
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కూల్చివేతలు జరగగా, తాజాగా సీఆర్డీఏ అధికారులు బుధవారం క్యాంటీన్ను కూల్చివేశారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు క్యాంటీన్ కూల్చివేయడాన్ని క్యాంటిన్ నిర్వహకులు తప్పుబట్టారు. మంత్రి నారాయణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యాంటీన్ నిర్వహించేందుకు మూడేళ్లు లీజుకు ఇచ్చారని, రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాక...ఇప్పుడు కూల్చివేతలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సచివాలయంలో పలు బ్లాక్లను కూల్చి అధికారులు మళ్లీ కట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఆర్డీఏ అధికారులు మాత్రం కూల్చివేతలపై పెదవి విప్పడం లేదు. కాగా వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఇప్పటికే పలుసార్లు మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.