
పులివెందుల/వేంపల్లె: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. వారు ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ ఘాట్కు చేరుకున్నారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద మౌనం పాటించి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి వఎస్సార్ ఘాట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రులు అంజాద్ బాషా, నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్బాబు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గౌతమి తదితరులు ఉన్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్ష, చెల్లెలు షర్మిలమ్మ, ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు.