
‘పేట’ టు ‘కోట’
నిరుపేదలు అతితక్కువ ఖర్చుతో ప్రయాణించే పుష్పుల్ ప్యాసింజర్ను కాజీపేట -వరంగల్ మధ్య రద్దు చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేఅధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
- పుష్పుల్ స్టార్టింగ్ పాయింట్ కాజీపేటకు మార్చే యోచనలో రైల్వే అధికారులు
- సర్వే చేసిన అధికారుల బృందం
- పుష్పుల్ను వరంగల్ నుంచే నడపాలని ప్రయాణికుల డిమాండ్
కాజీపేట రూరల్, న్యూస్లైన్ : నిరుపేదలు అతితక్కువ ఖర్చుతో ప్రయాణించే పుష్పుల్ ప్యాసింజర్ను కాజీపేట -వరంగల్ మధ్య రద్దు చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేఅధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే జరిగితే వరంగల్ నుంచి నడస్తున్న పుష్పుల్ రైలు ఇక మీదట కాజీపేట జంక్షన్ నుంచి బయల్దేరుతుంది. ఈ వైపుగా రైల్వే అధికారులు చర్యలు చేపట్టడంతో వరంగల్ నుంచి నిత్యం ఈ రైలులో తెల్లవారుజామున హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం రైల్వేశాఖ పేదల కోసం పుష్పుల్ రైళ్లను ప్రవేశపెట్టింది. మన జిల్లాకు కూడా పుష్పుల్ వచ్చింది. ఈ రైలు ప్రారంభంలో కాజీపేట జంక్షన్ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి కాజీపేటకు అప్ అండ్ డౌన్ నాలుగు ట్రిప్లు నడిచే ది. నాలుగేళ్ల క్రితం ఈ రైలును వరంగల్ స్టేషన్ నుంచి నడిపించాలని అప్పటి ఎంపీలు, ప్రయాణికులు అప్పటి రైల్వేజీఎం డిఎన్.మాథూర్ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి రైలునువరంగల్ నుంచి బయల్దేరేలా చర్యలు తీసుకున్నారు.
ఇది పుష్పుల్ షెడ్యూల్..
వరంగల్లో రోజు తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరి కాజీపేటకు చేరుకుని హైదరాబాద్ వెళ్తుంది. అక్కడి తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం 1.20 గంటలకు కాజీపేట జంక్షన్ మీదుగా వరంగల్కు వెళ్తుంది. వరంగల్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి హైదరాబాద్ వెళ్తుంది. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి రాత్రి 10 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అయితే చివరి ట్రిప్పులో మాత్రం వరంగల్కు వెళ్లదు. తిరిగి తెల్లవారుజామున కాజీపేట నుంచి 4.15 గంటలకు వరంగల్కు వెళ్తుంది. వరంగల్ నుంచి హైదరాబాద్కు నిర్ణీత సమయానికి బయల్దేరుతుంది. వరంగల్లో రైల్వేకార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, వ్యాపారస్తులు, ఇతరులతోపాటు ప్రతిరోజు 600 మంది వరకు పుష్పుల్ ఎక్కుతారు. కూర్చునే సీటు లేకుండా రద్దీతో ఆ రైలు కాజీపేటకు వస్తుంది.
ఆలస్యమవుతోందని.. అనాలోచిత నిర్ణయం..
ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉన్న పుష్పుల్ ప్యాసింజర్ను ఆలస్యంగా వస్తుందనే కారణంతో కాజీపేట-వరంగల్ మధ్య రద్దు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట జంక్షన్ నుంచి రైల్వే అధికారుల బృందం సర్వే కోసం శనివారం పుష్పుల్ రైల్లో కాజీపేట నుంచి వరంగల్కు, వరంగల్ నుంచి జనగామ వరకు ప్రయాణించి అందులో ప్రయాణించే ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పుష్పుల్ ప్రస్తుతం ఏ విధంగా నడుస్తుందో అలాగే నడిపించాలని ప్రయాణికుల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది.
జంటనగరాల మధ్య రద్దు చేయండి
సమయాన్ని కుదించడానికి రైలును హైదరాబాద్ వరకు కాకుండా సికింద్రాబాద్ వరకే నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జంటనగరాల మధ్య ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి పుష్పుల్ సర్వీస్ అక్కడ అవసరం లేదని పేర్కొంటున్నారు. ఏదేమైనా రైల్వే అధికారులు మాత్రం పుషపుల్ను వరంగల్ నుంచే నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఎంపీలు, మంత్రులు రైల్వే జనరల్మేనేజర్తో మాట్లాడాలని కోరుతున్నారు.