
ఒడిశా తీరం దాటిన వాయుగుండం
విశాఖపట్నం: గోపాల్పూర్ - పూరీ మధ్య వాయుగుండం ఒడిశా తీరం దాటిందని తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం వెల్లడించింది. వాయుగుండం పూల్బనికి 9 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం క్రమేపి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఉత్తరకోస్తాలో తీరం వెంబడి గంటకు 45 - 60, దక్షిణ కోస్తాలో 45 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. కోస్తా అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను తుపాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.