన్నరప్‌గా మార్టినిక్‌కు చెందిన ఆరేలీ జోచిమ్‌ నిలిచింది. భారత సుందరి నందినీ గుప్తా టాప్‌–8 జాబితాలో కూడా చోటుదక్కించుకోలేకపోయింది. అందరూ వచ్చి.. మిస్‌ వరల్డ్‌ 72వ ఎడిషన్‌ గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా జరిగింది. సాయంత్రం ఐదున్నరకే కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే 108 మంది భామలను రెడ్‌ కార్పెట్‌ మీదుగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. అనంతరం వ్యాఖ్యాత సచిన్‌ కుంభర్‌ అమెరికా–కరేబియన్, ఆసియా–ఓసియానియా, ఆఫ్రికా, యూరప్‌.. ఇలా నాలుగు భాగాలుగా విభజించి దేశాలవారీగా పోటీదారులను పరిచయం చేశారు. ఆ తర్వాత గ్రాండ్‌ ఫినాలేలో పోటీపడే టాప్‌–40 మందితో కూడిన బృందాన్ని పరిచయం చేశారు. ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున ఇందులో చేర్చారు. గత మూడు వారాలుగా జరిగిన ఐదు చాలెంజ్‌ల విజేతలైన 16 మందితోపాటు న్యాయ నిర్ణేతలు ఇచ్చిన మార్కుల ఆధారంగా మిగతా 24 మందిని వేదికపైకి ఆహ్వానించి మొత్తం 40 మందితో కూడిన బృందాన్ని సిద్ధం చేశారు. దీంతో పోటీ నుంచి వైదొలిగిన మిగతా వారు వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్థానాల్లో ఆసీనులయ్యారు. పోటీదారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రొఫైల్‌.. వారి చాతుర్యం.. మాటతీరు ఆధారంగా కేటాయించిన మార్పుల ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున ఉండే టాప్‌–20 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఆ రౌండ్‌లో వైదొలిగిన వారు వెళ్లి వారి స్థానాల్లో కూర్చోగా తదుపరి రౌండ్‌లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున టాప్‌–8 మందిని (ఆఫ్రికా: నమీబియా, ఇథియోపియా, యూరప్‌: పోలాండ్, ఉక్రెయిన్, ఆసియా–ఓíÙయానియా: ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, అమెరికా–కరీబియన్‌: బ్రెజిల్, మార్టినికా) షార్ట్‌ లిస్ట్‌ చేశారు. భారత సుందరి నందిని గుప్తా ఈ దశలోకి చేరుకోలేక నిష్క్రమించింది. ‘మీరే ఎందుకు ప్రపంచ సుందరి కావాలనుకుంటున్నారు?’ టాప్‌–8 మంది సుందరీమణుల్లోంచి టాప్‌–4 భామలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణయితలు అడిగిన ప్రశ్నలు కీలక భూమిక పోషించాయి. గతంలో వారు పొందిన మార్కులు.. ఈ ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటికప్పుడు ఇచ్చిన మార్కులు కలిపి విజేతను ఎంపిక చేశారు. తొలుత 8 మందిని ప్రజెంటర్‌ సచిన్‌ కుంభర్‌ అడిగిన ‘మీరే ప్రపంచ సుందరి ఎందుకు కావాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా తుది పోరుకు థాయ్‌లాండ్, ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్‌ సుందరీమణులను ఎంపిక చేశారు. ఉత్కంఠభరితంగా తుది పోరు... నలుగురు మాత్రమే వేదికపై ఉండి తుది పోరుకు సిద్ధమైన తరుణంలో ఆ ప్రాంగణమంతా ఉద్విగ్నత నెలకొంది. న్యాయ నిర్ణేతలైన మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈవో జూలియా మోర్లే, నటులు సోనూసూద్, రానా దగ్గుబాటి, నమ్రతా శిరోద్కర్‌ ఘట్టమనేని ఒక్కొక్కరికీ సంధించిన ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చిన సమాధానాలు వారి స్థానాలను నిర్ణయించాయి. సోనూసూద్‌ అడిగిన ప్రశ్నకు అద్భుతంగా సమాధానమిచ్చిన థాయ్‌లాండ్‌ సుందరి ఒపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ మిస్‌ వరల్డ్‌–2025గా ఎంపికైంది. సోనూసూద్‌కు మానవతావాది పురస్కారం కోవిడ్‌ సమయంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న నిరుపేద కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత రవాణా వసతి కల్పించిన సినీనటుడు సోనూసూద్‌కు మిస్‌ వరల్డ్‌ మానవతావాది’ పురస్కారాన్ని మిస్‌వరల్డ్‌ సంస్థ ప్రకటించింది. ఆయనకు రానా దగ్గుబాటి బంగారు గ్లోబ్‌ను అందించారు.

NIAT is Empowering Universities to Deliver NEP Aligned Industry Ready Education5
NIAT: విద్యతో పాటు.. ఉద్యోగానికి కూడా

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 మార్గదర్శకంలో భారతదేశ విద్యావ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మార్పుల్లో UGC, AICTE సంస్థలు విద్యను నైపుణ్యానికి పెద్దపీట వేయాలని ఎంతో కృషి చేసి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆశయాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి నెక్ట్స్‌వేవ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ (NIAT) ప్రారంభించిన యూనివర్సిటీ భాగస్వామ్య మోడల్‌ను భారతదేశంలోని పలు UGC ఆమోదం పొందిన యూనివర్సిటీలలో అమలు చేస్తున్నారు. నైపుణ్య ఆధారిత విద్యను దేశవ్యాప్తంగా అనుకరించదగినదిగా ఈ మోడల్ దృఢంగా నిలిచింది.“విద్యార్థులకు స్థిరమైన కెరీర్ ఫలితాలు తీసుకువచ్చేలా యూనివర్సిటీలను బలపరచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం” అని నెక్ట్స్‌వేవ్‌ & NIAT వ్యవస్థాపకుడు మరియు సీఈవో రాహుల్ అట్లూరి తెలిపారు. “ఒకవైపు యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్ను తమదైన విధంగా కొనసాగిస్తుంది. మరోవైపు విద్యార్థులు ఇండస్ట్రీకి సిద్ధమవడానికి అవసరమైన ప్రతిదీ - హ్యాండ్-ఆన్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ప్రాక్టికల్ సెషన్లు, కౌన్సెలింగ్, ఇంటర్న్‌షిప్, పే మెంట్స్ ఇలా కావలసిన అన్ని విషయాల్లో NIAT తోడ్పాటు అందిస్తోంది” అన్నారు.ఈ భాగస్వామ్యంలో యూనివర్సిటీ కరికులంను మెరుగుపరచడానికి NIAT ఇన్సైట్స్ ఇస్తుంది. ఈ ఇన్సైట్స్‌ను 3,000కు పైగా కార్పొరేట్ కంపెనీలు, 10,000కి పైగా టెక్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ, తమ అంతర్గత R&D, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అనేక మూలాల నుంచి NIAT సేకరిస్తోంది. ఈ ఇన్సైట్స్‌ను NIAT యూనివర్సిటీలకు సక్రియ రిపోర్ట్, వైట్ పేపర్ రూపంలో సమరిస్తుంది. వీటిలో తాజా ఇండస్ట్రీ ట్రెండ్స్, జాబ్ రోల్స్, స్కిల్స్ వంటి అంశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా AI/ML, సైబర్ సెక్యూరిటీ వంటి 4.0 టెక్నాలజీలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా యూనివర్సిటీలు UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా తమ అకడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదంతో తమ కరికులంను ఆధునీకరించుకుంటాయి.అధునాతన టెక్నాలజీలలో ప్రాక్టికల్ స్కిల్ పెంపొందించేందుకు కౌశల్య శిక్షణ కూడా NIAT మోడల్‌లో మరో ముఖ్య అంశం. విద్యార్థులకు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉండే టెక్నాలజీలపై పట్టు సాధించే విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ల్యాబ్, హ్యాండ్-ఆన్ కోడింగ్ సెషన్స్ ఉంటాయి.అలాగే, NIAT 10,000+ టెక్ ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి అందులోని ఒకరు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా నియమించి, వారు మెంటర్ చేయడం వలన విద్యార్థులు ఇండస్ట్రీలో వాడే తాజా టూల్స్ మరియు టెక్నాలజీలపై పట్టు సాధిస్తారు.“ప్రపంచ స్థాయి నిపుణులుగా తయారవాలంటే డిగ్రీతో పాటు స్కిల్, అప్టిట్యూడ్ అవసరం. NIAT సహకారంతో మా విద్యార్థులు బ్లూస్కిల్‌కు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు” అని పూణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్.కె. జైన్ అన్నారుఅనుభవపూరితంగా నేర్చుకోవాలంటే ఒక అధునాతన టెక్నాలజీ వ్యవస్థ అవసరం అవుతుంది. అందుకే NIAT ఆరంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ పాత్‌ను యూనివర్సిటీల్లో అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ విద్యార్థులు రియల్ వరల్డ్ ప్రాజెక్టులు చేయగలుగుతారు, చేసిన పనిపై వెంటనే లైవ్ ఫీడ్బ్యాక్ పొందగలుగుతారు, మరియు ఏ అంశంలో బలహీనత ఉందో చూపించి ఎలా మెరుగుపరుకోవాలో సూచిస్తుంది. ఇవి ఇప్పటివరకు టాప్ కంపెనీల బూట్‌క్యాంపుల్లో మాత్రమే ఉండేవి, కాని ఇప్పుడు విద్యార్థులకు యూనివర్సిటీ లెవెల్లో ఈ సదుపాయాలు NIAT అందిస్తోంది.యెనెపోయా డీమ్డ్ యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ ఫర్హాద్ యనపోయా మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం ప్రతి విద్యార్థికి అవసరం. NIAT సపోర్ట్ తో మా డిగ్రీ ప్రోగ్రాం మరింత శక్తివంతంగా మారింది. విద్యార్థులను టెక్నాలజీ రంగంలో స్థిరమైన కెరీర్‌కు సిద్ధం చేస్తుంది” అని అన్నారు.ఈ తరానికి కావలసింది కేవలం తరగతి గదులు కాకుండా, టెక్ తో కూడిన ఆధునాతన క్లాసులు. దృష్టిని పెంచుకుని NIAT యూనివర్సిటీలకు ఒక ప్రామాణిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ పేబుక్ అందిస్తోంది. ఇది Stanford, MIT, Harvard వంటి టాప్ యూనివర్సిటీలను బెంచ్‌మార్క్ చేసి, భారతీయ విద్యా పరిసరాలకు తగినట్లు రూపకల్పన చేయబడింది. హై-స్పీడ్ Wi-Fi, టెక్ టూల్స్‌కు సపోర్ట్ చేసే సౌండ్ AV సిస్టమ్, సౌండ్-ప్రూఫ్ గదులు, కమ్ఫర్టబుల్ మరియు ఎరోనామిక్ సీటింగ్, టీమ్‌వర్క్‌కు తగిన కోలాబరేటివ్ లేఅవుట్ వంటి ప్రాజెక్టు బేస్ లెర్నింగ్‌కు అవసరమైన సదుపాయాలు ఉంటాయి. అంతేకాకుండా, పేబుక్‌లోకి ఎర్గబుల్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్, వెండర్ టెంప్లేట్లు, రోలౌట్ మైల్‌స్టోన్స్ కూడా ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు AICTE నిబంధనలతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోగలుగుతాయి.NIATతో భాగస్వామ్యంలో యూనివర్సిటీలకు లభించే మరో గొప్ప విషయం ఇండస్ట్రీతో ఉండే డైరెక్ట్ కనెక్షన్. 3,000కి పైగా టెక్ కంపెనీలలోని అవకాశాలకు విద్యార్థులను కనెక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్థిరమైన కెరీర్ కోసం సరైన ఇంటర్న్షిప్స్, మాక్ అసెస్‌మెంట్‌లు, ఇండస్ట్రీ పే మెంట్ సెషన్లు ఉంటాయి. అంతేకాకుండా, ప్రతి విద్యార్థి ప్రగతిని ట్రాక్ చేసేందుకు డేటా డ్యాష్‌బోర్డులు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు ఒక్కో విద్యార్థి ఎంతగా ప్రిపేర్ అయ్యాడో, ఏం అవసరమో స్పష్టంగా తెలియగలుగుతాయి.చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు & ఛాన్సలర్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. “ప్రస్తుత ప్రపంచంలో స్థిరమైన కెరీర్ కోసం డిగ్రీతోపాటు స్కిల్స్ కూడా అవసరం. మా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, NIAT నుంచి ఇండస్ట్రీ-రెడీ సర్టిఫికేట్ అందుతాయి. ఇది విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి ఎంతో కీలకం” అని అన్నారు.విద్యార్థులకు ఒకవైపు యూనివర్సిటీ నుంచి UGC అప్రూవ్ బీటెక్ డిగ్రీ, మరొకవైపు NIAT నుంచి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ (IRC) కూడా లభిస్తుంది. ఈ IRC అనేది విద్యార్థులు చేసిన స్కిల్ ట్రైనింగ్, ప్రాజెక్టులు, అసెస్‌మెంట్‌ల బేస్‌పై ఇచ్చే సర్టిఫికేట్. డిగ్రీతో పాటు స్కిల్ సర్టిఫికేట్ రావడం వలన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. దీనితో పాటు, మల్టిడిసిప్లినరీ, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే UGC/AICTE లక్ష్యాలకు కూడా సరిపోతుంది.అరోరా డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీలత చెపురే మాట్లాడుతూ, “2025-26 నుంచి NIATతో కలిసి, మా కాంపస్‌లో డిగ్రీకు తోడుగా అప్‌స్కిలింగ్‌ ట్రైనింగ్ ద్వారా విద్యార్థులకు పూర్తి సెట్ అందించనాం. వారి కెరీర్ బలంగా ప్రారంభమవుతుందని మా నమ్మకం,” అన్నారు.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫీజు పూర్తిగా క్వియర్‌గా ఉంటుంది. విద్యార్థులు అకాడమిక్ ఫీజు యూనివర్సిటీకి నేరుగా చెల్లించాలి. ఇంకా, NIAT అందించే ఇండస్ట్రీ రెడినెస్ ప్రోగ్రామ్ కోసం వేరుగా (ఐచ్చికంగా) ఫీజు ఉంటుంది. ఫీజులు వేరుగా ఉండడం వలన UGC, AICTE నిబంధనలకు పూర్తి గా అనుగుణంగా ఉంటుంది.నెక్ట్స్‌వేవ్‌ & ఎన్ఐఏటీ సహ వ్యవస్థాపకులు & సీఈఓ రాహుల్ అట్లూరి.. ఇదే ప్రభుత్వం కోరుకునే నైపుణ్యాధారిత విద్య అని అన్నారు. “UGC, AICTE ఈ మార్పులకు కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి అనుగుణంగా మేము ఒక పకా మోడల్ రూపొందించాం. ఇది ఇప్పుడు యూనివర్సిటీలలో, విద్యార్థుల భవిష్యత్తులో నిజంగా మార్పు తీసుకొస్తుంది. డిగ్రీతో పాటు, ఒక భరోసా కలిగిన భవిష్యత్తును కూడా ఇస్తుంది ఈ భాగస్వామ్యం,” అన్నారు.

Will Pawan Kalyan Priority Decrease In The Coalition Government6
పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!

పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్‌ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్‌లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న

The Most Life-Destroying Word of All is Tomorrow Says Robert Kiyosaki7
జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

ప్రముఖ ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి పేరు చెప్పగానే.. ముందుగా గుర్తొచ్చేది ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకమే. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయి, ఆర్ధిక సంక్షోభం రానుంది అని సంచనల ప్రకటనలు చేసిన.. ఈయన మరో గొప్ప మాట సెప్పరూ. జీవితాన్ని నాశనం చేసే పదం, అన్నినీటికంటే ప్రమాదమైంది ఏదనే విషయాన్ని స్పష్టం చేశారు.జీవితాన్ని అన్నింటికంటే ఎక్కువ నాశనం చేసేది 'రేపు' అని వాయిదా వేయడం. వాయిదా వేయడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతూ.. పెట్టుబడి పెట్టడానికి, రుణాలను పరిష్కరించడానికి లేదా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి వేచి ఉండటం ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా దెబ్బతీస్తుందని, ఆలస్యం చిన్న సమస్యలను సైతం అధిగమించలేని అడ్డంకులను తీసుకొస్తుందని పేర్కొన్నారు.రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కియోసాకి.. దశాబ్దాలుగా ఆర్థిక అక్షరాస్యత, సాధికారత & తక్షణ చర్య వంటి వాటి గురించి చెబుతూనే ఉన్నారు. పెట్టుబడులు లేదా ఆర్థిక విద్యను ఆలస్యం చేయడం వల్ల అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని, ఇది కాలక్రమేణా గణనీయమైన నష్టాలకు దారితీస్తుందని అతని బోధనలు నిరంతరం హైలైట్ చేస్తాయి.రేపు అన్న పదం కేవలం అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇది బరువును పెంచేస్తుంది. వాయిదా లేదా ఆలస్యం అనేది కేవలం ఒక తాత్విక అంశం కాదు. ఇది మారుతున్న ఆర్థిక వాతావరణంలో లోతుగా ప్రతిధ్వనించే ఆచరణాత్మక హెచ్చరిక. 'రేపు' అనే పదం చిన్నదే కావచ్చు, కానీ పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇది ఒకరి ఆర్థిక భవిష్యత్తును నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి 2024 - 2025 అంతటా, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్ అనూహ్యత ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాలపై విపరీతమైన ఒత్తిడిని కలిగించాయి. కియోసాకి సలహాను పాటించిన వ్యక్తులు, రుణాన్ని నిర్వహించడం, అత్యవసర పొదుపులను సృష్టించడం లేదా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితులను ముందుగానే పరిష్కరించుకున్న వ్యక్తులు, సాధారణంగా చర్యను వాయిదా వేసిన వారి కంటే ఈ తుఫానులను మరింత విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి "రేపు"పై ఆధారపడిన వారు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయారు.. ఆర్థిక స్వాతంత్ర్యానికి దూరంగా ఉన్నారని పలువురు చెబుతున్నారు.

Indian Data Centre Sector to See 25Billion dollers Investment by 20308
డేటా సెంటర్ల బూమ్‌.. 

న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్‌ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్‌ ఎస్టేట్‌ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్‌ చ.అ.లుగా ఉన్న స్పేస్‌ 2030 నాటికి 55 మిలియన్‌ చ.అ.లకు చేరనుంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ కొలియర్స్‌ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. క్లౌడ్‌ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. పరివర్తన దశలో పరిశ్రమ.. ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్‌ రియల్‌ ఎస్టేట్‌ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్‌ టైమ్‌ అనాలిసిస్, మెరుగైన యాప్‌ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది. 2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్‌ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్‌ సేవలు అందించడంలో భారత్‌కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్‌ మొత్తం మీద 1.15 బిలియన్‌ సింగపూర్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తోంది. 2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. భారత డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్‌ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలు, కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌ (సీడీఎన్‌) సేవల సంస్థల నుంచి డిమాండ్‌ నెలకొన్నట్లు నె్రక్ట్‌సా బై ఎయిర్‌టెల్‌ సీఈవో ఆశీశ్‌ ఆరోరా తెలిపారు. ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్‌ డేటా సెంటర్లు, 14 హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్‌పూర్, గంగాగంజ్‌లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్‌ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు. వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్‌ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్‌.. హై–డెఫినిషన్‌ స్ట్రీమింగ్‌కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్‌విడ్త్‌ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్‌ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్‌ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే గ్రేటర్‌ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్‌స్కేల్‌ క్యాంపస్‌ల విస్తరణపై యోటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. క్యాపిటల్యాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ తమ నవీ ముంబై సెంటర్‌పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్‌టీటీ జీడీసీ ఇండియా, ఎన్‌టీటీ గ్లోబల్‌ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్‌స్కేల్‌ సెంటర్స్‌తో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.హైదరాబాద్, ముంబై సారథ్యం.. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యకాలంలో భారత్‌లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్‌ వర్ధమాన హైపర్‌స్కేల్‌ హబ్‌గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి.

Mumbai Indians face Punjab Kings in Qualifier 29
ఫైనల్‌ చేరేదెవరో!

అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ 18వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటికే ఫైనల్‌ చేరగా... రెండో ఫైనలిస్ట్‌ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం క్వాలిఫయర్‌–2లో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ తలపడనుంది. క్వాలిఫయర్‌–1లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పంజాబ్‌... ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది. మరో వైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి... ఎలిమినేటర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుచేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్‌పై గెలిచి ఫైనల్‌ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫయర్‌–1లో టాపార్డర్‌ విఫలమవడంతో పంజాబ్‌ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకోగా... ఎలిమినేటర్‌లో గుజరాత్‌ బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్‌ విజయం సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ సమష్టి ప్రదర్శన ముందు... ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయిన పంజాబ్‌ కింగ్స్‌ ఏమాత్రం నిలుస్తుందో చూడాలి! టాపార్డర్‌ రాణిస్తేనే... ఈ సీజన్‌లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఏడింట రెండొందల పైచిలుకు స్కోర్లు చేసిన పంజాబ్‌ జట్టు... టాపార్డర్‌ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్‌క్యాప్‌డ్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ప్రియాన్ష్ ఆర్య నిలకడకు ఇన్‌గ్లిస్, శ్రేయస్‌ మెరుపులు తోడవడంతో పంజాబ్‌ వరస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫయర్‌–1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో... జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్‌’కు చేర్చిన శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీకి... రికీ పాంటింగ్‌ వ్యూహాలు తోడవడంతో ఈ సీజన్‌లో పంజాబ్‌ పట్టికలో అగ్ర స్థానం దక్కించుకోగలిగింది. దీంతోనే క్వాలిఫయర్‌–1లో ఓడినా... ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం దక్కింది. ఈ సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 517 పరుగులతో పంజాబ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించగా... శ్రేయస్‌ 516, ప్రియాన్ష్ 431 పరుగులు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్‌ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగని స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఈ మ్యాచ్‌ ఆడటం ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్‌ సింగ్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్‌ బ్రార్‌ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్‌’కు చేరిన పంజాబ్‌ ఇక్కడితోనే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది. బుమ్రానే ప్రధాన తేడా! ఐపీఎల్‌ నాకౌట్స్‌లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్‌ జట్టు మరోసారి కలిసికట్టుగా కదంతొక్కి ఆరో టైటిల్‌ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా... వారి స్థానాలను భర్తిచేసే ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసి రానుంది. లీగ్‌ దశ ముగిసిన తర్వాత రికెల్టన్, విల్‌ జాక్స్‌ జట్టును వీడినా... గత మ్యాచ్‌లో తొలిసారి ముంబై జట్టుకు ప్రాతనిధ్యం వహించిన జానీ బెయిర్‌స్టో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ కూడా టచ్‌లోకి రావడం ముంబై బ్యాటింగ్‌ బలాన్ని మరింత పెంచింది. రోహిత్, బెయిర్‌స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే... సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో 673 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నాడు. ఆలస్యంగా వేగం పుంజుకున్న రోహిత్‌ 410 పరుగులు చేయగా... హార్దిక్‌ పాండ్యా, నమన్‌ ధీర్‌ ఫినిషర్ల పాత్ర పోషిస్తున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దీపక్‌ చహర్‌ అందుబాటులో ఉండటం కష్టమే కాగా... గత మ్యాచ్‌ చివర్లో కండరాలు పట్టేసిన గ్లీసన్‌ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రా కానున్నాడు. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను... పంజాబ్‌ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, జోస్‌ ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, హర్‌ప్రీత్‌ బ్రార్, జెమీసన్, చాహల్, అర్ష్ దీప్‌. ముంబై ఇండియన్స్‌: హార్దిక్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, బెయిర్‌స్టో, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, నమన్, సాంట్నర్, రాజ్‌ బావా, గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్‌. పిచ్, వాతావరణం ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో టాస్‌ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు. ఐపీఎల్‌లో నేడు (క్వాలిఫయర్‌–2)పంజాబ్ X ముంబైవేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

Indian Armed Forces Top General On Op Sindoor Losses10
మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్‌

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నేరుగా పాక్ లో కి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను భారత్ నేలమట్టం చేసింది. దీన్ని తిప్పికొట్టాలని పాక్ ప్రయత్నించినా ఆపరేషన్ సిందూర్ విధ్వంసాన్ని ఆపడం వారి వల్ల కాలేదు. ఆపరేషన్ సిందూర్ తో పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యిందనే నిజాన్ని కూడా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ధృవీకరించారు.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దీన్ని లేవెనెత్తింది. భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందా.. లేదా చెప్పాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్రం ఏమీ క్లారిటీ ఇవ్వకపోయినా, భారత బలగాల సీడీఎస్(చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్) అనిల్ చౌహాన్ ఎట్టకేలకు తొలిసారి స్పందిస్తూ.. ‘ అవును.. పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఫైటర్ జెట్స్ ను కోల్పోయిన మాట వాస్తవమే. యుద్ధం అన్నాక కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్ని కోల్పోయాం అనేది ప్రశ్న కాదు.. ఎందుకు కోల్పోయాం అనేది మాత్రమే సమీక్షించుకోవాలి. అయితే పాకిస్తాన్ చెప్పినట్లు ఆరు ఫైటర్ జెట్స్ ను మనం కోల్పోలేదు. అందులో వాస్తవం లేదు’ అని స్పష్టం చేశారు. సింగపూర్ లోని బ్లూమ్ బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అనిల్ చౌహాన్. అయితే కోల్పోయిన ఫైటర్‌ జెట్స్‌ ఏమిటనేది మాత్రం చెప్పలేదు. అదే సమయంలో ఎన్ని ఫైటర్‌ జెట్స్‌ కోల్పోయమనేది కూడా చెప్పలేదు. అది ప్రస్తుతం అప్రస్తుతం అన్న రీతిలోనే ఆయన సమాధానం చెప్పారు. ఇక్కడ సంఖ్య అనేది ముఖ్యం కాదంటూ బదులిచ్చారాయన.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement