స్వైన్ ఫ్లూ రోజురోజుకు రాష్ట్రమంతటా విస్తరిస్తోంది.
సాక్షి, నెట్వర్క్: స్వైన్ ఫ్లూ రోజురోజుకు రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ తల్లి, కూతురికి స్వైన్ ఫ్లూ సోకగా, మరోవైపు గుంటూరు, అనంతపురానికి చెందిన వ్యక్తులు ఈ వ్యాధితో హైదరాబాద్లో మరణించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రిటైర్డు బ్యాంకు ఉద్యోగి శివప్రసాద్ కూతురు ప్రవల్లిక హైదరాబాదు నుంచి అనారోగ్యంతో పట్టణానికి చేరుకుంది. ఆమె తల్లి హరిప్రియకు కూడా జ్వరం రావడంతో వారిద్దర్నీ తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు అనుమానంతో వారి శాంపిల్స్ను హైదరాబాద్కు పంపగా వారికి వ్యాధి సోకినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా బొప్పూడికి చెందిన కుర్రా శ్రీనివాసరావు(40) స్వైన్ఫ్లూతో హైదరాబాద్లో మంగళవారం మరణించాడు. అలాగే అనంతపురం జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్కు చెందిన సుఖేశిని(65) కూడా స్వైన్ఫ్లూతో హైదరాబాద్లో మృతి చెందింది. మరోవైపు విశాఖలోని గోపాలపట్నంకు చెందిన 15 ఏళ్ల బాలికకు స్వైన్ఫ్లూ సోకింది.