Swine Flu
-
Chhattisgarh: స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి.. అరోగ్యశాఖ అప్రమత్తం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యింది. వ్యాధి లక్షణాల గురించి అధికారులు మరింత విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అనుమానిత రోగులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.అనారోగ్యం బారినపడిన కొరియా జిల్లాలోని పండోపరా గ్రామానికి చెందిన 51 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్య పరీక్షలు జరపగా, స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో బాధితురాలిని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ బాధితురాలి పరిస్థితి మరింత దిగజారింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమెను వెంటిలేటర్పై ఉంచారు. శుక్రవారం బాధితురాలు మృతిచెందింది.రెండవ కేసు విషయానికొస్తే జంజ్గిర్ చంపాలోని లక్షన్పూర్ గ్రామంలో నివసిస్తున్న 66 ఏళ్ల మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. స్వైన్ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకు అపోలో ఆస్పత్రిలో 9 మంది స్వైన్ఫ్లూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరిలో ఐదుగురు బిలాస్పూర్ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఐదుగురు బాధితులు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్యశాఖ ప్రతిరోజూ సేకరిస్తోంది. -
కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్ ఫ్లూ కూడా నిర్ధారణ!
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడయ్యింది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ ‘గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించాను. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వచ్చే ఏడు రోజుల పాటు నేను ఎవరినీ కలవలేను. మారుతున్న ఈ సీజన్లో అందరూ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వాతావరణం మారుతోంది. ఇటువంటి వాతావరణంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని’ దానిలో పేర్కొన్నారు. -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా విసురుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, కళ్లమంటలు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ సీజనల్ జ్వరాల బారినపడినట్లు సమాచారం. బాధితుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాల్లో సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం మారడంతో.. ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. చలిగాలులు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాలను ఐసీఎంఆర్ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఐసీఎంఆర్ చేసిన సీరో సర్వేలో 92 శాతం మందికి తీవ్రమైన జ్వరంతోపాటు దగ్గు, కళ్ల మంటలు, నిమోనియా (హెచ్3ఎన్2 వైరస్) లక్షణాలున్నట్లు గుర్తించింది. సాధారణ స్వైన్ఫ్లూ కంటే ఈ వైరస్ తీవ్రత కొంత ఎక్కువున్నట్లు పేర్కొంది. పదేళ్ల క్రితం తగ్గినట్లే తగ్గి.. 2009లో హైదరాబాద్లో తొలిసారిగా స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు హెచ్1ఎన్1 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ప్లూ జాబితాలో చేరింది. అడపాదడపా కేసులు నమోదవుతున్నప్పటికీ రోగనిరోధకశక్తి పెరగడం, చికిత్స సులభతరం కావడంతో ఆ తర్వాత పెద్దగా ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఈ వైరస్ హెచ్3ఎన్2గా రూపాంతరం చెంది మరింత బలపడింది. సాధారణంగా చలి ప్రదేశంలో ఈ వైరస్ విస్తరిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా వేసవిలోనూ విజృంభిస్తోంది. జనసమూహాలతో వ్యాపిస్తూ.. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు భారీగా ఒకచోట చేరుతున్నారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం ఫ్లూ బాధితులతో రద్దీగా మారుతున్నాయి. బాధితుల్లో జ్వరం 3–5 రోజులపాటు ఉంటుండగా దగ్గు 10–15 రోజులపాటు వేధిస్తోంది. సకాలంలో వైరస్ను గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన నిమోనియాకు కారణమవుతోంది. ఆందోళన అక్కర్లేదు వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటాయి. హెచ్3ఎన్2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదు. ఇది కూడా ఓ సాధారణ ఫ్లూనే. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జన సమూహంలోకి వెళ్లకపోవడం, విధిగా మాస్క్లు ధరించడం, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. చికిత్సల్లో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. ఇది సాధారణ మందులతోనే నయమవుతుంది. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
TS: మూడేళ్ల తర్వాత అక్కడ స్వైన్ఫ్లూ కలకలం.. బాలికకు పాజిటివ్!
మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో మూడేళ్ల తర్వాత మరో స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని టీచర్స్కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇచ్చిన శాంపిల్ పరీక్ష చేయగా స్వైన్ఫ్లూ పాజిటివ్ వచ్చింది. జిల్లాలో చివరగా 2019 ఆగస్టులో స్వైన్ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు ఇలా.. ఇది హెచ్1 ఎన్1 రకం ఇన్ఫ్లూ ఎంజా వైరస్. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. గతంలో పందులు తిరుగుతున్న ఆవరణలో దగ్గరగా ఉన్న వారికి వచ్చేది. ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా త్వరగా సోకుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే.. స్వైన్ఫ్లూ టీకా, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులోకి రాకుండా చూడాలి. ఆక్సిజన్తోపాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు వాడాల్సి ఉంటుంది. వారికే ఎక్కువగా.. స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వైన్ఫ్లూ కేసుల నమోదు ఇలా.. ఏడాది పాజిటివ్ కేసులు 2013 3 2014 5 2015 37 2016 3 2017 5 2018 4 2019 4 2022 1 జాగ్రత్తలు పాటించండి జిల్లాకేంద్రంలో ఒకరికి స్వైన్ఫ్లూ రావడంతో కుటుంబ సభ్యులను ఐసోలేషన్లో ఉంచడంతోపాటు అవసరమైన మందులు ఇచ్చాం. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వైరస్ సోకిన వారు ఎక్కువ సమయం నిద్రించడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. – కృష్ణ, డీఎంహెచ్ఓ -
గర్భిణిని కాటేసిన స్వైన్ఫ్లూ.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ..
సాక్షి, మైసూరు: స్వైన్ఫ్లూ (హెచ్1ఎన్1) లక్షణాలతో గర్భిణి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఇక్కడి కోణనహొసహళ్లి గ్రామానికి చెందిన స్వామినాయక కుమార్తె ఛాయ (26) తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్1ఎన్1గా గుర్తించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హెచ్కే ప్రసాద్ వివరాలు తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి: Karnataka: పోక్సో కేసులో మురుఘ మఠాధిపతి అరెస్ట్ -
వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం. స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది. కలరా కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు. స్మాల్ఫాక్స్ అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం. సూరత్ ప్లేగు భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం. డెంగ్యూ, చికున్గున్యా 1635లో వెస్టిండీస్లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఎన్సెఫలిటిస్(మెదడువాపు) జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం. నిఫా వైరస్ జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం. సార్స్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది. -
అవి ఆరోగ్యంగా ఉంటే.. మనమూ ఉన్నట్టే!
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను నివారించేందుకు మనకున్న మేలైన మార్గం పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటమేనని హెల్త్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ చెబుతోంది. ఎందుకంటే కనీసం 13 వ్యాధులు మనుషుల నుంచి జంతువులకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాడిపశువుల రంగానికి ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. పాడి పశువులు, పౌల్ట్రీ, మాంసం కోసం పెంచే మేక, గొర్రె వంటి జంతువులపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. జంతువులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీలు కూడా ఈ సంస్థలో భాగమే. ఏటా కొత్తగా బయటపడుతున్న ఐదు వ్యాధుల్లో మూడు జంతువుల నుంచి సంక్రమించేవే. వ్యాధుల కారణంగా ఏటా కనీసం 20 శాతం పాడిపశువులు మరణిస్తుంటాయని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనీసం వందకోట్ల మందిపై ఉంటుందని ఈ సంస్థ చెబుతోంది. (చదవండి: భవిష్యత్ మహమ్మారి జీ4..!) గత 12 ఏళ్లలో వ్యాధుల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆరుసార్లు పెద్దసంఖ్యలో పాడిపశువులు మరణించాయని, గాలికుంటు వ్యాధి, స్వైన్ఫ్లూ, ఏవియన్ బర్డ్ ఫ్లూ వంటి వాటి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని ఈ సంస్థ అంచనా. ఈ వ్యాధుల నియంత్రణకు, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు 1995 నుంచి 2008 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యాయి. యాంటీబయాటిక్లను అందివ్వడం ద్వారా జంతువ్యాధుల్ని చాలా వరకూ నివారించవచ్చునని తద్వారా వాటిని సంరక్షించుకోవడమే కాకుండా.. వాటిపై ఆధారపడ్డవారి నష్టాలను కూడా తగ్గించవచ్చునని ఈ సంస్థ చెబుతోంది. (జూనోసిస్ డే...) -
చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్
బీజిగ్: ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగానే.. మరో కొత్త రకం స్వైన్ ఫ్లూ వైరస్ ఒకటి ప్రస్తుతం చైనాను కలవరపెడుతోంది. ఇది గతంలో విస్తరించిన స్వైన్ ఫ్లూ వైరస్ కంటే ఎంతో ప్రమాదకరమైనదని.. అంటువ్యాధిగా మారే లక్షణాలు కలిగి ఉందని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్ఏఎస్ సోమవారం ప్రచురించింది. జీ4 అని పిలువబడే ఇది జన్యుపరంగా 2009లో స్వైన్ ఫ్లూకు కారణమైన హెచ్1ఎన్1 జాతి నుంచి వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఇది మానవులకు సోకడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. (చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ) పరిశోధకులు 2011 నుంచి 2018 వరకు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆస్పత్రులు, కబేళాలలో పందుల నుండి 30,000 వేల స్వాబ్స్ను సేకరించి పరిశోధనలు జరిపారు. దాదాపు 179 స్వైన్ ఫ్లూ వైరస్లను ఐసోలేట్ చేసినట్లు తెలిపారు. అయితే 2016 నుంచి కొత్త రకం వైరస్ ఒకటి పందులలో బాగా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు ఫెర్రోట్స్తో సహా పలు ప్రయోగాలు చేశారు. ప్లూ పరిశోధనల్లో ఈ ఫెర్రోట్స్ టెస్ట్ను బాగా ఉపయోగిస్తారు. ఎందుకుంటే ఈ వ్యాధి సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలే కనపడతాయి. అయితే తాజాగా గుర్తించిన జీ4 చాలా ప్రమాదకరమైన అంటువ్యాధిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫెర్రెట్ల కంటే తీవ్రమైన లక్షణాలు కలిగి ఉందని తెలిపారు. సాధారణ ఫ్లూ నుంచి మానవుల్ని రక్షించే రోగనిరోధక శక్తి ఈ జీ4 నుంచి కాపాడలేదని పరీక్షలు తెలుపుతున్నాయన్నారు. (చైనాకు పాశ్చాత్య సెగ) ఇప్పటికే 4.4 శాతం మంది జనాభా ఈ జీ4 బారిన పడినట్లు పరీక్షల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు గుర్తించామన్నారు. అయితే ఇది మానవుడి నుంచి మానవునికి వ్యాపిస్తుందనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదన్నారు. ఒకవేళ జీ4 వైరస్ మానవుల్లో ఒకరి నుంచి ఇతరులకు వ్యాపిస్తే.. మహమ్మారిగా మారే ప్రమాదం అధికంగా ఉందన్నారు. కనుక పందులతో పని చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. ‘జూనోటిక్ రోగకారకాలు రోజురోజుకు అభివృద్ధి చెందుతుండటంతో మానవులు నిరంతరం ప్రమాదంలో ఉన్నారు. వన్యప్రాణుల కంటే కూడా మానవులకు ఎక్కువ సంబంధం ఉన్న వ్యవసాయ జంతువుల నుంచి ఈ మహమ్మారి వైరస్లు ఎక్కువ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నది’ అని అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ మెడిసిన్ విభాగం చీఫ్గా పని చేస్తున్న జేమ్స్ వుడ్ తెలిపారు. వైరస్ జంతువు నుంచి మానవులకు వ్యాప్తి చెందటాన్ని జూనోటిక్ ఇన్ఫెక్షన్ అంటారు. -
అస్సాంలో ఆఫ్రికన్ ఫ్లూ కలకలం
గువహటి : భారత్లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఫిబ్రవరిలో అస్సాంలో తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైంది. ప్రస్తుతం అది తీవ్రరూపం దాల్చి 15,600 పందులు మరణించాయని ఆ రాష్ర్ట పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. వ్యాధి నివారణకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అతుల్ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. (ఒకపక్క కరోనా, మరోపక్క వరదలు ) ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 15,600 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. పంది పెంపకం దారులకు ఉపశమనం కలిగించే దిశగా పంది మాంసం అమ్మకం, వినియోగం విషయంలో కొన్ని నిబంధనలపై సడలింపు ఇచ్చామని అతుల్ బోరా చెప్పారు. (టాపర్గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు ) -
చైనా నుంచే వ్యాప్తి: భయపెడుతున్న స్వైన్ ఫీవర్
గువాహటి: భారత్లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి అసోంలో ఇప్పటి వరకు దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. ఫిబ్రవరిలో ఇక్కడ తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అది కాస్తా క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. (వైరస్లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి ) పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 14,919 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో పరిస్థితిని కేంద్రానికి వివరించి అప్రమత్తం చేశామని తెలిపారు మరోవైపు బాధిత పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. (మాస్కు ఉల్లంఘన: హైదరాబాద్ టాప్ ) ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది జంతువులకు సోకే వైరస్. ఇది మనుషులకు వ్యాప్తి చెందదు. ఒక జంతువు నుంచి ఇతర జంతువులకు సోకే ఈ వైరస్ భారత్లో వ్యాపించడం ఇదే మొదటిసారి. చైనా నుంచి ఈ వ్యాధి వచ్చినట్లు అసోం పేర్కింది. ఇది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో కూడా వ్యాపించింది. (దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!) -
దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!
గువహటి : అసలే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజాగా మరో వైరస్ వెలుగుచూసింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా పిలిచే ఈ వైరస్ మొట్టమొదటిసారిగా అస్సాంలో బయటపడిందని ప్రభుత్వం వెల్లడించింది. భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఎడి) ఈ వైరస్ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఎఎస్ఎఫ్) అని ధృవీకరించినట్లు తెలిపింది. అయితే దీనివల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం లేదని, దీనికి కోవిడ్తో ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. అస్సాంలో ఇప్పటివరకు 306 గ్రామాల్లో ఈ వైరస్ ప్రబలి 2,500 పందులు మరణించాయి. (ఆపత్కాలంలో అస్సాం కీలక నిర్ణయం!) పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే తాము ఆ పనిని చేయమని, ప్రత్యామ్నాయ పద్దతుల్లో అడ్డుకట్ట వేస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా వైరస్ ప్రబలిన జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు పందుల రవాణా ఆపేశామని తెలిపింది. పొరుగు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అస్సాం పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా అన్నారు. ఈ వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తిచెందలేదని, ఇప్పటికే నమూనాలు సేకరించి మూడు ప్రత్యేక ల్యాబ్ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2019 ఏప్రిల్లో ఈ వైరస్ చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్ గ్రామంలో బయటపడిందని, అక్కడినుంచి అరుణాచల్ మీదుగా అస్సాంలో వ్యాధి ప్రబలడానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే వైరస్ పెద్దగా ప్రమాదం కాదని, వ్యాధి ప్రబలని ప్రాంతాల్లో పంది మాంసం తినొచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు. (కరోనా కలకలం: అసోం ఎమ్మెల్యే అరెస్టు ) -
కరోనా వైరస్ మాటున స్వైన్ ఫ్లూ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో కాలానుగుణంగా సంక్రమించే వైరస్ అంటు వ్యాధులను మొదటి సారిగా 2009లో గుర్తించారు. జనవరి నుంచి మార్చి, జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఈ వైరస్ల వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారు. 2019లోనే భారత దేశాన్ని స్వైన్ ఫ్లూ కుదిపేసింది. శాస్త్ర విజ్ఞాన పరిభాషలో ‘హెచ్1ఎన్1’గా వ్యవహరించే ఈ వైరస్ కేసులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో భారత్లో రెట్టింపు అయ్యాయి. (చదవండి: ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం) ఈ ఏడాది కూడా మార్చి వరకు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు 1100 దాఖలుకాగా, 28 మంది మరణించారు. ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ఫిబ్రవరి నెలలో జర్మనీకి చెందిన కంపెనీ స్వాప్ భారత్లోని తన యూనిట్ను మూసివేసింది. బెంగళూరులోని తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్ సోకడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి మొదటి వారానికి ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 78 కేసులు నమోదయ్యాయి. వారిలో 19 మంది పోలీసులు అస్వస్థులుకాగా వారిలో 9 మంది మరణించారు. అదే నెలలో ఈ వైరస్ కారణంగా ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జీలు అస్వస్థులయ్యారు. 2018 సంవత్సరంలో పోల్చినట్లయితే 2019లో స్వైన్ ప్లూ కేసులు రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి అశ్వణి కుమార్ చౌబే స్వయంగా లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. మరణాలు కూడా అదే నిష్పత్తిలో పెరిగాయి. కోవిడ్ మహమ్మారి గురించి వార్తలు వెలువడడంతో ఈ స్వైన్ ఫ్లూ కేసులు మరుగున పడిపోయాయి. వాస్తవానికి రెండు వైరస్ల లక్షణాలు ఒకే రీతిగా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు మంట, శ్వాస ఇబ్బంది, జ్వరం బాధిస్తాయి. వైరస్ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకటే! (కరోనా ఎఫెక్ట్ : అలిపిరి టోల్గేట్ మూసివేత) -
గంటలోపే స్వైన్ఫ్లూ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయని, అయితే కరోనా (కోవిడ్) వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకున్న ముందస్తు ప్రణాళికలను కూడా తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్వైన్ఫ్లూ, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడిన రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సహాయం అందడం లేదని నగరానికి చెందిన డాక్టర్ కరుణ, మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో పాటు, న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను కూడా పిల్గా పరిగణించిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. స్వైన్ఫ్లూ (హెచ్1ఎన్1) వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. స్వైన్ఫ్లూ పరీక్షా కేంద్రాలు మూడు మాత్రమే ఉన్నాయని, మరో 14 చోట్ల ఏర్పాటు చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్తు వివరించారు. మార్చి నెలాఖరులోగా ఈ యంత్రాలు వినియోగంలోకి వస్తాయని, ఇవి వస్తే ఒక చిప్ ద్వారా అనుమానితుడిని పరీక్షించి ఒక్క గంట వ్యవధిలోనే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెలువరించ వచ్చునని తెలిపారు. ప్రస్తుతం స్వైన్ఫ్లూ పరీక్షలు నిర్వహించే యం త్రాలు నారాయణ గూడలోని ఐపీఎం, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రుల్లోనే ఉన్నాయని చెప్పారు. కొత్తగా కొనుగోలు చేయ బోయే యంత్రాలను కింగ్ కోఠి, ఖమ్మం, గద్వాల, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రులు, ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, భువనగిరి ఏరియా ఆస్పత్రులు, బార్కాస్, హుజూరాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, శామీర్పేట, పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 187 స్వైన్ఫ్లూ కేసులు నిర్ధారణ ప్రభుత్వాసుపత్రుల్లో 253 స్వైన్ఫ్లూ నమూనాలను పరీక్షిస్తే 26 మందికి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1,200 నమూనాలను పరీక్షిస్తే 161 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్వైన్ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. స్వైన్ఫ్లూ సాంకేతిక కమిటీ గత జనవరి 2న సమావేశమైందని, జిల్లా స్థాయిలో అవగాహనా సమావేశాల నిర్వహణ, నమూనాల సేకరణ, ఇతర అంశాలపై శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల పోస్టర్లు, 15 లక్షల కరపత్రాలను ముద్రించామని, ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డీఈవోలను ఆదేశించామన్నారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. వాదనల అనంతరం కోవిడ్పై తీసుకున్న జాగ్రత్తలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ మార్చి 6కి వాయిదా వేసింది. -
కన్నబిడ్డను చూడకుండానే..
సాక్షి, హైదరాబాద్: నవమాసాలు మోసి, బిడ్డను కని.. అమ్మతనాన్ని ఆనందించకుండానే ఆ తల్లి కన్నుమూసింది. మరోపక్క పుట్టిన బిడ్డ కనీసం ముర్రుపాలకూ నోచుకోలేదు. తల్లి స్పర్శకు నోచుకోక ఆస్పత్రి ఎన్ఐసీయూలో ప్రస్తుతం ఆ శిశువు క్షేమంగా ఉన్నా.. తల్లిని కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. కరీంనగర్కు చెందిన గర్భిణి షహనాజ్ (24) తీవ్ర జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతుండటంతో వరంగల్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. స్వైన్ఫ్లూగా అనుమానించిన వైద్యులు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆమెను బంధువులు వెంటిలేటర్ సాయంతో ఈ నెల 18న రాత్రి పొద్దుపోయాక గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, స్వైన్ఫ్లూ పాజిటివ్గా తేలింది. అప్పటికే ఆమెకు నెలలు నిండటం, పరిస్థితి విషమంగా ఉండటంతో 19వ తేదీన సిజేరియన్ చేశారు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు పరీక్షలు నిర్వహించగా, ఫ్లూ నెగటివ్ రావడంతో బిడ్డను ఇదే ఆస్పత్రి పీడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూకు తరలించారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండటంతో తల్లిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఫ్లూ బారి నుంచి కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. పరిస్థితి విషమించి షహనాజ్ సోమవారం కన్నుమూసింది. బిడ్డను కళ్లారా చూడకుండానే మృతి చెందడం, తల్లిపాల కోసం బిడ్డ గుక్కపట్టి ఏడవటం కలచివేసింది. విజృంభిస్తోన్న వైరస్ చలికాలంలో విజృంభించే హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూకారక వైరస్.. ప్రస్తుతం సీజన్తో సంబంధం లేకుండా విస్తరిస్తోంది. జనవరి నుంచి రాష్ట్రంలో 148 కేసులు నమోదు కాగా, వీరిలో హైదరాబాద్ జిల్లావాసులే యాభై మందికిపైగా ఉన్నారు. బాధితుల్లో ఇప్పటికే ఒకరు మృతిచెందగా, తాజాగా బాలింత మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గాలి ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం గాంధీలో మౌలాలికి చెందిన బాలిక (11)తో పాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో నలుగురు ఫ్లూ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్తే మందు.. – డాక్టర్ శ్రీధర్, స్వైన్ఫ్లూ నోడల్ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి – సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించగానే స్వైన్ఫ్లూగా అనుమానించాల్సిన పనిలేదు. – రోగ నిరోధకశక్తి తక్కువుండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ బారినపడే అవకాశాలు ఎక్కువ. – స్వైన్ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువ వేధిస్తే వైద్యులను సంప్రదించాలి. – వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఇది నేర్పించాలి. – స్వైన్ఫ్లూ లక్షణాలున్న వారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. -
ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్ఫ్లూ..
సాక్షి, రామగుండం: ‘ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్ఫ్లూ..’ ప్రాణాంతకమైన వైరస్లు ప్రజలను వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కువగా మాస్క్లు ధరించినవారే కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేసిన వైద్యులు చివరికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ కుటుంబం ఇటీవల చైనా నుంచి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం బాధిత కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచారు. చైనాలో తొలిసారిగా.. చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ మనదేశంలోకి సైతం ప్రవేశించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతోపాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలో చాలా మంది మరణించారు. అలాంటి వారిని ముట్టుకోవద్దు.. విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, గొంతులో గరగర, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి.. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్లను వాడడం మంచిది. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి.. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మాస్క్లు ధరించాలి. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలను అడ్డుగా పెట్టుకోవాలి. జలుబు చేసిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర చేతులతో ముక్కు, నోరు తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేసేవారు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది. అంతేకాక, ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట్ల అనవసరంగా ఏ వస్తువులను పడితే వాటిని తాకకూడదు. లక్షణాలు ఇవే.. కరోనా వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, గొంతులో మంట ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ వైరస్ సోకినా వారికి వేరే ఏ లక్షణాలు కనిపించవు. ఇక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రెగ్యులర్గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని ఎవరూ చేతులతో టచ్ చేయవద్దని, రోగులకు దగ్గరగా ఉండొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ దేశాల్లోనూ వైరస్ ప్రభావం.. చైనాలోని బీజింగ్, షాంఘై, సౌత్ గాంగ్ డాంగ్ ప్రావిన్స్లోనూ చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. దక్షిణకొరియా, జపాన్, థాయ్లాండ్లోనూ ఈ వ్యాధి కేసులు వెలుగు చూశాయి. చైనాలో అనేక కేసులు అధికారికంగా నమోదైనా ఇంకా వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘స్వైన్ఫ్లూ’ కాలంతో జాగ్రత్త..
చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. సాక్షి, నల్లగొండ టౌన్: చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మేలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్వైన్ఫ్లూ బారిన పడి మరణించిన సంఘటనలు లేనప్పటికీ చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకావం లేకపోలేదు. చలితీవ్రత లేని రోజుల్లో అంటే ఈ ఏడాది మార్చి నాటికే జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, శాలిగౌరారం, మర్రిగూడ మండలాల్లో స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులను నమోదైన సంఘటనలు ఉన్నాయి. వారికి హైదరాబాద్లోని గాంధీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధి నుంచి విముక్తులయ్యారు. అప్రమత్తంగా వైద్య ఆరోగ్యశాఖ.. చలికాలంలో గాలి ద్వారా ఒకరి నుంచి మరోకరికి ఇన్ఫ్లూయంజా ఏ వైరస్ వ్యాప్తి చెందుతుండడం, ఊపిరితిత్తుల అంతర భాగాలకు వ్యాధి సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంబవించే అవకాశం ఉంటుం ది. స్వైన్ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనపడితే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాదాద్లోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిషిన్) ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్ల్వైన్ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. స్వైన్ఫ్లూ పాజిటివ్ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగశాఖ అధికారులు పేర్కొంటుననారు. ప్రజలు వ్యాధిపై అవగాహనను పెంపొందించుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలు.. దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్మురావడం, ఊపిరిపీల్చడానికి కష్టపడడం, పిల్లికూతులు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, వం టి నొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవి నొ ప్పి, చెవి నుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనపడతాయి. స్వైన్ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బహిరంగ ప్రదేశాలు, ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరుచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కకు చేతి రుమాలును అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు రాకూడదు. ఉన్నిదుస్తులను ధరించాలి, వేడివేడి ఆహరం, గోరువెచ్చని నీ టిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలని, లక్షణాలు కనపడిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలోని డాక్టర్ను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం చలి పెరుగుతుండడంతో స్వైన్ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. స్వైన్ఫ్లూను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. స్వైన్ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా అనుమానిత కేసులు నమోదైతే వెంటనే ప్రత్యేక వైద్య బృందం వెళ్లి వారిని పరీక్షించడంతో పాటు చుట్టూ ఉన్న యాబై ఇండ్లలోని వారికి కూడా పరీక్షలను చేయడానికి ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ అన్నిమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ -
అప్రమత్తతే రక్ష
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను శరీరం స్వీకరించలేకపోతోంది. చలికి వాహన, పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో స్వైన్ఫ్లూ కారక వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతు న్న ఆస్తమా రోగులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు త్వరగా ఫ్లూ బారిన పడే ప్రమాదం ఉంది. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బద్దకంతో వ్యాయామం చేయకపోవడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు కారణమవుతుంది. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యతో బాధపడు తున్న వారిలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణుల సూచిస్తున్నారు. చిన్నారులకు ఫ్లూ ముప్పు చలికాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా నిమోనియాతో బాధపడుతుంటారు. వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్నారులను తిప్పడం వల్ల శ్వాసనాళ సబంధ సమస్యలు వెలుగు చూస్తుంటాయి. చలికి శ్వాసనాళాలు మూసుకుపోయి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేక పోతారు. తరచూ నిద్ర లేచి ఏడుస్తుంటారు. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడి మంట పుడుతుంది. ఇది మానసికంగా చిరాకు కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ఎంపిక చేసుకోవాలి. వాతావరణంలో ఫ్లూ కారక వైరస్ మరింత బలపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆస్తమా బాధితులు విధిగా ముక్కుకు మాస్క్లు ధరించడం, రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్లో తిరిగే ఫ్యాను కిందే గడపడం, సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండటం, మంచు కురిసే సమయంలో ఆరుబయటికి వెళ్లక పోవడం మంచిది. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడీ శోధన’ ప్రాక్టీస్ చేయడం ద్వారా శ్వాస నాళాల పని తీరును కొంత వరకు మెరుగు పర్చుకోవచ్చు. – డాక్టర్ రఫీ, ఫల్మొనాలజిస్ట్ చర్మ పగుళ్ల సమస్య ఉదయాన్నే చాలా మంది తమ పిల్లలను టూ వీలర్పై స్కూలు, కాలేజీలకు తీసుకెళ్తుంటారు. ఈ సమయంలో బయట మంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో పని చేసే యువతీ యువకులు కూడా టూ వీలర్పై ప్రయాణిస్తుంటారు. ఎక్కువ సేపు చలిగాలిలో తిరగడం వల్ల కాళ్లు, చేతులు, పెదాలు, ఇతర శరీర భాగాల్లోని చర్మంపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు రాత్రి శరీరానికి పాండ్స్, వాయిజ్లీన్ ఉత్పత్తులను అప్లయ్ చేసుకోవడం ద్వారా చలి బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. పెదాలను ఉమ్మితో తడపకుండా రోజూ వాటిపై లిప్గార్డ్ను రుద్దడం చేయాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలి. సోరియాసిస్ బాధితులు స్నానానికి ముందు శరీరానికి ఆయిల్ అప్లయ్ చేసుకోవడం, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, వీలైనంత వరకు సాయంత్రం తర్వాత బయటికి వెళ్లకుండా చూసుకోవడం ద్వారా చర్మ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ మన్మోహన్, చర్మ వైద్యనిపుణుడు మెళకువలు పాటిస్తే చాలు చలికాలంలో వాకింగ్ వెళ్లాలని, జిమ్కు వెళ్లి భారీ కసరత్తులు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. బద్దకం వల్ల కొంత మంది, సమయం లేక మరికొందరు దీనిని వాయిదా వేస్తుంటారు. నిజానికి వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజువారి వృత్తి పనిలో చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే సరిపోతుంది. ఎస్కలేటర్లు, లిఫ్టులు వాడకుండా మెట్లు ఎక్కడం, వీలున్నప్పుడు చిన్న చిన్న జంపింగ్లు చేయడం, అర నిమిషం పాటు వెనక్కి నడవడం, సైక్లింగ్ను రోజువారీ కార్యకలాపాల్లో ఓ భాగంగా చేసుకోవడం, శరీరంలోని నడుము కింది భాగాలకు ఎక్కువ శ్రమ కలగాలంటే సైకిల్పై ఎక్కువ సేపు నిలబడి ఉండటం, మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు రైలు ఎక్కి దిగేటప్పుడు ఎస్కిలేటర్, లిఫ్ట్కు బదులు మెట్లను ఉపయోగించడం వల్ల శరీ రానికి అవసరమైన వ్యాయామం పొందవచ్చు. తద్వారా శారీరకంగా ధృడంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. – వెంకట్, ప్రముఖ ఫిట్నెన్ నిపుణుడు -
స్వైన్ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకవార్డులు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకవైపు డెంగీ డేంజర్ కొనసాగుతుండగా, మరోవైపు స్వైన్ఫ్లూ పంజా విసురుతోంది. కాస్త దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం వస్తేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో 60, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రుల్లో 30 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. కింగ్కోఠి ఆసుపత్రి 10, మలక్పేట ఏరియా ఆసుపత్రి 3, నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో 4 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. ప్రతిజిల్లా ఆసుపత్రుల్లోనూ 10 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. స్వైన్ఫ్లూ నివారణకు అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. 1.70 లక్షల స్వైన్ఫ్లూ క్యాప్సిల్స్ ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 2 వేల స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, 25 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. స్వైన్ఫ్లూకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే, 040–24651119 నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 8 మంది వైద్యాధికారులతో రాష్ట్రస్థాయి నోడల్ టీంను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో ప్రతి స్వైన్ఫ్లూ కేసుపై సమగ్రమైన వివరాలను పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. స్వైన్ఫ్లూ అనుమానిత కేసులను గుర్తించేందుకు ఐపీఎం, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లోనూ స్వైన్ఫ్లూ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కేవలం ఒకేచోట మాత్రమే నిర్ధారణ పరీక్షలు జరిగేవి. ఇప్పుడు రోజుకు వెయ్యి శాంపిళ్లను పరీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్వైన్ఫ్లూ రోగుల కోసం 1.70 లక్షల క్యాప్సిల్స్ను ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. 5,458 సిరప్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోగులకు వైద్యం చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం 13,750 వ్యాక్సిన్లు జిల్లాలకు పంపిణీ చేశారు. 15 వేల మాస్్కలు, 7,500 శానిటైజర్లు పంపించారు. 4,635 పీపీఈ కిట్లను జిల్లాలకు పంపించాలని నిర్ణయించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక స్వైన్ఫ్లూ విజృంభించే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్ఫ్లూ లక్షణాలు తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, తల, ఒళ్లు నొప్పులు ఉంటాయి. పిల్లల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురువుతుంది. ఒక్కోసారి చర్మం నీలం లేదా బూడిద రంగులోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు అవుతాయి. ఒక్కోసారి నడవడమూ కష్టంగా ఉంటుంది. పెద్దల్లోనైతే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీ, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
మళ్లీ..స్వైన్ ‘ఫ్లో’!
సాక్షి, హైదరాబాద్: స్వైన్ ‘ఫ్లో’.. మళ్లీ మొదలైం ది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కు తోడు పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,300 పైగా కేసులు నమోదు కాగా, వీరిలో 21 మంది మృతి చెందారు. తాజాగా హైదరాబాద్లో మరో నాలుగు అనుమానిత ఫ్లూ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితుల్లో ఇద్దరు పురుషులు కాగా.. ఒక మహిళ, ఒక బాలుడున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు గాంధీలో చికిత్స పొందుతుండ గా, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆయా ఆస్పత్రుల వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యా ధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం వారికి అనుమానిత స్వైన్ ఫ్లూగా భావించి చికిత్సలు అందజేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి.. ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువున్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు జన సమూహంలోనికి వెళ్లకపోవడమే ఉత్తమం. బాధితులు ఉపయోగించిన రుమాలు, టవల్ వంటివి వాడొద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా కర్చీఫ్ను పెట్టుకోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారితో కరచాలనం, ఆలింగనాలు చేయొద్దు. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. గ్రేటర్లో 1,106 కేసుల నమోదు 2009లో ‘హెచ్1ఎన్1’ఇన్ఫ్లూయెంజా వైరస్ తొలిసారిగా వెలుగుచూసింది. తర్వాత నగరంలో స్వైన్ఫ్లూ కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. ఏడాది పాటు నిశ్శబ్దంగా ఉన్న వైరస్ మళ్లీ 2012లో ప్రతా పం చూపించింది. ఈ ఏడాది ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్లో 671, రంగారెడ్డి 208, మేడ్చల్ జిల్లాలో 227 ప్లూ పాజి టివ్ కేసులు నమోదవగా 21 మంది మృతిచెందారు. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసమూహంలో ఎక్కువగా గడపడం వల్ల ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సులభంగా విస్తరించినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, ఏరియా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఎన్–95 రకం మాస్క్లను ప్రభుత్వం సరఫరా చేసింది. రోగుల కోసం ‘ఒసల్టామీవిర్’ టాబ్లెట్స్ను, డబుల్ లేయర్ మాస్క్లను అందుబాటులో ఉంచింది. స్వైన్ఫ్లూ నిర్ధారణ పరీక్షలను గాంధీ, ఫీవర్, ఐపీఎంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి -
మళ్లీ ‘స్వైన్’ సైరన్!
సాక్షి, సిటీబ్యూరో: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పగటిపూట ఎండలు తగ్గుముఖం పట్టడం, సాయంత్రం చిరుజల్లులకు తోడు చలిగాలులు వీస్తుండటంతో వైరస్ బలపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1227 స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేవలం రెండు వారాల్లోనే పదిహేను కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే గత ఏడాది 1007 కేసులు నమోదు కాగా, వీరిలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 20 మంది మృతి చెందినట్లు అధికారుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోనే ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. చాప కింది నీరులా విస్తరిస్తున్న ఈ స్వైన్ఫ్లూపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హైరిస్క్ గ్రూప్ను వెంటాడుతున్న ఫ్లూ భయం పదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాండించిన స్వైన్ఫ్లూ వైరస్ మరోసారి విస్తరిస్తుంది. కేవలం గ్రేటర్లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనూ చాప కింది నీరులా విస్తరిస్తుండటంతో సామాన్య ప్రజలే కాదు రోగులు చికిత్స పొందుతున్న ఆయా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమను ఆ వైరస్ వెంటాడుతుందోనని ఆందోళన చెందుతున్నాయి. కేవలం గ్రేటర్లో నమోదైన కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం నగరంలోని ఆస్పత్రులకు తరలిస్తుండటంతో హెచ్1ఎన్1 వైరస్ ఎక్కడ తమకు చుట్టు కుంటుందోనని భయపడుతున్నారు. గతంలో హైరిస్క్ జోన్లో పని చేస్తున్న సిబ్బందికి రోగి నుంచి వైరస్ సోకడమే ఇందుకు కారణం. వ్యాధి నివారణలో భాగంగా వీరికి ముందస్తు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, స్వైన్ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈ మందు మచ్చుకైనా కన్పించడం లేదు. వైరస్ సోకకుండా ఒక్కక్కరికి ఒక్కో డోసు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. కానీ స్వైన్ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ లేక పోవడంతో అక్కడ పని చేసే వైద్యులే కాకుండా చికిత్సల కోసం అక్కడికి వస్తున్న రోగులు సైతం భయ పడుతున్నారు. చివరకు ఫ్లూ బాధితుల వద్దకు వెళ్లడానికి కూడా సిబ్బంది జంకుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. గర్భిణులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్ వాతావరణంలో రెండుగంటలకుపైగా జీవిస్తుంది. ఫ్లూ లక్షణాలతో బాధపడే వారికి దూరంగా ఉండాలి. మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. జనసమూహ ప్రాంతాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. తీర్థయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవ డం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. అనుమానం వచ్చిన వెంటనే వ్యాధి నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ శ్రీధర్, ఉస్మానియా ఆస్పత్రి -
స్వైన్ఫ్లూ మృతుల వివరాలు ఎందుకివ్వలేదు?
సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు, విషజ్వరాల బారిన పడి మరణించినవారి వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు దాటవేత వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. తొలిసారి వివరాలు కోరినప్పుడు ఆయా రోగాల కారణంగా మృత్యువాత పడినవారి వివరాలు ఇవ్వకుండా ఎంతమంది ఆ రోగాల బారిన పడ్డారో, ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో వంటి వివరాలే ఇచ్చిన అధికారులు రెండో సారి కూడా మృతుల వివరాలు ఇవ్వకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8న జరిగే విచారణ నాటికి పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీ వల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోగాలు, విషజ్వరాల కారణంగా పేద రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన చికిత్స అందడం లేదని, రోగులు చని పోతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లుల భారాన్ని రోగులు మోయలేకపోతున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించారో, ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి ఆయా రోగా లు ఉన్నాయని తేలిందో, తీసుకున్న నివారణ చర్య లు తదితర వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వైన్ఫ్లూపై ఆందోళన తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చి న రెండో నివేదికలో మరణించిన రోగుల వివరాలు లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 5,574 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే 1,165 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు తేలిందని నివేదికలోని వివరాలు చూసిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో హైదరాబాద్లోనే 606 మంది ఉన్నారని, వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు మరణించిన రోగుల వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ను ఆదేశించింది. కేంద్రం కూడా తమ వాదనలతో కౌం టర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని, రాష్ట్రప్రభుత్వం సమగ్ర వివరాలను తెలపాలని ఆదేశించింది. -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రసవం చేశారు. స్వైన్ఫ్లూతో బాధపడుతున్న ఓ మహిళకు డెలివరీ చేశారు. వెంటిలేటర్పై ఉన్న సదురు మహిళకు స్వైన్ఫ్లూ వార్డులోనే చికిత్స అందించారు. తర్వాత కొద్ది రోజులకు తల్లి, బిడ్డను ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ చేశారు. స్వైన్ఫ్లూతో బాధపడుతున్న తన కూతురికి చికిత్స చేయడానికి కార్పొరేట్ వైద్యులు 25 లక్షల రూపాయలు అడిగారని.. అయినా గ్యారంటీ లేదన్నారని ఆ మహిళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను బతికించిన గాంధీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
స్వైన్ఫ్లూ, డెంగ్యూ కేసుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన స్వైన్ప్లూ, డెంగ్యూ కేసుల వివరాలను తమ ముం దుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్వైన్ఫ్లూ, డెంగ్యూ వ్యాధులు ప్రబలినట్లు గుర్తించిన 117 ప్రాంతాల వివరాలను కూడా సమర్పించాలంది. ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డిని నియమించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్ఫ్లూ, డెంగ్యూ వ్యాధులకు చికిత్స అందించేందుకు సౌకర్యాలు లేవంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం మరో సారి విచారణకు వచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్వైన్ఫ్లూ చికిత్స కేవలం గాంధీ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంటే మారుమూల ఉన్న ప్రాంతాల ప్రజల సంగతేమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
యానాంలో స్వైన్ఫ్లూ కలకలం..
తూర్పుగోదావరి, యానాం: యానాం పట్టణంలో స్వైన్ఫ్లూ కలకలం సృష్టించింది. పట్టణపరిధిలోని అంబేడ్కర్నగర్కు చెందిన ఇసుకపట్ల సంపత్ అనే వ్యక్తికి స్వైన్ఫ్లూ సోకిందని కాకినాడకు చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు రక్తపరీక్షల ఆధారంగా గుర్తించి మెరుగైన వైద్యం కోసం అతడిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కొన్ని రోజులుగా సంపత్ అనారోగ్యబారిన పడడంతో అతడిని కుటుంబసభ్యులు శుక్రవారం యానాంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి ఆదివారం మధ్యాహ్నం స్వైన్ఫ్లూ అని నిర్ధారించారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తీసుకువెళ్లారు. బాధితుడు దరియాలతిప్పలో ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అపరిశుభ్రత వల్లే : అంబేడ్కర్నగర్ గ్రామస్తులు అంబేడ్కర్ నగర్ శివారు ప్రాంతాలు ముఖ్యంగా కోరంగినదీ కాలువ వెంబడి ఉన్న ఏటిగట్టుకు ఆనుకుని ఉన్న నివాసాల వద్ద పరిసరాలు అశుభ్రంగా ఉంటున్నాయని పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, మున్సిపాలిటీవారు చెత్తను తీసుకువెళ్లడం లేదని గ్రామస్తులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. పందులు గుంపులుగా వచ్చి అక్కడే తిష్టవేస్తున్నాయని వాటి గురించి ఎవరూ పట్టించు కోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇక్కడి చెత్తను తొలగించడం లేదు సరికదా, ఎక్కడి నుంచో తెచ్చిన చెత్తను ఇక్కడే వేస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా పందులు స్వైరవిహారం చేయడం వల్లే స్వైన్ఫ్లూ వ్యాధి సోకిందని తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నివాసాల చెంతకు పందులు వస్తుండటంతో పలువురిపై దాడులు చేస్తున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని వారు ముక్తంకంఠంతో కోరుతున్నారు. -
నేతలకు షేక్హ్యాండ్ఇవ్వకపోవడమే మంచిది...
సాక్షి, హైదరాబాద్: ఓవైపు వేసవి, ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తుంటే మరోవైపు రాజధానిలో స్వైన్ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్పై కలకలం రేగుతోంది. సాధారణంగా చలి వాతావరణంలో బలపడే ఈ వైరస్ భగ్గుమంటున్న ఎండల్లోనూ విజృంభిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందడమే కాకుండా మరింత బలపడుతోంది. అసలే ఎన్నికల సీజన్.. నగరంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు రోజంతా ప్రచారంలో బిజీగా తిరుతుంటారు. సభలు, సమావేశాలు, ర్యాలీల పేరుతో ఎక్కువ సమయం జన సమూహంలోనే గడుపుతుంటారు. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వైరస్ వాతావరణంలోకి ప్రవేశించి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఈ విషయంలో సాధారణ ప్రజలే కాకుండా రాజకీయ పార్టీల అభ్యర్థులు సైతం ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జనబాహుళ్యంలోకి వెళ్లే సమయంలో ముక్కుకు మాస్క్ ధరించడం, బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది కేవలం రెండు మాసాల్లోనే 573 కేసులు నమోదు కాగా, వారిలో 29 మంది మృతి చెందారు. ఒక్క నగరంలోని గాంధీ జనరల్ ఆస్పత్రిలోనే ఈ ఏడాది ఇప్పటివరకు 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 14 మంది మృతి చెందడం గమనార్హం. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే స్వైన్ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం గాంధీ జనరల్ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వైరస్ బారినపడిన ఏడుగురికి చికిత్స అందిస్తుండగా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో మరో నలుగురికి సైతం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఒకరికి సోకితే అందరినీ చుట్టేస్తుంది... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జనసమూహంలో ఎక్కువగా తిరుగుతుంటారు. నేతల్లో చాలా మంది బీపీ, షుగర్తో బాధపడుతుంటారు. వారిలో కొంత మందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు ఉదయం నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి వరకు జనం మధ్యే గడుపాల్సి వస్తుంది. బరిలో నిలిచిన అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యులంతా జనసమూహంలో ఎక్కువసేపు గడపాల్సి వస్తుంది. స్వైన్ఫ్లూ కారక వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి వైరస్ సోకిందంటే చాలు అందరికీ చుట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో ఏ వైరస్ సోకిందో గుర్తించడం కూడా కష్టమే. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101–102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వేంటనే వైద్యులను సంప్రదించాలి. షేక్హ్యాండ్ఇవ్వకపోవడమే మంచిది... నేతలు షేక్హ్యాండ్ ఇవ్వడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం. దుమ్ము, ధూళి రూపంలో రకరకాల ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సాధ్యమైనంత వరకు బయట తిరిగే సమయంలో ముక్కుకు మాస్క్ ధరించాలి. బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.– డాక్టర్ రాజన్న,చిన్న పిల్లల వైద్య నిపుణుడు ♦ ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 573 కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు. ♦ నగరంలోని గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 14 మంది మృతి చెందారు. ♦ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్గా నిర్ధారణ అయిన ఏడుగురికి, వైరస్ సోకిందని భావిస్తున్న మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. -
గాంధీలో స్వైన్ఫ్లూతో ఇద్దరి మృతి
హైదరాబాద్: గతంలో చలికాలంలో మాత్రమే ప్రభావం చూపించే స్వైన్ఫ్లూ వైరస్ రూపాంతరం చెంది వేసవిలోకూడా విజృంభిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం ఓ వృద్ధురాలితోపాటు మరో యువతి స్వైన్ఫ్లూతో మృతి చెందారు. రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం తుర్కగూడకు చెందిన యువతి (24) ఈ నెల 1న కొత్తపేట ఓమ్నీ ఆస్పత్రి నుంచి రిఫరల్పై గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈనెల 13న మృతిచెందింది. హైదరాబాద్ దమ్మాయిగూడ వైశక్తినగర్కు చెందిన వృద్ధురాలు (80) స్వైన్ఫ్లూతో బాధపడుతూ సీసీ షరాఫ్ ఆస్పత్రి నుంచి ఈ నెల 6న గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతి చెందింది. కర్మన్ఘాట్ హను మాన్నగర్కు చెందిన వృద్ధురాలు (62), మేడ్చల్ గుండ్లపోచంపల్లికి చెంది న మరో వృద్ధురాలు (64), మేడ్చల్ జిల్లా ఉప్పల్ సూరప్నగర్కు చెందిన మరోవ్యక్తి (42), నాగర్కర్నూల్ గోలగుండం తెల్కపల్లికి చెందిన యువతి (25), ఓల్డ్బోయినపల్లి మల్లికార్జుననగర్కు చెందిన వృద్ధురాలు (65)లతోపాటు మరో నలుగురు స్వైన్ఫ్లూ అనుమానితులకు గాంధీలో చికిత్సలు అందిస్తు న్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ గురువారం తెలిపారు. ఈ ఏడాది గాంధీలో మొత్తం 59 స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారని, ఐదుగురు చికిత్స పొందుతున్నారని చెప్పారు. -
హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ పంజా.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : మండు వేసవిలోనూ స్వైన్ ఫ్లూ పంజా విసురుతోంది. గురువారం స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 1న 24ఏళ్ల ఓ యువతి, 6వ తేదీన 80ఏళ్ల వృద్ధురాలు స్వైన్ ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. అయితే వీరు అంతకుముందు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడకపోవటంతో గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించారు. గాంధీలో చికిత్సపొందుతూ వ్యాధి తీవ్రమవటంతో ఈ గురువారం ఇద్దరూ మృతిచెందారు. ఇంకా 5మంది స్వైన్ ఫ్లూ రోగులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురికి కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన వైద్య నివేదికలు మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. -
స్వైన్ఫ్లూతో మహిళ మృతి
గుంటూరు, తాడేపల్లి రూరల్(మంగళగిరి): తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో స్వైన్ఫ్లూ లక్షణాలతో ఓ మహిళ మృతిచెందింది. గుండిమెడ గ్రామానికి చెందిన పునుకుపాటి నర్సమ్మ (34) కూలి పనులు చేసుకొని, భర్త పిల్లలతో నివాసం ఉంటోంది. రెండు వారాల క్రితం ఆమె జలుబు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో నరసరావుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. అక్కడి వైద్యులు స్వైన్ఫ్లూ సోకిందని చెప్పారని బంధువులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడం, కార్పొరేట్ వైద్యం చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో బంధువులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ప్రభుత్వస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గుండిమెడకు తీసుకొచ్చారు. స్వైన్ఫ్లూతో నర్సమ్మ మృతి చెందిందని ప్రచారం జరగడంతో తాడేపల్లి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్నాయక్ ఆమె ఇంటికి వెళ్లి గుంటూరు ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్టులు పరిశీలించారు. నర్సమ్మ సుగర్ రోగి అని, థైరాయిడ్కు కూడా మందులు వాడుతోందని, ఎక్కడా స్వైన్ఫ్లూ టెస్ట్లు చేయలేదని, ప్రైవేటు వైద్యులు సస్పెక్టెడ్ స్వైన్ఫ్లూగా ట్రీట్మెంట్ ఇచ్చారని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందిన నర్సమ్మకు ఆల్కలైన్ ఎసిడోసిస్, బైలేటరల్ లంగ్స్ న్యూమోనియాగా నిర్ధారించారని వివరించారు. -
‘స్వైన్ఫ్లూతో ఏపీలో 21 మంది మరణించారు’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్వైన్ఫ్లూ బారినపడి 2018 నుంచి ఇప్పటివరకు 21 మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2018లో ఏపీలో 402 మంది స్వైన్ ఫ్లూ బారినపడగా 17 మంది మరణించారని పేర్కొన్నారు. 2019లో ఏపీలో ఇప్పటివరకు 77 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో నలుగురు మృత్యువాత పడ్డారని చెప్పారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా 169 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో 66 కేసులు నమోదు కాగా, అందులో ఆరుగురిని ఈ వ్యాధి కబళించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ఆడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆడ్మిషన్లలో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలన్న విషయంలో ఆయా రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జీవో నంబర్ 550ని ఉల్లంఘిస్తూ జరిపిన మెడికల్ సీట్ల భర్తీ కారణంగా రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయం మీ దృష్టికి వచ్చిందా అని మంగళవారం రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ దుబే మెడికల్ కాలేజీ అడ్మిషన్ల కోసం ప్రతి రాష్ట్రం సొంతంగా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఆలిండియా కోటాలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. నగరవాసులను హడలెత్తిస్తోంది. చలికాలం కావడంతో స్వైన్ఫ్లూ అధికంగా సోకే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకుతగ్గట్టుగానే చినవాల్తేరులో గల ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో బుధవారం ఒకే రోజు ముగ్గురు రోగులు చేరడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు గురువారం డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ముగ్గురికీ పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని వైద్యులు చెప్పారు. ఇక గత ఏడాది జిల్లాలో 8 మంది స్వైన్ఫ్లూ లక్షణాలతో చనిపోవడం తెలిసిందే. కేజీహెచ్లో ప్రస్తుతం రోగులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లలో సెంటర్లు కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్సు, రైల్వేస్టేషన్లో సెంటర్లు ఉన్నాయని తెలిపారు. స్టికర్లు, హోర్డింగుల ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. టీబీ ఆస్పత్రిలో ముగ్గురు, ప్రైవేట్ ఆస్పత్రులలో ఐదుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఎయిర్పోర్టులో కానరాని స్క్రీనింగ్ సెంటర్ రైల్వేస్టేషన్లో జ్ఞానాపురం వైపు ప్రవేశమార్గం వద్ద స్క్రీనింగ్ సెంటర్ లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సందర్శకులు, పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చే ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ సెంటర్ లేకపోవడం గమనార్హం. అక్కడ పరీక్షలు లేకపోవడంతో వారి ద్వారానే నగరవాసులకు స్వైన్ఫ్లూ సోకుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా సరే వైద్య – ఆరోగ్యశాఖ అధికారులు కనీసం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పత్రికా సమావేశం కాదు కదా... కనీసం హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్వైన్ఫ్లూ సైరన్..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్ఫ్లూ విజృంభిస్తోంది. ఏడాదికేడాదికి దీని తీవ్రత వాతావరణ పరిస్థితిని బట్టి మారుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్ఫ్లూపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2012 సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 27 వరకు అంటే ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 1.14 లక్షల మందికి స్వైన్ఫ్లూ సోకింది. అందులో 8,119 మంది మృతి చెందారు. అంటే స్వైన్ఫ్లూ సోకిన వారిలో 7.12 శాతం మంది మరణించారు. కేంద్ర నివేదిక వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015లో అత్యధికంగా 42,592 మందికి స్వైన్ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి సోకగా, 2,270 మంది చనిపోయినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో తక్కువగా 937 మందికి ఫ్లూ రాగా, అందులో 218 మంది మృతిచెందారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు నమోదైన స్వైన్ఫ్లూ కేసులు, మృతులు ఏడాది కేసులు మృతులు 2014 78 8 2015 2,956 100 2016 166 12 2017 2,165 21 2018 1,007 28 2019 245 0 మొత్తం 6,617 169 మహారాష్ట్రలో మరీ దారుణం... ఈ ఏడేళ్లలో మహారాష్ట్రలోనే అత్యధికంగా స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2012 నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,786 కేసులు నమోదు కాగా, 2,509 మంది మృతి చెందారు. అంతేకాదు గతేడాది 2,593 కేసులు నమోదు కాగా, 461 మంది చనిపోయారు. ఆ తర్వాత రాజస్థాన్లో ఏడేళ్లలో 16,177 కేసులు నమోదు కాగా, 1346 మంది చనిపోయారు. గతేడాది ఈ రాష్ట్రంలో 2,375 కేసులు నమోదు కాగా, 221 మంది చనిపోయారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు 6,617 మందికి స్వైన్ఫ్లూ సోకగా, 169 మంది మృతిచెందారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి 27 వరకు తెలంగాణలో అత్యధికంగా 245 కేసులు నమోదయ్యాయి. ఎవరూ చనిపోలేదని కేంద్రం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ 2014 నుంచి ఇప్పటివరకు 1,208 మందికి ఫ్లూ సోకగా, అందులో 79 మంది చనిపోయారు. స్వైన్ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించకపోవడం, నియంత్రణ చర్యలు కొరవడటమే వైరస్ విస్త్రృతి కావడానికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 2012 నుంచి ఇప్పటి వరకు ‘ఫ్లూ’ కేసులు- 19,786 మహారాష్ట్రలో 2012 నుంచి ఇప్పటి వరకు స్వైన్ఫ్లూ మృతులు- 2,509 -
ఇదేం చలి బాబోయ్.. !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. మూడ్నాలుగు రోజులుగా చలితో జనం గజగజలాడుతున్నారు. జలుబు, దగ్గులతో బాధపడుతున్నారు. కొన్నిచోట్ల స్వైన్ఫ్లూ బారిన పడుతున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనద్రోణి బలహీనపడింది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో వచ్చే రెండ్రో జులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. దీంతో గురువారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగా రెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో చలి రాష్ట్రాన్ని కమ్మేసింది. ఆదిలాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడి పోయింది. హన్మకొండలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 9 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక్కడ సాధారణ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీలు నమోదు కావాలి. హైదరాబాద్, రామగుండంలో 7 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిజామాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత 6 డిగ్రీలు తక్కువగా 10 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. నిజామాబాద్లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా 25 డిగ్రీలు రికార్డయింది. రాజధానిలోనూ చలిగాలులు ఉత్తర, ఈశాన్య గాలుల తీవ్రత నగరాన్ని గజ గజ వణికిస్తోంది. దీంతో ఏడేళ్ల అనంతరం జనవరిలో అతి తక్కువగా 9.3 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 7 డిగ్రీలు తక్కువ. సహజంగా జనవరి 15 తర్వాత పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగాల్సి ఉన్నా.. ఇటీవలి తుపాను అనంతరం శీతల గాలుల తీవ్రత కొనసాగు తోంది. దీంతో పగటి పూటా తక్కువ ఉష్ణో గ్రతలే నమోదవుతున్నాయి. బుధవారం 26.7 డిగ్రీలు నమోదైంది. మరో వారంపాటు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నగరంలో ఒక్కసారిగా అత్యల్ప ఉష్ణోగ్రతల మూలంగా జలుబు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. గుండె, శ్వాస సంబంధ వ్యాధులున్న వారు తప్పనిసరైతే తప్ప చలిగాలిలో బయటికి రావద్దని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. స్వైన్ ఫ్లూ తీవ్రత కూడా ఉండటంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో నాలుగు రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలే నమోదు కానున్నాయి. -
సిటీలో స్వైన్ ఫ్లూ...
-
తెలంగాణ వ్యాప్తంగా స్వైన్ప్లూ పంజా
-
నల్సార్ యూనివర్శిటీ విద్యార్ధులకు స్వైన్ ఫ్లూ
సాక్షి, హైదరాబాద్ : నల్సార్ యూనివర్శిటీకి చెందిన ఐదుగురు విద్యార్ధులకు స్వైన్ ఫ్లూ సోకింది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఐదుగురు విద్యార్ధులను గాంధీ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఐదుగురు విద్యార్ధులు గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఒక్కరోజే మొత్తం తొమ్మిది మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. వీరందరిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో విస్తరిస్తున్న సైన్ప్లూ
-
స్వైన్ అలర్ట్!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభిస్తోంది. మూడు వారాల్లోనే 1,170 మంది నుంచి నమూనాలు సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ (ఐపీఏం)లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపగా, వీరిలో 131 మందికి పాజిటివ్ అని తేలింది. వీటిలో ఒక్క హైదరాబాద్లోనే 47 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీఆస్పత్రుల్లోని స్వైన్ఫ్లూ వార్డుల్లో 10 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెరుగుతున్న చలితీవ్రత.. ఉదయం మంచు కురుస్తుండటంతో ఫ్లూ కారక వైరస్ బలోపేతం అవుతోంది. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఫ్లూ కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఐదేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే స్వైన్ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసు్కోవాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 29 మంది మృతి.. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఫ్లూ లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో 228 మంది చేరగా, వైద్యులు వారి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. వీరిలో 38 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ఫ్లూ బాధితుల్లో 50 నుంచి 70 ఏళ్ల లోపు వారు 38 మంది ఉండగా, మిగిలిన వారంతా 50 ఏళ్ల లోపువారే. బాధితుల్లో 60 శాతం మంది పాత బస్తీ పరిసర ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. గాంధీ ఆస్పత్రి స్వైన్ఫ్లూ నోడల్ సెంటర్లో గతేడాది నుంచి ఇప్పటి వరకు 80 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వీరిలో 19 మంది మరణించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతుండగా, వీరిలో ఐదుగురికి పాజిటివ్ రాగా, మరో నలుగురిని అనుమానిత ఫ్లూ కేసులుగా నమోదు చేసుకుని చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అంతమాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. స్వైన్ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వెళ్లగానే చేతులు, కాళ్లు సబ్బుతో కడుక్కోవాలి. మూడు కన్నా ఎక్కువ రోజులు పై లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. -
గాంధీ ఆస్పత్రిని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ
-
హైదరాబాద్లో మళ్లీ స్వైన్ఫ్లూ కలకలం
-
‘బీకే హరిప్రసాద్ను పదవి నుంచి తొలగించాలి’
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయాధ్యక్షడు అమిత్ షా అనారోగ్యాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ను పార్టీ జనరల్ సెక్రటరీ హోదా నుంచి తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హరిప్రసాద్ను తొలగించకపోతే ఈ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కూడా మద్దతిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నర్సింహ్మ రావు మాట్లాడుతూ.. ‘రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిండం కాంగ్రెస్ స్వభావం. ఒక వైపు రాహుల్ గాంధీ జైట్లీ అనారోగ్యం గురించి విచారం వ్యక్తం చేస్తూంటే.. మరో వైపు హరి ప్రసాద్ లాంటి వాళ్లు ఇలా విషం కక్కుతారు. వీరి గురించి జనాలకు బాగా తెలుసు. ఒక వేళ వారు(రాహుల్) నిజంగానే హరిప్రసాద్ వ్యాఖ్యల్ని సమర్థించకపోతే.. అతని చేత అమిత్ షాకు బహిరంగ క్షమాపణలు చెప్పించాల’ని డిమాండ్ చేశారు. అమిత్ షా స్వైన్ ఫ్లూతో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్.. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని చీల్చడానికి ప్రయత్నించడం వల్లే అమిత్ షా అనారోగ్యం పాలయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మా జోలికి వచ్చారు.. స్వైన్ఫ్లూ సోకింది
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నించడం వల్లే బీజేపీ చీఫ్ అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకిందని ఎద్దేవా చేశారు. బెంగళూరులో బీజేపీకి వ్యతిరేకంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగివచ్చారు. దీంతో అమిత్ షాకు జ్వరం వచ్చింది. అది మామూలు జ్వరం కాదు.. స్వైన్ ఫ్లూ జ్వరం. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తే కేవలం స్వైన్ ఫ్లూనే కాదు.. వాంతులు, విరేచనాలు వస్తాయని అర్ధం చేసుకోవాలి’ అని అన్నారు. దీంతో కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్గోయల్తో పాటు పలువురు బీజేపీ నేతలు హరిప్రసాద్పై విరుచుకుపడ్డారు. ఫ్లూ జ్వరానికి చికిత్స ఉందనీ, కానీ హరిప్రసాద్కున్న మానసిక అనారోగ్యాన్ని తగ్గించడం కష్టమని గోయల్ విమర్శించారు. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. బీజేపీ నేతల అనారోగ్యాన్ని కాంగ్రెస్ కోరుకోదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైట్లీ కోలుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ ట్వీట్చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అమిత్ స్వైన్ఫ్లూ జ్వరంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో బుధవారం చేరిన సంగతి తెలిసిందే. -
అమిత్ షాకు స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ : స్వైన్ ఫ్లూ చికిత్స కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి దయ, మీ అందరి ఆశీర్వాందంతో త్వరలోనే కోలుకుంటా’ అని అమిత్ షా హిందీ భాషలో ట్వీట్ చేశారు. ఛాతీ పట్టేయడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర కారణాలతో అమిత్ షాను ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అమిత్ షాను ఆసుపత్రిలో పరామర్శించారు. -
నగరంలో స్వైన్ఫ్లూ విజృంభణ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్లో స్వైన్ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు చలితీవ్రత వల్ల ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం గాంధీ జనరల్ ఆస్పత్రిలో సిద్దిపేటజిల్లా కొండపాకకు చెందిన వ్యక్తి(39), ఉప్పల్ సౌత్ స్వరూప్నగర్కు చెందిన మహిళ(28), అల్వాల్లోని ఇంద్రానగర్కు చెందిన మహిళ(43)లకు పాజిటివ్ కేసులు గురువారం నమోదు కాగా, మరో నలుగురు ఫ్లూ అనుమానితులు చికిత్స పొందు తున్నారు. ఉస్మానియాలో పాతబస్తీకి చెందిన మహిళ(64), వ్యక్తి(48), యువకుడు(34), వృద్ధుడు(60), మహిళ(45)లకు కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే గతేడాది గాంధీలో 72 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 18 మంది మృత్యువాత పడ్డారు. 54 మంది చికిత్స తర్వాత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఉస్మానియాలో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో అత్యధిక శాతం మహిళలే ఉండటం గమనార్హం. ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందే.. సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. నిజానికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు,గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ బారిన పడే అవకాశాలు ఎక్కువ. సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. స్వైన్ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి.ముఖ్యంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రపరచుకోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. మూడు రోజులు కంటే ఎక్కువ పై లక్షణాలు వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించటం ద్వారా పూర్తిగా నివారించే అవకాశం ఉంది. స్వైన్ఫ్లూ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ శ్రీధర్, స్వైన్ఫ్లూ నోడల్ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి -
స్వైన్ఫ్లూనే..!
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వైన్ప్లూ కలకలం రేగినప్పటికీ స్వైన్ప్లూతో ఒక రోగి సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వైద్యశాఖ అధికారులు మాత్రం దీనిని దాచి పెట్టే యత్నం చేస్తున్నారు. స్థానిక శిఖామణి చర్చి వద్ద నివశిస్తోన్న పెట్షాప్ నిర్వాహకులు జూలూరు వెంకట రమణ కిరణకుమార్కు స్వైన్ఫ్లూ సోకింది. దీంతో జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ఆసుపత్రుల్లో పలు వైద్యరీక్షలు నిర్వహించి రోగి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని సికింద్రాబాద్ తరలించారు. సికింద్రాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిరణ్కుమార్కు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతనికి స్వైన్ప్లూ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకిందని “సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురించడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం పీహెచ్సీ సిబ్బందిని కిరణ్కుమార్ వైద్య పరీక్షలు నివేదిక తీసుకువచ్చేందుకు సికింద్రాబాద్ పంపారు. అయితే తమకింకా కిరణ్కుమార్కు సంబంధించి వైద్యపరీక్షల నివేదికలు రాలేదని వైద్యాధికారులు చెప్పుకొస్తున్నారు. కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకలేదని, ఇన్ప్లూయేంజాతో బాధపడుతున్నారని మభ్యపెడుతూ వచ్చారు. అయితే కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకడమే కాకుండా అతనికి ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిని అపస్మారక స్థితిలో సికింద్రాబాద్లోని క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. కిరణ్కుమార్ వైద్యానికి సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. అయినా వైద్యాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. కిరణ్కుమార్కు చెందిన వైద్య పరీక్ష నివేదికలు కూడా తమకు ఇంకా అందలేదని చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిరణ్కుమార్కు స్వైన్ఫ్లూ నిర్ధారణ జూలూరి వెంకట రమణ కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకినట్లు సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 5వ తేదీనే అక్కడి వైద్యులు కిరణ్కుమార్కు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదిక సాక్షి సేకరించింది. ఆ నివేదికలో కిరణ్కుమార్కు ఇన్ప్లూయేంజా ఏ/హెచ్1–2009 ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంటే ఇన్ప్లూయేంజా–ఎ వైరస్ ఉన్నట్లైతే రోగికి స్వైన్ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇప్పటికైనా వైద్యాధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని స్వైన్ప్లూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. స్వైన్ప్లూ లేదని చెప్పే వైద్యులు దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కిరణ్కుమార్ వైద్యంపై వైద్యశాఖ జోక్యం చేసుకుని మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. -
ఆ మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల కాదు: కలెక్టర్
సాక్షి, కోడూరు : కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకోల్లలో చెలరేగిన స్వైన్ ఫ్లూ కలకలంపై కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. చింతకోల్లలో సంభవించిన మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల కాదని తేల్చిచెప్పారు. అనారోగ్యంతో, కార్డియాక్ అరెస్ట్ కారణంగానే వారు చనిపోయినట్లు తెలిపారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులను స్వైన్ ఫ్లూ నెపంతో ఇబ్బందులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శానిటేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మందుస్తు నివారణకు ఆర్సీనిక్ అల్బెమ్ హోమియో మందు ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. -
స్వైన్ప్లూ కలకలం
కోడూరు: కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకొల్లలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. వారం రోజుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో వైరస్ వ్యాపించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులు ప్రభుత్వాధికారులకు తెలియడంతో వారు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు అనధికారికంగా సెలవులు కూడా ప్రకటించారు. ఆర్డీఓ ఆద్వర్యంలో గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజల ఆందోళన చెందకుండా ఉండేందుకు గ్రామంలో స్వైన్ప్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోన్నారు. -
స్వైన్ ఫ్లూ భయంతో గ్రామం వెలి!
కోడూరు(అవనిగడ్డ): విజ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతోందనేందుకు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. స్వైన్ ఫ్లూ భయంతో కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని సమీప గ్రామాల ప్రజలు వెలివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 5వ తేదీన చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య స్వైన్ఫ్లూతో మృతిచెందారు. దీంతో నాంచారయ్యతో పాటు మిగిలిన గ్రామస్తులకు కూడా ఆ వైరస్ ఉందని, వీరు తమతో పాటు కలిస్తే ఆ వ్యాధి తమకు కూడా సోకుతుందంటూ ఆ ఊరి ప్రజలతో శివారు గ్రామస్తులు మాట్లాడడం కూడా మానేశారు. పాలు కూడా పోయడం లేదు. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు చింతకోళ్ల గ్రామం నుంచి వచ్చే చిన్నారులకు సెలవులు ప్రకటించాయి. తాము చెప్పేవరకు విద్యార్థులను పాఠశాలలకు పంపవద్దని పలు యాజమాన్యాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు స్కూల్ బస్సులను కూడా ఆ గ్రామానికి నిలిపివేశారు. గ్రామ ప్రజలను ఆటోవాలాలు తమ ఆటోల్లో ఎక్కించుకోకుండా దూరం పెడుతున్నట్లు చింతకోళ్లవాసులు వాపోతున్నారు. ఒకవేళ చింతకోళ్ల నుంచి ఆటో వస్తే ఆ ఆటో ఎవరు ఎక్కకుండా ఖాళీగా పంపించేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక చింతకోళ్లకు బంధుత్వం ఎక్కువగా ఉన్న సమీప గ్రామాల్లో అయితే ఏకంగా ‘చింతకోళ్లకు వెళ్లవద్దు.. ఆ గ్రామస్తులను మన గ్రామంలోకి రానివద్దు అంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ గ్రామ ప్రజలు కనీస అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికీ జ్వరాలు లేవు స్వైన్ఫ్లూ మరణంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చింతకోళ్ల గ్రామంలో నాలుగు రోజుల నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులందరికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. మృతుడికి మినహా మిలిగిన ఎవరికీ జ్వరాలు లేవని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తేల్చారు. తమకు ఏవిధమైన వైరస్ సోకకపోయినా మిగిలిన గ్రామస్తులు తమను దూరం పెడుతున్నారని, తమతో మాట్లాడడం లేదని, నిత్యావసరాల కోసం వెళ్తే ఎవరూ స్పందించం లేదని చింతకోళ్లవాసులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో ఏవిధమైన వైరస్ లేదంటూ చుట్టు పక్కల గ్రామాల్లో తెలియజెప్పాలని వారు వేడుకుంటున్నారు. వెలివేసినట్లు చూస్తున్నారు మా గ్రామంలో ఒక వ్యక్తి స్వైన్ఫ్లూతో మరణించడంతో గ్రామమంతా ఈ వైరస్ ఉందంటూ తమను చుట్టు పక్కలవారు వెలివేసినట్లుగా చూస్తున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చే పాల సరఫరాను కూడా నిలిపివేశారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మా గ్రామం నుంచి విద్యార్థులను పాఠశాలలకు రావద్దంటూ సెలవులు ప్రకటించాయి. ఇలా ప్రతి విషయంలో మాముల్ని దూరం పెడడంతో గ్రామస్తులంతా తీవ్ర మనోవేదన చెందుతున్నాం. – సుబ్రహ్మణ్యం, చింతకోళ్ల గ్రామస్తుడు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు చింతకోళ్ల గ్రామంలో స్వైన్ఫ్లూ వైరస్ ఉందంటూ మిగిలిన గ్రామాల ప్రజలు చేపట్టిన అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు. వైద్యాధికారులు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందరికి రక్తపరీక్షలు కూడా చేశారు. గ్రామస్తులకు జ్వరాలు లేవని తేల్చారు. చింతకోళ్లవాసులపై వివక్షత చూపినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.ఎ.నారాయణరెడ్డి, తహసీల్దార్ -
జిల్లాలో 71 స్వైన్ఫ్లూ కేసులు నమోదు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): జిల్లాలో ఇప్పటివరకు 71 వరకు స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.తిరుపతిరావు వెల్లడించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, వీరిలో 50 ఏళ్ల వయసు దాటిన వారు ఐదుగురు మరణించారని తెలిపారు. రోగుల నుంచి తీసిన శాంపిళ్లను కేజీహెచ్లోని మైక్రోబయాలజీ విభాగానికి పంపిస్తున్నామన్నారు. జిల్లాలోని 12 కేంద్రాల ద్వారా రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అన్ని కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి కూడా కేసులు ఇక్కడ నమోదవుతున్నాయన్నారు. ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సు ప్రాంతాల్లో స్క్రీనింగ్క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. బస్టాండ్లలోని టెలివిజన్ల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నామన్నారు. సినిమా థియేటర్లలో ఇంకా ప్రచారం చేయడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేటి నుంచి పలకరింపు–2 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు పలకరింపు–2 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. ఇందులో భాగంగా ఆశ, అంగన్వాడీ, ఏఎన్ఎం, సాధికారమిత్రలు రోజుకు పది ఇళ్లకు వెళతారన్నా రు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పలకరింపు–1లో 15,813 పిల్లలకు టీకాలు వేశామని గుర్తు చేశారు. ఐదేళ్లలోపు వయసు గల పిల్లలకు టీకాలు, మొదటి 3 నెలల గర్భిణుల నమోదు, బాలింతల ఆరోగ్య పర్యవేక్షణ, నవజాత, బరువు తక్కువ గల పిల్లల ఆరోగ్య సంరక్షణ, టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు, జాగ్రత్తలు, స్వైన్ఫ్లూ, డెం గ్యూ, మలేరియా, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని సకాలంలో గుర్తించి వైద్యం అందించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. స్వైన్ఫ్లూపై అప్రమత్తంగా ఉండండి పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, కేజీహెచ్కు వచ్చిన 32 కేసుల్లో 21 స్వైన్ఫ్లూగా నిర్థారించబడిన నేపథ్యంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సుధాకర్ సూచించారు. ఆంధ్ర వైద్య కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు విషయాలు చర్చించారు. వైరాలజీ ల్యాబ్లో కేసులు పెండింగ్లో లేవని తెలిపారు. స్వైన్ఫ్లూ వ్యాధిగ్రస్తులకు అత్యవసర సేవలు అందించేందుకు వైద్యబృందం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెం ట్ జి.అర్జున, డీఎంహెచ్వో తిరుపతిరావు, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.సాంబశివరావు, ఏఎంసీ మెడిసిన్ శాఖ హెడ్, ప్రొఫెసర్ ఎ.కృష్ణమూర్తి, మైక్రో బయాలజీ శాఖ హెడ్, ప్రొఫెసర్ పి.అప్పారావు, స్వైన్ఫ్లూ నోడల్ అధికారి కె.రాంబాబు, డాక్టర్ ఎల్.కల్యాణప్రసాద్ పాల్గొన్నారు. -
స్వైన్ ఫ్లూ
పశ్చిమలో స్వైన్ఫ్లూ దాడి మొదలైంది. జిల్లాలో మొదటి స్వైన్ఫ్లూ కేసునమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న కె.కార్తీక్కు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులునిర్థారించారు. ప్రస్తుతం ఆయన ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చీఫ్ డాక్టర్ శ్రీనివాస్పర్యవేక్షణలో వైద్యం పొందుతున్నారు. పరీక్షలు చేసిన వైద్యులు అధికారికంగా స్వైన్ఫ్లూ వచ్చినట్లు నిర్థారించారు. ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులనేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే వైద్యులు మాత్రం భయపడాల్సిన పనిలేదని, అన్ని ముందుస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఏలూరు టౌన్: సాధారణంగా ఈ వ్యాధి వేడి వాతావరణం కలిగిన ప్రాంతాల్లో పెద్దగా కనిపించదు. జిల్లాలోనూ పగటి పూట వేడి అధికంగానే ఉంటుండగా రాత్రి వేళల్లో మాత్రం మంచు, చలి గత వారం రోజులుగా పెరిగింది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావటంతో ఈ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి శరవేగంగా విస్తరించేందుకు చలి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గాలిలో తేమశాతం తగ్గటం, మంచు కురవటం ఈ వ్యాధి విస్తరించేందుకుఅనుకూలించే అంశాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఉచితంగా పరీక్షలు, మందులు స్వైన్ఫ్లూ వ్యాధి నిర్థారణకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తున్నారు. నివారణకు వాడే మందులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఉచితంగా లభిస్తున్నాయి. వైద్యులకు రోగి లక్షణాలు అనుమానం వస్తే ఆర్టీపీసీఆర్ (రియల్ టైం పాలిమరేజ్ చైన్ రియాక్షన్) పరీక్షలను చేయించేందుకు చర్యలు చేపట్టారు. వ్యాధి సోకిన వారికి నివారణకు మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పెద్దలకు ‘టామీ ఫ్లూ’ 75ఎంజీ మాత్రలు, చిన్న పిల్లలకు ‘టామీ ఫ్లూ’ టానిక్ను ఇస్తారు. అదేవిధంగా పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్స్ను అందుబాటులో ఉంచారు. స్వైన్ఫ్లూ ఎలా వస్తుంది? ఈ వ్యాధికి దోమలతో ఎలాంటి సంబంధం లేదు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. స్వైన్ఫ్లూ వ్యాధి అంటువ్యాధి లాంటిది. ఇది హెచ్1, ఎన్1 వైరస్ కారణంగా సోకుతూ.. గాలి ద్వారా ప్రయాణిస్తూ వ్యాప్తి చెందుతుంది. గతంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ ఈ వ్యాధికి సీజన్గా ఉండగా, ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు ఏడాది మొత్తంగా సీజన్గా మారటం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి లక్షణాలు : స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన రోగి లక్షణాలు.. జలుబు, దగ్గు ఉంటుంది. వళ్ళు నొప్పులు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుతుంది. వాంతులు, విరేచనాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగితే ప్రాణాపాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 5 ఏళ్ళ లోపు చిన్నారులు, గర్భిణులు, షుగర్, బీపీ, గుండె, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వైన్ఫ్లూ వ్యాధి సోకిన రోగులు తుమ్మినా, దగ్గినా ముఖానికిచేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందుస్తు చర్యలు చేపట్టాం జిల్లాలో స్వైన్ఫ్లూ వ్యాధికి సంబంధించి ముందుస్తు చర్యలు తీసుకున్నాం. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాం. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో స్వైన్ఫ్లూ నిర్థారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. మందులు సైతం ప్రజలకు ఉచితంగా అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ప్రజలు ఈ విషయంలో భయపడకుండా, వ్యాధి లక్షణాలు గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదిస్తే నివారించటం సాధ్యమవుతుంది.– డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్ఓ -
స్వైన్ఫ్లూ కలకలం
కృష్ణాజిల్లా, వేజండ్ల(చేబ్రోలు): కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తికి స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన తాపీ కార్మికుడు తమ్మినేని పెద్దారెడ్డి కొద్ది రోజులు క్రితం అనారోగ్యంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించి జీజీహెచ్కు తరలించారు.గ్రామంలో స్వైన్ఫ్లూ వ్యాధి ఉన్నట్లు తెలియటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ జి. సిద్దార్థ మంగళవారం తెలిపారు. బుధవారం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో.. గుంటూరు మెడికల్: స్వైన్ ఫ్లూ లక్షణాలతో గుంటూరు నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఇద్దరు పిల్లలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు మంగళవారం వైద్య అధికారులు నిర్ధారించారు. నంబూరు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక, తెనాలికి చెందిన ఎనిమిదినెలల మగశిశువు స్వైన్ఫ్లూతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
స్వైన్ఫ్లూతో ముగ్గురు మృతి?
సాక్షి, విశాఖపట్నం: మహమ్మారి స్వైన్ఫ్లూతో విశాఖలో గత రెండు రోజుల్లో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. కొన్నాళ్ల నుంచి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమించడంతో మరణించినట్టు తెలిసింది. అయితే వీరు విశా ఖ జిల్లాకు చెందిన వారు కాదని, ఇతర జిల్లాల వారై ఉండవచ్చని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులక్రితం తమ ఆస్పత్రిలో చేరిన స్వైన్ఫ్లూ రోగి ఒకరు మరణించినట్టు ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. కాగా మంగళవారం స్వైన్ఫ్లూ లక్షణాలతో ఓ రోగి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడని, అక్కడ చికిత్స అందుతోందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుపతిరావు తెలిపారు. ప్రస్తుతం విశాఖలో స్వైన్ఫ్లూతో ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో ఒకరు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇద్దరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. -
స్వైన్ఫ్లూ కేసులు రెఫర్ చేయొద్దు
సాక్షి, అనంతపురం న్యూసిటీ: స్వైన్ప్లూ కేసులన్నీ కర్నూలుకు రెఫర్ చేయవద్దని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ పల్మనాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రామస్వామిని ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’లో మందుల్లేవ్..మాస్కుల్లేవ్ అన్న కథనానికి ఆయన స్పందించారు. ఉదయం పల్మనాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్ విభాగం వైద్యులతో సమావేశమయ్యారు. కేసులు ఎందుకు రెఫర్ చేయాల్సి వస్తోందని హెచ్ఓడీ రామస్వామిని ప్రశ్నించారు. వారి ఇష్టపూర్వకంగానే వెళ్తున్నారని హెచ్ఓడీ సమాధానమిచ్చారు. అందరూ ఆ విధంగా కర్నూలుకు ఎందుకు వెళ్తామంటారని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. మార్గమధ్యంలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండి, ఏవిధంగా ఇతర ప్రాంతాలకు పంపుతారన్నారు. ఇది సరైన పద్ధతికాదని, ఉన్నతాధికారులకు తామేమి సమధానం చెప్పాలన్నారు. సూపరింటెండెంట్ నేనా.. పల్మనాలజీ హెచోడీనా? స్వైన్ప్లూ లక్షణాలు కన్పిస్తే, ఎలాంటి ఆలోచన చేయకుండా స్వైన్ఫ్లూ వార్డులో ఉంచాలన్నారు. చిన్నపిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ మల్లీశ్వరి పాజిటివ్ అయితేనే పంపమన్నారని చెప్పారు. సూపరింటెండెంట్ ‘నేనా.. డాక్టర్ రామస్వామినా’ అని డాక్టర్ మల్లీశ్వరిని ప్రశ్నించారు. తక్షణం కేసులను స్వైన్ప్లూ వార్డుకు మార్చాలని ఆదేశించారు. స్వైన్ప్లూ వార్డులో ఉండే కేసులు ఇతర విభాగాల వైద్యులు చూడాలంటే ఎలాగని డాక్టర్ రామస్వామిని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. స్వైన్ప్లూ లక్షణాలు కాకుండా వేరే సమస్యలుంటే ఫాలోఅప్ చేస్తారని, రోజూ వారు రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. సమన్వయంతో పని చేసి రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు, ఆస్పత్రి మేనేజర్ శ్వేత, తదితరులు పాల్గొన్నారు. -
స్వైన్ఫ్లూ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ప్రాణాంతక స్వైన్ఫ్లూ విశాఖ వాసులను కలవర పెడుతోంది. ఇటు జిల్లా, అటు నగరంలోనూ అలజడి రేపుతోంది. శీతాకాలంలోనే విజృంభించే స్వైన్ఫ్లూ మండుటెండల్లోనూ ప్రతాపం చూపింది. ఇప్పుడు చలికాలం మొదలవుతుండడంతో ఈ వైరస్ ఎంతలా అదుపుతప్పుతుందోనన్న ఆందో ళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది జిల్లాలో స్వైన్ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉంది. గతేడాది 40 మంది స్వైన్ఫ్లూ బారినపడ్డారు. జనవరి నుంచి ఇప్పటిదాకా (ఈ పదకొండు నెలల్లో నే) 64 మంది ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరారు. మార్చిలో ఒకరు, అక్టోబర్లో 42, నవంబరు 24 వరకు 21 మందికి స్వైన్ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. వీరిలో నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే వీరు మధుమేహం, గుండెజబ్బు, కిడ్నీ, నరాల సంబంధ వ్యాధులతో మరణించారని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ముగ్గురు, ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల (చెస్ట్) ఆస్పత్రిలో మరొక రు స్వైన్ఫ్లూతో చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విశాఖ ప్రభావిత ప్రాంతం విశాఖపట్నం స్వైన్ఫ్లూ ప్రభావిత ప్రాంతం. నగరానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ వైరస్తో ఇక్కడకు రావడం, నగరానికి చెందిన వారు ఆ ప్రదేశాలకు వెళ్లడం ద్వారా వైరస్ సోకడం వంటివి కారణాల వల్ల ఇది వ్యాప్తి చెందుతోంది. విశాఖ సమీపంలో సింహాచలం, నగరంలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాలకు దూరప్రాంతాల నుంచి భక్తులు, అలాగే ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు వస్తుంటారు. దీంతో స్థానికులతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే స్వైన్ఫ్లూ విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తమైన యంత్రాంగం స్వైన్ఫ్లూ నియంత్రణకు జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ చర్యలు చేపట్టింది. జిల్లా, నగర వ్యాప్తంగా 12 స్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. విమానాశ్రయం, విశాఖ రైల్వే స్టేషన్ (ప్లాట్ఫాం –1, 8), సింహాచలం కొండపైన, దిగువన, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్ల ద్వారా శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేయిస్తున్నారు. కేజీహెచ్లో ఉన్న వైరాలజీ ల్యాబ్లో స్వైన్ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వైన్ఫ్లూ లక్షణాలున్న వారి కోసం కేజీహెచ్లో 10 పడకలు, పది వెంటిలేటర్లు, చెస్ట్ ఆస్పత్రిలో ఆరు పడకలు, రెండు వెంటిలేటర్లను అందుబాటులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి జలుబు, దగ్గు, గొంతునొప్పి, విపరీతమైన జ్వరం, కళ్లు మంటలు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమూహాలు, విందులు, వినోదాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలి. బయట తిరిగే వారు ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి. చెస్ట్ ఆస్పత్రి, కేజీహెచ్, జిల్లాలోని నర్సీపట్నం, పాడేరు, అరకు, అనకాపల్లి ఏరియా ఆస్పత్రుల్లోను, అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లోనూ స్వైన్ఫ్లూ నిరోధక మందులను అందుబాటులో ఉంచాం. వీటిని ఉచితంగానే ఇస్తున్నాం. స్వైన్ఫ్లూ మందుల కొరత లేదు. – ఎస్.తిరుపతిరావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి -
మందుల్లేవ్..మాస్కుల్లేవ్ !
పేరుకు జిల్లాకే పెద్దఆస్పత్రి.. సేవల్లో మాత్రం చిన్నాస్పత్రి.. జిల్లాలో స్వైన్ఫ్లూ విజృంభిస్తున్నా కనీసం మాస్క్లు.. మందులు కూడా లేని ధర్మాస్పత్రి. అందుకే వైద్యులు కూడా కేసులన్నీ రెఫర్ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. వైద్యఆరోగ్య శాఖ చోద్యం చూస్తుండగా.. కలెక్టర్ సారూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. నిరుపేదలు ప్రాణాలు నిలుపుకునేందుకు దొరికిన చోట్ల అప్పులు చేస్తూ ఇతర జిల్లాలకు పరుగు తీస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: జిల్లాలో స్వైన్ఫ్లూ పంజా విసురుతోంది. గడిచిన రెండు నెలల్లో 13 కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వైన్ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. బాధితుల్లో చిన్నారులే అధికంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది. మరోవైపు స్వైన్ఫ్లూ బాధితుల ప్రాణాలతో వైద్యఆరోగ్యశాఖ, సర్వజనాస్పత్రి యాజమాన్యం ఆటలాడుతోంది. మందులు.. కనీసం మాస్క్లు కూడా అందుబాటులో ఉంచకుండా చోద్యం చూస్తోంది. ఇదే సాకుగా వైద్యులు కేసులన్నీ కర్నూలుకు రెఫర్ చేస్తున్నారు. దీంతో నిరుపేదలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసులన్నీ కర్నూలుకే.. సర్వజనాస్పత్రి వైద్యులు మౌలిక సదుపాయాల లేమిని సాకుగా చూపి ఇప్పటి వరకు 9 కేసులను కర్నూలుకు రెఫర్ చేశారు. దీంతోనిరుపేదలంతా ఆర్థికంగా చితికిపోతున్నారు. వాస్తవంగా స్వైన్ఫ్లూ రోగులను ఐదు రోజుల పాటు ఐసొలేషన్ వార్డులో ఉంచి, మందులు అందించాలి. అవసరాల మేరకు ఫ్లూవాక్ వ్యాక్సిన్, వెంటిలేటర్, వైరల్కిట్, ఎన్95 మాస్క్లు అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం వ్యాక్సిన్, ఎన్95 మాస్క్లు పూర్తిస్థాయిలో లేవు. స్వైన్ప్లూ వార్డులో పీడియాట్రిక్ వెంటిలేటర్ సదుపాయం లేదు. ఇవి ఏర్పాటు చేస్తే రోగులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందించే వెసులుబాటుంది. ఏఎంసీ, క్యాజువాలిటీ తదితర విభాగాల వైద్యులు, స్టాఫ్నర్సులు, సిబ్బందికి ఫ్లూవాక్ వ్యాక్సిన్ వేయలేదు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే రోగులకు మరింత సేవలందించే అవకాశం ఉంటుంది. వైద్యుల మధ్య కోల్డ్వార్ సర్వజనాస్పత్రిలో వైద్యుల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. స్వైన్ఫ్లూ కేసులను చెస్ట్వార్డ్లో ఉంచుతారు. రోగులకు వైద్యం అందించే బాధ్యత సంబంధిత పల్మనాలజీ విభాగం వైద్యులదే. కానీ పల్మనాలజీ విభాగం వైద్యులు మాత్రం ఏ వార్డు నుంచి కేసు వస్తే వారే రెఫర్ చేయాలని చెబుతున్నారు. దీన్ని మిగితా విభాగాల వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ఎక్కడి నుంచైనా స్వైన్ఫ్లూ కేసు వస్తే సర్వజనాస్పత్రిలోనే అడ్మిట్ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 24న ఓ స్వైన్ఫ్లూ బాధితునికి వైద్యం అందిచే బాధ్యత మీదంటే.. మీదంటూ ఆర్ఎంఓ సమక్షంలోనే పల్మనాలజీ, పీడియాట్రిక్, మెడిసిన్, మైక్రోబయాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ విభాగం వైద్యులు ఘర్షణ పడ్డారు. ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడని కలెక్టర్ జిల్లాలో స్వైన్ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగి సర్వజనాస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడిపోతున్నా జిల్లా కలెక్టర్ ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం స్వైన్ఫ్లూ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై అధికారులతో సమీక్ష కూడా చేయలేదు. ఇప్పటికైనా కలెక్టర్ వీరపాండియన్ స్పందించకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులే చెబుతున్నారు. జిల్లాలో ప్రభావిత ప్రాంతాలు జిల్లాలోని నార్పల, ఓడీసీ, శింగనమల, గుంతకల్లు, అనంతపురం రూరల్, అర్బన్, గార్లదిన్నె, కంబదూరు మండలాల్లోని గ్రామాల్లో స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఆరోగ్యశాఖాధికారులు, ముందస్తు చర్యలు తీసుకోలేదు. తూతూమంత్రంగా కరపత్రాలు పంచి పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్య లోపం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. -
స్వైన్ ఫ్లూ దాడి...!
‘స్వైన్ ఫ్లూ’ చాప కింద నీరులా ప్రవేశిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధి కర్నూలు, చిత్తూరు జిల్లాలను వణికిస్తోంది. ఇప్పడు మన జిల్లాలో పాగా వేయడానికి సిద్ధమవుతోంది. 2017లో 50 కేసులు నమోదు కాగా పలువురు మృత్యువాత పడ్డారు. తాజాగా మొత్తం 10 కేసులు నమోదైతే ఒక్క నవంబర్ నెలలోనే 6 నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కడప రూరల్: జిల్లాలో స్వైన్ ఫ్లూ సంచారం మొదలైంది. మొన్నటి వరకు 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేసుల వివరాలు..కారణాలు... ఈ ఏడాది ప్రారంభంలో గడిచిన జూలైలో జమ్మలమడుగు పట్టణానికి చెందిన 35 సంవత్సరాల మహిళ ఈ వ్యాధికి గురైంది. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించింది. అధికారికంగా నమోదైన మృతి చేందిన కేసు ఇదే. తరువాత అక్టోబర్లో రైల్వేకోడూరు మండలానికి చెందిన ఒకరికి, ప్రొద్దుటూరులోని శ్రీనివాస నగర్కు చెందిన మరొకరికి ఈ వ్యాధి సోకింది. నవంబర్ నెలలో ఒకరికి చొప్పున రాయచోటి మండలం శిబ్యాల గ్రామం, రైల్వేకోడూరులోని శెట్టిగుంట, వీరబల్లె మండలం మట్లి గ్రామం, రాజంపేట పరిధిలోని ఆకేపాడు, జమ్మలమడుగు పట్టణంతో పాటు చిట్వేల్కు చెందిన ఒకరికి ఈ వ్యాధి సోకింది. వారంతా తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో చికిత్స పొందారు. ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో చాలామంది హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ వ్యాధికి గురైన వారంతా 35 సంవత్సరాల పైబడినవారే. అలాగే అనధికారికంగా మృతి చెందిన వారు. ముగ్గురు ఉన్నారు. వారు ఇతర జబ్బుల కారణంగా మృతి చెందినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చలితో పాటు పెరుగుతున్న కేసులు.. సాధారణంగా ఈ వ్యాధి వేడి వాతావరణం కలిగిన ప్రాంతాల్లో పెద్దగా కనిపించదు. జిల్లాలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుత తరుణంలో వాతావరణ పరిస్ధితులు మారాయి. దీనికి తోడు కర్నూలు. చిత్తూరు జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. ఆ ప్రభావం మన జిల్లాపై పడింది. ఈ వ్యాధి శరవేగంగా విస్తరించడానికి చలి కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. ఆ మేరకు జిల్లాలో గడిచిన 1వ తేదీన గరిష్టం 38, కనిష్టం 22 డిగ్రీలు నమోదయ్యాయి. 23న గరిష్టం 27, కనిష్టం 20 డీగ్రీలు నమోదయ్యాయి. దీంతో గాలిలో తేమ శాతం తగ్గుతోంది. ఇప్పుడిప్పుడు మంచు కురవడం ప్రారంభమైంది. ఇలాంటి వాతావరణంలో ఈ వ్యాధి సంచరించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టేకొద్దీ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఉచితంగా పరీక్షలు.. మందులు.. ఈ వ్యాధిని కనుగొనడానికి నిర్వహించే పరీక్షలు, నివారణకు వాడే మందులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా లభిస్తున్నాయి. ఆ మేరకు వైద్యులకు అనుమానం వస్తే ఆర్టీపీసీఆర్ ( రియల్ టైం పాలిమరేజ్ చైన్ రియాక్షన్) పరీక్షలను కడప రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటళ్లల్లో నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధికి కడప రిమ్స్లో 20 పడకలు, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో 10 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వ్యాధి సోకిన వారికి నివారణకు గాను పెద్దలకు ‘టామీ ఫ్లూ’ 75 ఎంజీ మాత్రలు, చిన్న పిల్లలకు ‘టామీ ఫ్లూ’ టానిక్ను ఇస్తారు. అలాగే పీపీఈ (పర్సనల్ ప్రొటెక్ష న్ ఎక్విప్మెంట్) కిట్స్ను కూడా అందుబాటులో ఉంచారు. గతంలో ఈ వ్యాధికి తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టేవారు. ఇప్పుడు వీటిని జిల్లాలోనే నిర్వహిస్తున్నారు ఏ రోగికైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా..అనుమానం కలిగినా ఆ వ్యక్తి గొంతు, ముక్కు నుంచి తీసిన గల్ల లాంటి పదార్ధాన్ని పరీక్షా కేంద్రానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వైద్యులు వ్యాధి ఉండేది, లేనిది నిర్ధారిస్తారు. అనంతరం చికిత్సను ప్రారంభిస్తారు. ఆ రోగికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు కూడా మందులను పంపీణీ చేస్తారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకున్న వారికే సౌకర్యం ఉంటుంది. హెచ్ 1, ఎన్ 1 వైరస్ కారణంగా.. ఈ వ్యాధికి దోమలతో ఎలాంటి సంబంధంలేదు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొýకరికి సోకుతుంది. అంటే అంటు వ్యాధి లాంటిది. ఇది హెచ్ 1, ఎన్ 1 వైరస్. గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందుతుంది. గతంలో ఈ వ్యాధికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సీజన్గా ఉండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. ఏడాది పొడుగునా సీజన్గా మారింది. వ్యాధిలక్షణాలు... జలుబు, దగ్గు ఉంటుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఊపిరి తిత్తుల్లో నెమ్ము చేరుతుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి. వీరికి సోకే అవకాశంఎక్కువ... 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 5 సంవత్సరాల లోపు చిన్నారులు, గర్భిణులు, ఘగర్, బీపీ, గుండె, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధలు కలిగిన వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సినజాగ్రత్తలు తుమ్మినా, దగ్గినా ముఖానికి చేతి రుమాలును అడ్డం పెట్టుకోవాలి. వ్యక్తి గత పరిశుభ్రతను పాటించాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలి. -
జిల్లాను వణికిస్తున్న స్వైన్ఫ్లూ
సాక్షి, గుంటూరు: స్వైన్ఫ్లూ మహమ్మారి జిల్లా ప్రజల్ని వణికిస్తోంది. రోజురోజుకు బాధితులతో పాటు, మరణాలు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాజధాని జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉన్నా అటు ప్రభుత్వం గానీ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ స్పందించిన దాఖలాలు లేవు. స్వైన్ఫ్లూ బాధితుల్లో, మరణిస్తున్న వారిలో మహిళలు, గర్భిణులు, పసికందులు అధికంగా ఉండటం మరింత ఆందోళనకు గురిచేసే విషయం. జిల్లాలో నెలల వయస్సు ఉన్న ఓ పసికందు స్వైన్ఫ్లూతో మృతి చెందగా, కవలల పిల్లల్లో ఒకరైన మరో పసికందుకు వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వ్యాధితో ఓ గర్భిణి మృతి చెందగా, ప్రస్తుతం మరో ముగ్గురికి ఉన్నట్లు నిర్ధారించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ విఫలం జిల్లాలో స్వైన్ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పూర్తిగా విఫలం చెందారని చెప్పవచ్చు. రాజధాని జిల్లాలో పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమైన విషయమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి ద్వారా వ్యాపించే స్వైన్ఫ్లూ అత్యంత ప్రాణాంతకంగా మారి జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. రాజధాని జిల్లా కావడంతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలో స్వైన్ఫ్లూ బారిన పడి ఇప్పటికే పది మంది వరకు మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో ముగ్గురు మృతి చెందడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్పందించని ప్రభుత్వం రాజధాని జిల్లాలో స్వైన్ఫ్లూ మహమ్మారి విజృంభిస్తుండటంతో బాధితులతోపాటు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయినప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు గానీ స్పందించిన దాఖలాలు లేకపోవడం దారుణమైన విషయం. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి స్క్రీనింగ్ పరీక్షలు చేయకుండా వదిలేయడం వల్ల రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల వారికి సైతం పరీక్షలు నిర్వహించి వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦ ఈనెల 19న గుంటూరు బుచ్చయ్యతోట 7వలైనుకు చెందిన చింతా ఆదిలక్ష్మి (48), వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన కొర్రపాటి వెంకాయమ్మ (67) చెందారు. ♦ ఈనెల 21న వినుకొండ పట్టణానికి చెందిన షేక్సుల్తాన్ వలి, అబిదాబీ దంపతుల 11 నెలల వయస్సు ఉన్న కుమారుడు కరీం సాదిక్ స్వైన్ఫ్లూతో బాధపడుతూ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ♦ దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన పోలె కరుణ మూడు నెలల క్రితం కాన్పు కోసం తన తల్లి ఊరు కారంపూడి మండలం చింతపల్లి వెళ్లింది. ఆమెకు ఇద్దరు కవలపిల్లలు జన్మించారు. వీరిలో మూడు నెలల వయస్సు ఉన్న ఓ పసికందుకు స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులతో పాటు, గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రస్తుతం పసికందు జీజీహెచ్లో చికిత్సపొందుతుండగా, తనతోపాటు పుట్టిన మరో పసికందును సైతం పరిశీలనలో ఉంచారు. ♦ ప్రస్తుతం జీజీహెచ్లో మరో ముగ్గురు గర్భిణులకు స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. -
గ్రేటర్లో మృత్యుఘంటికలు
సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు స్వైన్ఫ్లూ..మరో వైపు డెంగీ జ్వరాలు గ్రేటర్ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది, బస్తీల్లో ఫాగింగ్ నిర్వహించి దోమల వృద్ధిని నియంత్రించాల్సిన ఎంటమాలజీ విభాగం అధికారులు, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఆయా విభాగాలు పడకేయడంతో డెంగీ, మలేరియా దోమలు బస్తీవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతుండటంతో గ్రేటర్వాసులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం వారం రోజుల్లోనే 3723 నమూనాలు పరీక్షించగా, 148 డెంగీ పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యింది. ఇందులో 92 శాతం కేవలం గ్రేటర్లోనే నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. సాధారణంగా డెంగీ జ్వరం వచ్చిన వారిలో చాలా మందికి ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదు. నోటి ద్వారా ద్రావణాలను తాగించడం, ఐవీ ఫ్లూ యిడ్స్ ఎక్కించడం, పారాసెటమాల్ టాబ్లెట్ను ఇవ్వడం ద్వారా జ్వరం తగ్గిపోతుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రులు ఐసీయూలో అత్యవసర వైద్యసేవలు, ప్లేట్లెట్స్ కౌంట్ పేరుతో ఒక్కో రోగి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ప్లేట్లెట్స్ ప్రామాణికం కాదు.. ప్లేట్లెట్ల సంఖ్య లక్ష కంటే తగ్గిపోయినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేర్చాలి. సంఖ్య 10 వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే రక్తస్రావం ఉన్నా లేకపోయినా తిరిగి వాటిని భర్తీ చేయాలి. సంఖ్య 20 వేలలో ఉన్నప్పుడు.. రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే అప్పుడు బయటి నుంచి ఎక్కించాల్సి ఉంటుంది. 20 వేలకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అవుతుంటే.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు అందించే చికిత్సలో భాగంగా ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం వల్ల అనర్థాలు రావడమనేది వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్లేట్లెట్ల సంఖ్యతోపాటు రక్తంలో ప్యాక్డ్ సెల్ వాల్యూమ్(పీసీవీ) ఎంత ఉంది? అనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంగా ఉండాల్సిన దానికంటే 20 శాతం, అంతకంటే ఎక్కువైతే.. అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డెంగీలోనే కాకుండా ఏ రక్త సంబంధ వ్యాధుల్లో అయినా.. అనవసరంగా ప్లేట్లెట్లు, ప్లాస్మాలను మోతాదుకు మించి ఇస్తే.. అక్యూట్ లంగ్ ఇన్జ్యూరీ, కొన్నిసార్లు అలర్జిక్ రియాక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావొచ్చు. రోగికి రక్త ఉత్పత్తుల అవసరం ఎంత మేరకు ఉంది? అనేది నిర్ధరించుకున్నాక.. రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించేందుకు అ వకాశాలున్నాయని గుర్తించిన తర్వాతే వాటిని వినియోగించాలి. కోరలు చాస్తున్న స్వైన్ఫ్లూ స్వైన్ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2625పైగా నమూనాల పరీక్షించగా, వీటిలో 480 పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధితుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 215 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. రంగారెడ్డి జిల్లాలో 82 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ముగ్గురు చనిపోయారు. మేడ్చల్ జిల్లాలో 80 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఇతర జిల్లాల్లో 103 పాటిటివ్ కేసులు నమోదు కాగా, పది మంది వరకు చనిపోయారు. బాధితుల్లో 90 శాతం మంది గ్రేటర్ పరిధిలోని జిల్లాలకు చెందిన వారే కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్బిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారిలో ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. స్వైన్ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తుమ్మిప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవడం, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఫ్లూ భారిన పడకుండా కాపాడుకోవచ్చు. -
కమ్ముకున్న జ్వరం
స్వైన్ఫ్లూ గురించి ఆందోళన వద్దు మొదట దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు నివారణ ఎంత తేలికో అర్థమవుతుంది. సమర్థంగా నివారిస్తే చికిత్స తప్పిపోతుంది అసలది రాకుండా ఉండాలంటే టీకా ఉండనే ఉంది. చలి ప్రారంభమైంది. వ్యాధులు విజృంభించడానికి ఇది అనువైన కాలం. జ్వరాలు పెచ్చరిల్లే కాలం. సాధారణ జలుబు, జ్వరం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేకున్నా ఈ కాలంలోనే ఎక్కువగా దాడి చేసే స్వైన్ ఫ్లూ గురించి అప్రమత్తంగా ఉండాలి. స్వైన్ఫ్లూ లక్షణాలన్నీ మామూలు జలుబులాగే అనిపిస్తుంటాయి. కానీ సాధారణ జలుబు కంటే ఇది ఒకింత ప్రమాదకరం. తీవ్రత కూడా ఎక్కువ. అందుకే దీని గురించి తెలుసుకోవడం మరింత అవసరం. ఏమిటీ వైరస్? ‘స్వైన్ఫ్లూ’ను హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అని కూడా అంటారు. స్వైన్ఫ్లూ అంటే పంది నుంచి వచ్చే ఫ్లూ అని అర్థం. జలుబుతో వచ్చే సాధారణ (ఫ్లూ) జ్వరానికి ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ కారణమవుతుంది. ప్రధానంగా గాలి, దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్ల ద్వారానే ఈ వైరస్ రోగి నుంచి మామూలు వ్యక్తికి వ్యాపిస్తుంది. ఫ్లూకు కారణమయ్యే ఇన్ఫ్లుయెంజాలో అనేక రకాల వైరస్లు ఉన్నాయి. స్వైన్ఫ్లూనకు కారణమయ్యే వైరస్ను ‘హెచ్1ఎన్1’ వైరస్గా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ తరహా వైరస్లను ‘ఇన్ఫ్లుయెంజా ఎ’ అనీ, ‘ఇన్ఫ్లుయెంజా బీ’ అని, ‘ఇన్ఫ్లుయెంజా సి’ అని మూడురకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో ‘ఇన్ఫ్లుయెంజా బీ’ అన్న రకం పందుల్లో ఉండదు. కానీ ‘ఇన్ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్ఫ్లుయెంజా సి’ రెండూ పందుల్లో కనిపిస్తాయి. అందులో ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్ ‘ఇన్ఫ్లుయెంజా ఎ’ గ్రూపునకు చాలా దగ్గరగా ఉంది. అలాంటి వైరస్లో ఒకటైన ఇది కొన్ని మ్యూటేషన్స్కు గురై, మానవులకు సోకే విధంగా రూపొందిందని నిపుణుల మాట. ఈ వైరస్ గతంలో పందుల్లో కనుగొన్న వైరస్తో పూర్తిగా సరిపోలడం లేదు.దాంతో సాధారణ పరిభాషలో ప్రస్తుతం ‘స్వైన్ ఫ్లూ’గా అభివర్ణిస్తున్న ఈ వైరస్ను నిపుణులు ‘క్వాడ్రపుల్ రీ–అసార్టెంట్’ వైరస్ అని అంటున్నారు. అంటే ఇందులో పందులకు వచ్చే వైరస్ల జీన్స్, పక్షులకు వచ్చే వైరస్ల జీన్స్, మానవులకు వచ్చే వైరస్ల జీన్స్... ఇలా నాలుగు జీన్స్ ఉన్నా... రెండూ పందులకు వచ్చేవే ఉండటంతో దీన్ని ‘స్వైన్ ఫ్లూ’ అని పిలుస్తున్నారు. పిల్లల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందడంలో ఇబ్బంది ఉన్నాచర్మం రంగు నీలంగా లేదా బూడిద రంగు (గ్రే)గా మారినా తగినంతగా ద్రవ పదార్థాలు తాగలేకపోతున్నా వాంతులు అవుతున్నా సరిగ్గా నడవలేకపోతున్నా లేదా సంభాషించలేకపోతున్నా తట్టుకోలేనట్లుగా కనిపిస్తూ అస్థిమితంగా ఉన్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా జ్వరం, దగ్గు మళ్లీ మళ్లీ వస్తున్నా... వెంటనే అలాంటి పిల్లలను వైద్య సహాయం కోసం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పెద్దలలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందకపోయినా ఛాతిలో నొప్పి, కడుపులో నొప్పి లేదా పట్టేసినట్లుగా ఉన్నా అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపించినా అయోమయంగా అనిపించినా ఆగకుండా తీవ్రంగా వాంతులు అవుతున్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా దగ్గు, జ్వరం మళ్లీ వచ్చినా... అలాంటి పెద్దవాళ్లూ (అడల్ట్స్) కూడా వైద్య సహాయం కోసం వెంటనే డాక్టర్ను కలవాలి. వ్యాప్తిచెందే అవకాశాలిలా... ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గాలి ద్వారా సోకుతుంది. దగ్గడం, తుమ్మడం వంటి చర్యలతో గాలిలో కలిసి ఈ వైరస్ ఒకరినుంచి ఒకరికి వ్యాపించవచ్చు. అలాగే రోగి ముట్టుకున్న ప్రదేశాలను ఆరోగ్యవంతులు ముట్టుకున్నప్పుడు కూడా ఇది వ్యాపిస్తుంది. స్వైన్ఫ్లూ ...మరికొన్ని వ్యాధులకు మార్గం చూపచ్చు... స్వైన్ఫ్లూ విషయంలో మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యాధి గ్రస్తులకు మరికొన్ని వ్యాధులు తేలిగ్గా సంక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటి వాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ–రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికిగానీ స్వైన్ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ఏయే పరిస్థితుల్లో వైరస్ మనుగడ సాగించలేదంటే... కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో స్వైన్ఫ్లూ వైరస్ మనుగడ సాగించలేదు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ (167–212 డిగ్రీల ఫారెన్హీట్) ఉష్ణోగ్రత వద్ద ఇన్ఫ్లుయెంజా వైరస్ బతికి ఉండే అవకాశం లేదు. క్లోరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి జెర్మిసైడ్స్, డిటర్జెంట్ సబ్బుల వల్ల కూడా వైరస్ నిర్మూలన జరుగుతుంది. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్వైప్స్, జెల్స్ వంటివీ వైరస్ను నిర్మూలిస్తాయి. చికిత్స... సాధారణ ఫ్లూకు లాగే దీనికీ చికిత్స చేస్తారు. అయితే... ఫ్లూకు సంబంధించిన సాధారణ లక్షణాలు కనిపించగానే ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయోటిక్స్ యాంటీవైరల్ మందులను ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ యాంటీవైరల్ మందులను మాత్రం డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే యాంటీవైరల్ మందులు వాడటం వల్ల మామూలు వైరస్లకూ మందులను ఎదుర్కొనే శక్తిని (రెసిస్ట్ చేసే శక్తి లేదా రెసిస్టెన్స్) మరింతగా పెరుగుతుంది. ఒకవేళ యాంటీవైరల్ మందులనే వాడాల్సి వస్తే డాక్టర్లు తమ విచక్షణతోనూ, అనుభవంతోనూ ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. వీళ్లు కాస్త హైరిస్క్ వ్యక్తులు... సాధారణంగా మిగతా వారితో పోలిస్తే కొంత మంది స్వైన్ఫ్లూకు గురయ్యే అవకాశం ఎక్కువ. వాళ్లెవరంటే... 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్నవారు, హెచ్ఐవీ వంటి ఇమ్యూనిటీ తక్కువయ్యే వ్యాధులుండేవారిని హైరిస్క్ గ్రూపునకు చెందినవారిగా పేర్కొనవచ్చు. సాధారణ లక్షణాలివే... సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే దీన్లోనూ కనిపిస్తాయి. అంటే కాస్తంత జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ, ముక్కుకారడం, ఒంటినొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు–ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కనిపించవచ్చు. టీకాతో కచ్చితమైన నివారణ... స్వైన్ ఫ్లూకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కచ్చితమైన నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. ఈ వ్యాక్సిన్ సూదిమందు, నేసల్ స్ప్రే రూపాలలో లభిస్తున్నది. సూదిమందుగానో లేక నేసల్స్ప్రేగానో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యక్తిలో సైన్ఫ్లూ వ్యాధిని ఎదుర్కోగల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఆరు నెలల పసివాళ్లు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ ముందుజాగ్రత్త చర్యగా స్వైన్ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఈ టీకాను గర్భిణీలు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రోగికి దగ్గర ఉండేవారు కీమోప్రొఫిలాక్సిస్ మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యాధి వచ్చే అవకాశాలను ఎక్కువగా ఉండే హెల్త్ ఇండస్ట్రీకి చెందిన డాక్టర్లు, నర్స్లకు ప్రభుత్వమే ఈ ప్రొఫిలాక్టిక్ మందులను ఇస్తుంటుంది. నివారణ ఇలా... దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా రుమాలును అడ్డుపెట్టుకోవాలి. రుమాలు లేనప్పుడు వ్యక్తులు విధిగా తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే ఇతర సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు ఆ తర్వాత వాటిని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను వేరొకరు ఉపయోగించకూడదు.దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు తమ లక్షణాలు తగ్గిన 24 గంటల తర్వాత కూడా ఒకటి రెండురోజులు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది. జ్వరంతో ఉన్నవారు పిల్లల ఆటవస్తువులను ముట్టుకోకపోవడమే మేలు. పరిసరాలను, కిచెన్లను, బాత్రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడం మంచిదే. పబ్లిక్ ప్లేసెస్లో ఒకే బాత్రూమ్ ఉపయోగించినప్పుడు అందరూ తలుపు హ్యాండిల్గాని, కొళాయి నాబ్ ఉపయోగించినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దాన్నే ఫొమైట్ ట్రాన్స్మిషన్ అంటారు. కాబట్టి హ్యాండిల్స్/నాబ్స్ను ఉపయోగించినతర్వాత చేతులను తప్పనిసరిగా ‘హ్యాండ్ శానిటైజర్స్’తో శుభ్రం చేసుకోవడం అవసరం. పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ వాడటం కొంత మేరకు మంచిదే. -
గాంధీలో స్వైన్ఫ్లూతో ఇద్దరు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గత రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు స్వైన్ఫ్లూతో మృతి చెందారు. ఆస్పత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట బొల్లారంకు చెందిన మహిళ (46) ఈ నెల 8న గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్య నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు స్వైన్ఫ్లూ పాజిటివ్ అని వెల్లడైంది. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం (13న) ఉదయం మృతి చెందింది. హైదరాబాద్ కర్మన్ఘాట్కు చెందిన వృద్ధుడు (67) మ్యాక్స్క్యూర్ ఆస్పత్రి నుంచి రిఫరల్పై ఈ నెల 9న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. స్వైన్ఫ్లూ చికిత్స పొందుతూ ఈ నెల 12న కన్ను మూశాడు. దీంతో ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ వల్ల మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రంగారెడ్డి జిల్లా బాలానగర్కు చెందిన మహిళ (48), హైదరాబాద్ చంపాపేట సంతోష్నగర్కు చెందిన ఓ వ్యక్తి, మంచిర్యాల బెల్లంపల్లి లంబాడీ తండాకు చెందిన మహిళ (41)లు స్వైన్ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురు అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 39 మందిలో 9 మంది మృతి.. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ మందులు ఇతర వసతులు ఉన్నాయని, మృతులకు స్వైన్ఫ్లూ, ఇతర రుగ్మతలు ఉండటంతోపాటు, చివరి క్షణాల్లో రిఫరల్పై ఇక్కడకు వచ్చారని, మెరుగైన వైద్యసేవలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలో 39 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా 27 మంది సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారని, 9 మంది మృతిచెందారని వెల్లడించారు. మరో ముగ్గురుకి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. -
వామ్మో..స్వైన్ఫ్లూ
అనంతపురం న్యూసిటీ: స్వైన్ఫ్లూ దెబ్బకు ‘అనంత’ వణికిపోతోంది. ఇప్పటికే జిల్లా ఐదు కేసులు నమోదు కాగా తాజాగా మరో గర్భిణికి స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపించాయి. రొద్దంకు చెందిన ఓ గర్భిణిని(22) అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆదివారం ఆస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేశారు. స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపించడంతో...మైక్రోబయాలజీ విభాగం సిబ్బంది గర్భిణి త్రోట్ స్వాప్ తీసి ల్యాబ్కు పంపారు. రిపోర్టు రావాల్సి ఉంది. బెంగళూరుకు పరుగు తీస్తున్న బాధితులు స్వైన్ప్లూతో బాధపడుతున్న రోగులు‘అనంత’ ఆస్పత్రిలో ఉండలేమంటూ పరుగులు తీస్తున్నారు. స్వైన్ఫ్లూతో బాధపడుతున్న ఓ అమ్మాయిని కుటుంబీకులు ఆదివారం సర్వజనాస్పత్రి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్ ఇక్కడే ఉంచితే...మెరుగైన వైద్యం అందిస్తామని బాధిత కుటుంబీకులకు భరోసా ఇచ్చినా వారు వినిపించుకోలేదు. ముఖ్యంగా స్వైన్ఫ్లూ వార్డులో సిబ్బంది ఎవరూ ఉండకపోవడం, ఒకరే ఉండాల్సి వస్తోందని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా స్వైన్ఫ్లూతో బాధపడుతున్నట్లు తమ గ్రామస్తులకు తెలిస్తే మరోలా చూస్తారని చెబుతున్నారు. నార్పలకు చెందిన ఓ అమ్మాయిని ఇప్పటికే బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. నార్పల అమ్మాయికి స్వైన్ఫ్లూఎలా సోకిందంటే? స్థానిక సాయినగర్లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఓ 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థినికి స్వైట్ఫ్లూ ఉన్నట్లు తేలింది. నార్పలకు చెందిన ఈ అమ్మాయి సోదరుడు బెంగళూరులో స్టాఫ్వేర్ ఉద్యోగం చేసేవాడు. ఇటీవల ఇతనికి స్వైన్ఫ్లూ సోకింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నాక..నార్పలకు వచ్చాడు. ఈ క్రమంలోనే సోదరికి స్వైన్ఫ్లూ సోకినట్లు ఆరోగ్యశాఖాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నారికి స్వైన్ఫ్లూ లేదు నార్పలకు చెందిన చిన్నారి(7)కి స్వైన్ఫ్లూ లేదని తేలడంతో ఆదివారం వైద్యులు బాలికను చిన్నపిల్లల వార్డుకు షిఫ్ట్ చేశారు. సాధారణ సమస్యగా పరిగణించి వైద్యం అందిస్తున్నారు. స్వైన్ఫ్లూ బాధితులు వీరే జిల్లాలో నెలన్నర కాలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. కళ్యాణదుర్గం బైపాస్లోని ఓ 40 ఏళ్ల మహిళకు స్వైన్ఫ్లూ సోకి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనంతపురం నగరానికి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి, ఓడీసీ మండలం కొండకమర్ల గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ, నార్పలకు చెందిన 26 ఏళ్ల గర్భిణి, అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న నార్పలకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి స్వైన్ఫ్లూ బాధితుల్లో ఉన్నారు. -
స్వైన్ ఫ్లూ సైరన్
సాక్షి, కడప : స్వైన్ ఫ్లూ రాయలసీమను వణికిస్తోంది. ఇప్పటికే పొరుగున ఉన్న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో స్వైన్ఫ్లూ భయకంపితులను చేస్తుండగా.. చాపకింద నీరులా జిల్లాలోనూ ప్రవహిస్తోంది. ఈ ఏడాది జూలైలో జమ్మలమడుగుకు చెందిన ఒక మహిళ హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అనధికారికంగా మరో ముగ్గురు మత్యువాత పడ్డారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఒకరు మాత్రమే మృతి చెందినట్లుగా చూపించారు. గతేడాది కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖను స్వైన్ ఫ్లూ భయ పెట్టిందనే చెప్పవచ్చు. బుధవారం చక్రాయపేట మండలం నెర్సుపల్లెకు చెందిన చంద్ర స్వైన్ ఫ్లూతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ‘సాక్షి’ తెలియజేస్తోంది. 2017లోనూ భారీగా కేసులు నమోదు జిల్లాలో గతేడాది స్వైన్ఫ్లూ కేసులు భారీగా నమోదయ్యాయి. తెలంగాణ, కేరళతోపాటు రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో కూడా స్వైన్ఫ్లూ ఎక్కువగానే కనిపించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారమే 50 కేసులు నమోదయ్యాయి. కొంత మంది రిమ్స్లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందగా.. మరి కొంత మంది తిరుపతి స్విమ్స్, బెంగళూరు, హైదరాబాద్లో కూడా చికిత్స ద్వారా కోలుకున్నారు. అయితే ఇటీవల మరో ముగ్గురు కూడా స్వైన్ఫ్లూ బారిన పడి ప్రాణాలు వదిలారు. సరిహద్దు జిల్లాల్లో అలజడి వైఎస్సార్ జిల్లా ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలో స్వైన్ఫ్లూ కలవర పెడుతోంది. అందులోనూ జిల్లాలో 2018 జూలై 6న జమ్మలమడుగుకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ సోకి హైదరాబాదు అపోలో ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన కూడా ఉన్న నేపథ్యంలో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే జిల్లాలో స్వైన్ ఫ్లూ ఇటీవల ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. చిత్తూరు, కర్నూలులో స్వైన్ఫ్లూతో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తుండగా, పలు వురు పెద్దాస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఎప్పుడూ కనిపించని వ్యాధి సాధారణంగా జిల్లాలో వైరల్ జ్వరాలు నమోదవుతుంటాయి. స్వైన్ ఫ్లూ కేసులు అరుదుగా ఉంటా యి. అలాంటిది ఈ వ్యాధి 2012 నుంచి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో విజృంభించడం వైద్య ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాకు చెందిన పలువురు వ్యాధి బారిన పడినా.. హైదరాబాద్, తిరుపతి, వేలూరు, కర్నూలు పెద్దాస్పత్రుల్లో చికిత్స పొందుతూ గతంలో మృత్యువాత పడడంతో రికార్డులకు ఎక్కనట్లు తెలు స్తోంది. జిల్లాలోని ఆస్పత్రులకు సంబంధించి ఎవరూ కూడా స్వైన్ఫ్లూతో రాకపోవడం ఊరటనిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్లలో స్వైన్ ఫ్లూకు సంబం ధించి కౌంటర్లు పెట్టి మందులను అందుబాటులో ఉంచింది. అలాగే పలు పెద్దాస్పత్రుల్లో స్వైన్ఫ్లూ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే చక్రాయపేట మండలం నెర్సుపల్లెకు చెందిన చంద్ర స్వైన్ ఫ్లూ సోకి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడం కలకలం రేపింది. జిల్లాలో కలకలం చక్రాయపేట : నెర్సుపల్లెలో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో బుధవారం మృతి చెందిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. బేల్దారి పూల చంద్ర(50)కు 10 రోజుల క్రితం జలుబుతో కూడిన జ్వరం వచ్చింది. సురభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోగా.. జ్వరం తగ్గకపోవడంతో కడప రిమ్స్కు వెళ్లారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో.. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. స్వైన్ఫ్లూ అని వైద్యులు నిర్ధారించారు. వైద్యం చేయించుకుంటూ అక్కడే మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. ఒక కుమార్తెకు వివాహమైంది. కుటుంబ యజమాని చనిపోవడంతో వారి కుటుంబం వీధిన పడింది. స్వైన్ఫ్లూతో చంద్ర మృతి చెందడంతో.. గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భయ పడొద్దంటున్న డాక్టర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు. స్వైన్ఫ్లూ అనుమానత వ్యక్తులను కడప రిమ్స్కు పంపించి వైద్యం చేయిస్తామని వారు పేర్కొన్నారు. ఎవరూ భయపడవద్దని వివరించారు. మందులు ఇవ్వని వైద్యులు చంద్ర కుటుంబ సభ్యులకు, గ్రామంలోని ప్రతి ఒక్కరికి జిల్లా వైద్య శాఖ అధికారి, డీఎంహెచ్ఓ అసిఫ్, డాక్టర్ ఏపీడీమాలజిస్ట్ డాక్టర్ ఖాజా, ఎంపీహెచ్ఓ వెంకటరెడ్డి, ఎంపీహెచ్ఓ ప్రసాద్, డాక్టర్ ఖాజామోద్ధీన్తోపాటు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముందస్తు నివారణలో భాగంగా ఎలాంటి మందులు పంపిణీ చేయలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరామర్శించిన వైఎస్ భాస్కర్రెడ్డి బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన పూల చంద్రకు నివాళులర్పించారు. -
బాబోయ్ స్వైన్ఫ్లూ
జిల్లా ప్రజలను స్వైన్ఫ్లూ భూతం వణికిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇంకా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దగ్గినా, తుమ్మినా ఈ వ్యాధి ఇతరుల నుంచి వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. చలికాలం ప్రారంభమవడంతో వ్యాధి వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం వ్యాధి లక్షణాలు ఉన్నా ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. గుంటూరు మెడికల్: నవ్యాంధ్ర రాజధాని జిల్లా గుంటూరు ప్రజల్లో స్వైన్ఫ్లూ వ్యాధి భయం ప్రారంభమైంది. గుంటూరు జీజీహెచ్లో 2018 జనవరి నుంచి నవంబర్ 8వ తేదీ వరకు 50 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేయగా 14 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్థారించారు. ఇరువురు స్వైన్ఫ్లూతో చికిత్స పొందుతూ మృతిచెందారు. గతేడాది 212 మందికి స్వైన్ఫ్లూ నిర్థారణ పరీక్షలు చేయగా 95 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. గతేడాది ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. స్వైన్ఫ్లూ అంటువ్యాధి కావటం , వ్యాధిసోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా రోగి నోటి తుంపర్ల ద్వారా, గాలి ద్వారా అతి వేగంగా వ్యాపించి ప్రాణాలను తీస్తున్న వైనంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్వైన్ఫ్లూ బాధితుల వివరాలు.. నరసరావుపేటకు చెందిన ఓ మహిళకు స్వైన్ఫ్లూ ఉన్నట్లు అనుమానం వచ్చి సెప్టెంబర్ 30న గుంటూరు జీజీహెచ్లో చేర్పించగా అక్టోబర్ 4న వ్యాధి ఉన్నట్లు నిర్థారించారు. నాటి నుండి వరుసగా కేసులు నమోదు అవుతూ ఉండటంతో జిల్లా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కొప్పురావూరుకు చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 17న, రాజుపాలెంకు చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 24న, గుండ్లపల్లికి చెందిన ఇద్దరు పిల్లలకు అక్టోబర్ 26న, అమరావతికి చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 29న, పొన్నూరుకు చెందిన వ్యక్తికి, తొట్టెంపూడికి చెందిన మహిళకు అక్టోబర్ 30న, రేపల్లెకు చెందిన మహిళకు అక్టోబర్ 31న స్వైన్ఫ్లూ సోకినట్లు నిర్థారించి వైద్యసేవలను అందిస్తున్నారు. నవంబర్ 3న హైదరాబాద్కు చెందిన మహిళకు, 5వ తేదీన గుంటూరు సంగడిగుంటకు చెందిన మహిళకు, మిన్నెకల్లుకు చెందిన వ్యక్తికి, 6వ తేదీన బాపట్లకు చెందిన మహిళకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. అక్టోబర్ 8న ముగ్గురు అనుమానితులకు పరీక్షలు చేయగా వీరిలో ఒకరికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ వ్యాధి కేసులు నమోదు అవ్వటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు... స్వైన్ఫ్లూ వ్యాధి ఎచ్1ఎన్1 వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే లాలాజల తుంపర్లు, ముక్కులోని స్రవాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన వారిలో మొదట సాధారణ జ్వర ం, గొంతునొప్పి, తుమ్ములు, ముక్కు, కళ్ళ వెంట నీరుకారడం, ఒళ్ళునొప్పులు, విరోచనాలు తదితర లక్షణాలు ఉంటాయి. తరువాత దగ్గు ప్రారంభమై నీరసం, నిస్సత్తువ, వాంతులు, విరోచనాలు, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుబాటులో వ్యాక్సిన్లు, మందులు స్వైన్ఫ్లూ రాకుండా నివారించేందుకు గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో 150 వ్యాక్సిన్లు, 250 మాస్క్లు అందుబాటులో ఉంచాం. బాధితులకు ఐసీయూలో ప్రత్యేక వైద్యసేవలను అందిస్తున్నాం. హార్ట్ ఫెయిల్యూర్, సీవోపీడీ, ఉబ్బసం, హెచ్ఐవి, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారిలో స్వైన్ఫ్లూ లక్షణాలు త్వరగా ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులకు వ్యాధి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. దగ్గినా, తుమ్మినా రుమాలు ముఖానికి అడ్డుపెట్టుకోవాలి. చలికాలంలో వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నెల వరకు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ దుళ్ళపల్లి సుధీన, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ -
స్వైన్ టెర్రర్
అనంతపురం న్యూసిటీ: ‘అనంత’ స్వైన్ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకో చోట స్వైన్ఫ్లూ కేసు నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. స్వైన్ఫ్లూతో ఇప్పటికే జిల్లాలోని ముగ్గురు కర్నూలు, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... తాజాగా ఓ గర్భిణికి స్వైన్ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. రెండ్రోజుల క్రితం నార్పలకు చెందిన ఓ గర్భిణి(26)కి స్వైన్ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కుటుంబీకులు హుటాహుటిన బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యశాఖాధికారులు గర్భిణికి త్రోట్ స్వాప్ తీయగా స్వైన్ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమెను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే విషయమై డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్ను ఆరా తీయగా..స్వైన్ఫ్లూ సోకిన మాట వాస్తవమేనన్నారు. గర్భిణీ ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు. ఇప్పటికై కళ్యాణదుర్గం బైపాస్కు చెందిన ఓ మహిళ స్వైఫ్లూతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా...అనంతపురం నగరానికి చెందిన ఓ వ్యక్తి, ఓడీసీ మండలం కొండకమర్లకు చెందిన ఓ మహిళ స్వైఫ్లూతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా జిల్లాలో స్వైన్ఫ్లూకు చికిత్స చేసేందుకు అవసరమైన సదుపాయాలు, మందులు లేకపోవడంతో జనం భయాందోళనలు చెందుతున్నారు. స్వైన్ఫ్లూ ఇంతగా విజృంభిస్తున్నా... వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గుడివాడలో స్వైన్ఫ్లూ కలకలం
విజయనగరం, భోగాపురం(నెల్లిమర్ల): జిల్లాలో మరో స్వైన్ఫ్లూ మరణం చోటు చేసుకుంది. ఇక్కడ అనా రోగ్యం బారినపడి విశాఖలో ఇప్పటికే కొందరు చికిత్స పొందుతున్న సంగతి తెలి సిందే. ఇటీవలే సాలూరుకు చెందిన ఓ మహి ళ మృతి చెందగా... తాజాగా భోగా పురం మండలం గుడివాడలో ఓ మాజీ సైనికోద్యోగి ఈ వ్యాధితో మృతి చెందారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దుక్కెటి నర్సింహమూర్తి(46) ఆర్మీలో పనిచేస్తూ నాలుగు మాసాల క్రితమే పదవీ విరమణ పొందారు. మద్యానికి బానిసైన ఈయన గతనెల 27నుంచి ఆరోగ్యం బాగోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో కల్యాణి ఆస్పత్రిలో చికిత్సకోసం వెళ్ళి వస్తుండేవారు. అప్పుడప్పుడు భోగాపురంలోని రెవెన్యూ కార్యాలయానికి ఏవో ధ్రువపత్రాలకోసం వస్తుండేవారు. విశాఖలో ఆయ న్ను పరీక్ష చేసిన వైద్యులు గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నట్లు గుర్తించి దానికి సంబంధించిన వైద్యం చేశారు. అయితే కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి 31న స్వైన్ ఫ్లూ పరీక్షలకు అవసరమైన నమూనాలుఅందజేశారు. ఉన్నట్టుండి ఈ నెల 3న ఆయన మృతి చెందగా... గుండెపోటు వల్ల చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కానీ ఈ నెల 5న స్వైన్ఫ్లూ పరీక్షల ఫలితాలు వచ్చాయి. దానిలో స్వైన్ఫ్లూ పాజిటివ్ ఉన్నట్లు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది విషయం తెలుసుకున్న పోలిపల్లి పీహెచ్సీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వైద్యాధికారి సునీల్తో సహా సిబ్బంది గ్రామానికి బుధవారం వెళ్ళి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా కుటుంబ సభ్యులకు మందులు అందించారు. అలాగే ఇంటి చుట్టు పక్కల ఎవరికైనా స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నదీ, లేనిదీ పరిశీలించారు. ఎవరికీ ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో కల్యాణి ఆస్పత్రికి నర్సింహమూర్తి రోజూ వెళ్ళి వచ్చేవాడని, ఆ క్రమంలో అక్కడ ఎవరినుంచైనా మృతుడికి వ్యాధి సంక్రమించి ఉండవచ్చునని వైద్యాధికారి సునీల్ అభిప్రాయపడ్డారు. అలాగే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి స్వైన్ఫ్లూ మందులు పంచిపెట్టారు. అలాగే ఆటోద్వారా గ్రామంలో స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ఆశకార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామంలో దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పితో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వెంటనే గుర్తించి అవసరమైన మందులు అందించాలని తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ
అనంతపురం న్యూసిటీ: జిల్లాలో స్వైన్ఫ్లూ సైరన్ మోగుతోంది. వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. రెండు నెలల్లో ముగ్గురికి వ్యాధి లక్షణాలు బయటపడటం కలవరపెడుతోంది. ఇప్పటికే మలేరియా, డెంగీ, కంఠసర్పితో ప్రత్యక్షనరకం చూస్తున్న జనం..స్వైన్ టెర్రర్తో హడలిపోతున్నారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లా, తిరుపతి ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ తీవ్రస్థాయిలో ఉండడం... జిల్లాలోనూ కేసులు నమోదవడంతో మరింత భయాందోళనలు చెందుతున్నారు. అయితేఅప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం నిద్రావస్థలో తూగుతోంది. మందులు కూడా అందుబాటులో ఉంచకుండా తన నిర్లక్ష్యాన్ని మారోసారి చాటిచెబుతోంది. స్వైన్ఫ్లూ జాడలు జిల్లా 45 రోజుల నుంచి స్వైన్ఫ్లూ అలజడి మొదలైంది. నెల రోజుల క్రితం కళ్యాణదుర్గం బైపాస్ సమీపంలో ఓ మహిళ స్వైన్ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ వైద్య పరీక్షలు చేయగా స్వైన్ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 3న ఓడీ చెరువు కొండకమర్ల గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని చేరింది. పరీక్షించిన వైద్యులు స్వైన్ఫ్లూ అనుమానంతో సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. ఆమెను పరీక్షించిన వైద్యులు..రక్తనమూనాలు సేకరించి స్వైన్ఫ్లూగా నిర్ధారించారు. వెంటనే కర్నూలు ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ మరోసారి పరీక్షించగా ఆ మహిళకు స్వైన్ఫ్లూ సోకినట్లు తేలింది. ఇక తాజాగా సోమవారం అనంతపురం రూరల్ ప్రాంతానికి చెందిన ఓ 50 ఏళ్ల వృద్ధునికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయ్యింది. ఈయన ప్రస్తుతం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలా స్వైన్ప్లూ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలేవీ? స్వైన్ఫ్లూ విజృంభిస్తున్నా..ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. జిల్లాలోని సర్వజనాస్పత్రి మినహా మిగితా ఏ ఆస్పత్రుల్లోనూ స్వైన్ఫ్లూకు సంబంధించిన ఫ్లూవిర్ మందులు లేవు. ప్రభుత్వం కనీసం సరఫరా చేయలేదంటే ప్రజారోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక స్వైన్ఫ్లూ సోకకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్యులు, స్టాఫ్నర్సులకు వ్యాక్సిన్ వేయలేదు. సర్వజనాస్పత్రిలో ఎన్95 మాస్క్లు అందుబాటులో ఉన్నా స్టాఫ్నర్సులకు సరఫరా చేయలేదు. ఇక స్వైన్ఫ్లూ నిర్ధారణ పరీక్ష(ఆర్టీపీసీఆర్) ఒక్క వైద్య కళాశాలలో మాత్రమే చేస్తారు. మిగితా ఆస్పత్రుల్లో అటువంటి సదుపాయం లేదు. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న ఆరోగ్యశాఖ మరో రెండ్రోజుల్లో జిల్లాలోని ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ ప్లూవిర్ మందులతో పాటు ఫ్లూ వ్యాక్ వ్యాక్సిన్ అందించేందుకు ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. పీహెచ్సీలకు 20 మాత్రలు, ఏరియా ఆస్పత్రులకు 50, జిల్లా ఆస్పత్రులకు 200 మాత్రలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడకలు అంతంతే స్వైన్ఫ్లూ బారిన పడిన వారిని ఐసొలేషన్ వార్డులో ఉంచాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అందవల్లే స్వైన్ఫ్లూ బాధితుల కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో పది పడకలు, హిందూపురం, కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రుల్లో 5 పడకలు ఏర్పాటు చేశారు. ఒక్క అనంతపురం బోధనాస్పత్రిలో మినహా మిగితా ప్రాంతాల్లో సదుపాయాలు సరిగా లేవు. దీంతో పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం లేకపోలేదని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మందులు వస్తాయి స్వైన్ఫ్లూ బారిన పడిన వారికి ఇచ్చే మందులు నేడో రేపో వస్తాయి. ఏరియా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతాం. వ్యాక్సిన్, ఎన్95 మాస్క్లు లేవు. అయినా రోగులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రమేష్నాథ్, డీసీహెచ్ఎస్ పండుగ తర్వాత వ్యాక్సిన్లు మందుల కొరత లేదు. రోగ నిర్ధారణ అయిన వారికి మందులు సరఫరా చేస్తాం. వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టాం. 235 వ్యాక్సిన్లు పండుగ తర్వాత వస్తాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.– డాక్టర్ కేవీఎన్ఎస్అనిల్కుమార్, డీఎంహెచ్ఓ -
మరో స్వైన్ఫ్లూ కేసు నమోదు
అనంతపురం న్యూసిటీ: జిల్లాలో రెండో స్వైన్ఫ్లూ్ల కేసు నమోదైంది. ఓడీ చెరువు మండలం కొండకమర్ల గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ శనివారం ఆస్పత్రిలో చేరగా...ఆదివారం ఆ మహిళను పరీక్షించిన వైద్యులు స్వైన్çఫ్లూగా నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ సమీపంలో నివాసముంటున్న ఓ మహిళ స్వైన్ఫ్లూ్ల లక్షణాలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆందోళనలో ఆస్పత్రి సిబ్బంది స్వైన్ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న మహిళ శనివారం ఆస్పత్రిలో చేరగా...వైద్యులు, స్టాఫ్నర్సులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సేవలందించారు. ఆమెకు స్వైన్çఫ్లూ్ల ఉందని తేలడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఫ్లూవాక్ వ్యాక్సిన్, ఎన్95 మాస్క్లు అందుబాటులో లేకపోయినా వైద్యం చేశామనీ, స్వైన్ఫ్లూ తమకు ఎక్కడ సోకుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. -
వి.కోటలో స్వైన్ఫ్లూ కలకలం
చిత్తూరు , వి.కోట: మండలంలోని బోడిగుట్లపల్లికి చెందిన చిన్నారికి స్వైన్ఫ్లూ ఉన్నట్టు తేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన ఉదయ్కుమార్ కుమార్తె సాయిలక్ష్మి(6) పది రోజు లుగా తీవ్రమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతోంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో బెంగళూరులో చూపిం చారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాలికకు హెచ్1 ఎన్1 స్వైన్ఫ్లూ ఉన్నట్టు నిర్ధారించారు. ఈ విష యం తెలియడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓగు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణనాయుడు ఆదివారం బోడిగుట్లపల్లిలో స్వైన్ఫ్లూపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదిం చాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన చిన్నారి సాయిలక్ష్మి కుటుంబ సభ్యులకు వివిధ పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిరోధక మందులు అందజేశారు. -
చంద్రబాబు ఇలాకాలో.. స్వైన్ఫ్లూ కలకలం
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృభిస్తోంది. గత వారం రోజులుగా స్వైన్ఫ్లూ బారిన పడి పలువురు మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలోని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్వైన్ఫ్లూ కలకలం రేపుతోంది. ఆరేళ్ల చిన్నారికి స్వైన్ఫ్లూ సోకినట్టుగా ఆదివారం వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆ పాపను కర్ణాటకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్వైన్ఫ్లూ కేసు నమోదు కావడంతో కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు భయాందోళ చెందుతున్నారు. దీంతో వైద్యులు కుప్పం, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం, వి కోట మండలాల్లో స్వైన్ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. -
అమ్మో జ్వరం
సాక్షి,సిటీబ్యూరో: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు ప్రస్తుతం స్వైన్ఫ్లూ, డెంగీ వంటి ఇతర సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ జ్వర పీడితులే కాదు.. దగ్గు, జలుబు, తలనొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వారిని చేర్చుకుని చికిత్స అందించే విషయంలో వైద్యులు సైతం చేతులెత్తేస్తున్న దుస్థితి. వస్తున్న రోగులకు తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండడంతో ప్రాణాంతకమైన స్వైన్ఫ్లూ, డెంగీ జ్వరాలతో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న నిరుపేద రోగులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఒక్క గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే కాదు.. హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఇలాగే ఉంది. ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రి ఔట్పేషంట్ విభాగానికి రోజుకు సగటున మూడు వేల మందిరోగులు వస్తున్నారు. 1,062 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం 1500 మందికి పైనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 500 పైగా పాజిటివ్ స్వైన్ కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడ్డారు. స్వైన్ఫ్లూ బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం గాంధీ జనరల్ ఆస్పత్రిని ప్రత్యేక నోడల్ కేంద్రంగా ఎంపిక చేసింది. 20 పడకలు, 10 వెంటిలేటర్లతో ప్రత్యేక వార్డు ను ఏర్పాటు చేసింది. స్వైన్ఫ్లూ అనుమానితులు ఇతర ఆస్పత్రుల నుంచి రెఫరల్పై వచ్చిన రోగులకు క్యాజువాలిటీలోనే చుక్కెదురవుతోంది. రోగులకు తగ్గ పడ కలు లేకపోవడంతో చాలా మంది ఫ్లోర్ బెడ్పైనే ఉంచి చికిత్సలు అందించాల్సి వస్తోంది. బుధవారం 1,929 మంది ఇన్పేషంట్లు ఉన్నారు. స్వైన్ఫ్లూ, డెంగీ పాజిటివ్ కేసులనే చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. అనుమాని తులను ఓపీలోనే నమూనాలు సేకరించి పంపుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయి వైద్యుల చేతికి నివేదికలు అందే సమయానికి వ్యాధి తీవ్రత మరింత పెరిగి రోగులు మృత్యువాతపడుతు న్నా.. వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవట్లేదు. ఉస్మానియాకు తరలింపు.. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. రోగులకు తగ్గ పడకలు ఏర్పాటు చేసే అవకాశమున్నా స్థలం సమస్యగా మారింది. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడం, ఇప్పటికే పలుమార్లు పైకప్పు కూలడం, మూడు, రెండు అంతస్తుల్లోని వార్డులను పూర్తిగా ఖాళీ చేయడం తెలిసిందే. సాధారణ రోగులతోనే సతమతమవుతున్న ఆస్పత్రి యంత్రాంగం.. తాజాగా వస్తున్న స్వైన్ఫ్లూ, డెంగీ బాధితులతో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వచ్చే రోగులతోనే ఉస్మానియా కిక్కిరిసిపోతుంటే, మూడు రోజుల కింద గాంధీ ఆస్పత్రి నుంచి 20 మంది స్వైన్ఫ్లూ అనుమానితులను ఇక్కడికి పంపడం గమనార్హం. ప్రస్తుతం ఆస్పత్రిలో అధికారికంగా 1,165 పడకలు ఉండగా, అనధికారికంగా 1,385 పడకలు నిర్వహిస్తోంది. జనరల్ మెడిసిన్ విభాగంలో 320 పడకలు ఏర్పాటు చేసింది. అయితే ఆస్పత్రికి వస్తున్న జ్వరపీడితులతో ఈ వార్డు కిక్కిరిసిపోతోంది. కొత్తగా వచ్చిన వాళ్లకు కనీసం పడక కూడా కేటాయించలేని దుస్థితి. ఆస్పత్రిలో 90 వెంటిలేటర్లు ఉండగా, 40 వెంటిలేటర్లు సాంకేతిక లోపాలతో మూలన పడ్డాయి. స్వైన్కు ఇదే అసలైన కాలం! చలి తీవ్రతకు హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెం బర్, జనవరిలో ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపుతుంది. అనేక మంది వీటి బారినపడి చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తుంటారు. వీరి లో డెంగీ, స్వైన్ఫ్లూ అనుమానితులు కూడా ఉం టారు. అడ్మిట్ చేసుకుని వీరి నుంచి నమూనా లు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపిన 48 గంటల తర్వాత రిపోర్ట్ వస్తుంది. ఆస్పత్రులకు వస్తున్న వారిలో పాజిటివ్ బాధి తులతో పోలిస్తే అనుమానితులే అధికం. వీరిని ఇతర వార్డుల్లో ఉంచి చికిత్సలు అందించలేరు. అలాగని పాజిటివ్ కేసుల సరసన చేర్చలేరు. ఇలాంటి వారితో పడకలు నిండిపోతున్నాయి. మూడు, నాలుగు రోజుల వరకు ఖాళీ కావట్లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైద్యాధికారు లు ముందే దృష్టి సారించకపోవడం, తీరా సమస్య జఠిలమైన తర్వాత హడావుడి చేయ డం తప్ప కనీస చర్యలు కూడా చేపట్టట్లేదు. ప్రభుత్వఆస్పత్రులకే ఎందుకంటే..? సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే వైద్య పరీక్షలు, ఐసీయూలో చికిత్సల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ జ్వరానికి కూడా రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటం, డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెరగటం.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు జరుగుతుండటంతో.. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకే మొగ్గు చూపుతున్నారు. -
స్వైన్ఫ్లూపై ఆందోళన వద్దు
నెల్లూరు(బారకాసు): స్వైన్ఫ్లూ పై ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేద ని డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం పేర్కొన్నారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వైన్ఫ్లూ నివారణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వైన్ఫ్లూ సోకిన వారికి ప్రత్యేకంగా వైద్యం అందించేందుకునగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. అలాగే వైద్యబృందం, అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఎవరకైనా రెండు, మూడు రోజులుగా జ్వరం, జలుబు తగ్గకుండా స్వైన్ఫ్లూ లక్షణాలని అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడా అవసరమైన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారించి తగిన చికిత్స అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 11 మందికి స్వైన్ఫ్లూ వ్యాధి సోకిందని వారంతా పలు కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. వీరిలో నెల్లూరు నగరం, చిట్టమూరు, సౌత్మోపూరు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వారని తెలిపారు. ఈ ఏడాదిలో స్వైన్ఫ్లూతో మృతి చెందిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు స్వైన్ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కరపత్రాలు పంపిణీ, ముఖ్య కూడల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. పీఎంపీ, ఆర్ఎంపీలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వైన్ఫ్లూపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని ఆదేశించామన్నారు. తమ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫీవర్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా జ్వరాలు కానీ, స్వైన్ఫ్లూ లక్షణాలు కన్పిస్తే వెంటనే సెల్ 9618232115, ల్యాండ్ 0861–2300310కు ఫోన్ చేయాలని కోరారు. తమ వైద్య సిబ్బంది స్పందించి అవసరమైన వైద్య చికిత్స అందజేస్తారని పేర్కొన్నారు. -
చంపుతున్న స్వైన్ఫ్లూ
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: జిల్లాలో స్వైన్ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. రెండో రోజుల్లో ఇద్దరు ఈ వ్యాధి లక్షణాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన తిరుమనాథం వీరవెంకట సత్యనారాయణమ్మ (36) స్వైన్ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్లో బుధవారం మృతి చెందింది. అలాగే బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన బొండా మేరీ (34) అనే ఆమె అక్టోబర్ 30న కాకినాడ జీజీహెచ్లో స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలతో చేరగా, ఆమెకు స్వైన్ఫ్లూ లక్షణాలు కన్పించడంతో బుధవారం రాత్రి టెస్ట్లకు బ్లడ్ శాంపిళ్లు తీసి విశాఖపట్నం పంపారు. ఈలోపే ఆమె గురువారం ఉదయం చనిపోయింది. డాక్టర్లు స్వైన్ఫ్లూ అనే అనుమానమే తప్ప, రిపోర్టు రాలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలతో రాజమహేంద్రవరంలో ఇద్దరు, కాకినాడ రూరల్ మండలంలోని ఒకరు, అల్లవరం మండలం కొమరిగిరిపట్నానికి చెందిన ఒక మహిళ స్వైన్ఫ్లూ బారిన పడి కాస్త కుదుటపడి ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ లక్షణాలు స్పష్టంగా కన్పిస్తున్నా అధికార యంత్రాంగం చీమకుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజమహేంద్రవరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు పరిమితమైన ఈ స్వైన్ఫ్లూ కేసులు నేడు అమలాపురం, బిక్కవోలు, కాకినాడ సిటీ నియోజకవర్గాల పరిధిలో కనిపిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కనీసం స్వైన్ఫ్లూకి సంబంధించి పరీక్ష ల్యాబ్ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలతో స్వైన్ప్లూ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెబుతున్న వైద్యాధికారులు కేసుల వస్తే వారికి కనీసం వెంటిలేటర్లు కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి తోడు ఒక వార్డునే కేటాయించారు. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు కేసులు నమోదయ్యాయి. పేరు వింటేనే హడల్ కొన్ని రోజులుగా చల్లటి వాతావరణం నెలకొనడంతో హెచ్–1ఎన్–1 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. చలితోపాటు గాలులు వీస్తుండడంతో జలుబు, చలి జ్వరం, లక్షణాలతో ఉన్నవారు పెరుగుతున్నారు. వారిలో హెచ్–1ఎన్–1 వైరస్ కారక క్రిములు వృద్ధి చెందుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్ప్లూయంజా ఏ అనే వైరస్ వల్ల వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కేవలం గాలి వాహకంగా వ్యాప్తి చెందే స్వైన్ఫ్లూ జ్వరంలా మొదలై ఊపిరితిత్తుల అంతర భాగంలోకి పాకడం వల్ల అది ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. సకాలంలో మెరుగైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలుంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోయినా ప్రధానంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారినా వెంటనే దగ్గర్లో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా మధుమేహం, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా రోగులు, ఇతరుల కంటే ఈ వైరస్ సోకడానికి దాదాపు 80శాతం అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. బలభద్రపురానికి చెందిన మహిళ మృతి బిక్కవోలు (అనపర్తి): స్వైన్ఫ్లూతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బలభద్రపురం ఎస్సీ పేటకు చెందిన బి.మేరి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. వారం రోజుల పాటు అనపర్తి సీహెచ్సీ, కాకినాడ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న ఆమె బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. ఆమె రక్తం, కళ్లె పరీక్షల నిమిత్తం విశాఖపట్నం పంపించగా గురువారం రిపోర్టులు రావలసి ఉంది. అయితే ఇంతలోనే ఆమె మృతి చెందింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చంద్రకుమారి గురువారం ఎస్సీపేటలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 74 మందిని పరీక్షించగా నలుగురికి జ్వరం సోకినట్టు గుర్తించి వైద్య సహాయం అందజేస్తున్నట్టు తెలిపారు. అయితే పారిశుద్ధ్య లోపంతో పాటు వైద్య ఆరోగ్యశాఖాధికారుల ఉదాసీనత కారణంగానే మేరికి ప్రాణాంతక వ్యాధి సోకి మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాధులు ఉధృతంగా ఉండే ఈ రోజుల్లోనైనా పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖాధికారులు సమన్వయంతో పని చేసి ప్రాణాంతక రోగాల నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు. వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ చంద్రకుమారి ప్రత్యేక వార్డు ఏర్పాటు జనరల్ ఆసుపత్రిలో స్వైన్ఫ్లూ అనుమానితులు, పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశాం. వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాం. జనసంచారం, సమూహం వద్ద మాస్కులు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా చేతిని అడ్డుపెట్టుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. – డాక్టర్ టీఎస్ఆర్ మూర్తి, జిల్లా వైద్యాధికారి -
కర్నూలు జిల్లా ప్రజలను వణికిస్తున్న స్వైన్ఫ్లూ
-
మరో నలుగురికి స్వైన్ఫ్లూ
కర్నూలు (హాస్పిటల్): జిల్లాలో మరో నలుగురికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పాములపాడు మండలం కంబలపల్లికి చెందిన క్రిష్ణమ్మ(38), పగిడ్యాలకు చెందిన శివరాజు(35), కర్నూలు కుమ్మరివీధికి చెందిన హర్షవర్దన్(3), కోడుమూరుకు చెందిన అనూష (28)కు స్వైన్ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మొదటి ముగ్గురు ఊపిరితిత్తుల్లో సమస్యతో ఇటీవల కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేరారు. అనుమానంతో వైద్యులు స్వైన్ఫ్లూ పరీక్ష చేయించారు. వ్యాధి సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయ్యింది. అనూష హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. ఈమెకు కూడా స్వైన్ఫ్లూ ఉన్నట్లు అక్కడి వైద్యులు తేల్చారు. దీంతో బాధితుల సంఖ్య 36కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే స్వైన్ ప్లూ
-
స్వైన్ ఫ్లూ విజృంభణ.. వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గల వైద్య సదుపాయాలు, సౌకర్యాలపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే 12 మంది చనిపోగా, మరికొంతమందికి వ్యాధి నిర్దారణ అయింది. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరా తీశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య పెరుగుతోందని ఎమ్మెల్యే గౌరు చరితా విమర్శించారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు హఫీజ్ ఖాన్, మురళీకృష్ణ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. మందులు, ప్రత్యేక వార్డులు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
ప్రైవేటు ‘పైసా’చికం..
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: స్వైన్ఫ్లూ భయం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పికే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగుల్లో నెలకొన్న భయాన్ని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ‘పైసా’చికంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే ప్లూను నిర్ధారించే అవకాశం ఉన్నా పలు కార్పొరేట్ ఆసుపత్రులు నమూనాలు సేకరిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పేరుతో రోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే చికిత్స పొందే అవకాశం ఉంది. కానీ రోగులను భయాందోళనకు గురి చేసి చికిత్సల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. అమలాపురానికి చెందిన ఓ మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే ఆమెను భర్త, బంధువులు స్థానికంగా చూపించారు. నాలుగు రోజుల తరువాత కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. అనుమానిత స్వైన్ఫ్లూ పేరుతో చికిత్సలు అందించి సుమారు రూ. 2.5 లక్షలకు పైగా బిల్లు వసూలు చేశారు. స్వైన్ఫ్లూ పేరుతో రోగుల నుంచి ఎంతలా డబ్బులు గుంజుతున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అదే విధంగా రాజమహేంద్రవరంలో ఇద్దరు వ్యక్తులకు వ్యాధి సోకడంతో వారి నుంచి కూడా భారీగా సొమ్ములు గుంజినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో స్వైన్ఫ్లూ కోసం ప్రత్యేక వార్డును కేటాయించినా దీనికి రక్షణ లేకపోవడంతో రోగులు, వారితో ఉన్న సహాయకులు సైతం ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ డయాలసిస్ పేరుతో బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగి వచ్చినట్టే వచ్చి కనిపించకుండా పోవడం, ఆ తరువాత అధికారులు వెతికి అల్లవరం మండలం కొమరిగిరిపట్నం కొడప నుంచి తిరిగి కాకినాడ జీజీహెచ్కు తీసుకురావడం తెలిసిందే. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని, ప్లూ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉన్నా జిల్లా వైద్యాధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదు. స్వైన్ఫ్లూ కేసులు జిల్లాలో నమోదు అవుతుండడంతో ఇదే అదనుగా పలు కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి తెర తీస్తున్నాయి. చిన్నపాటి జలుబు, దగ్గు, గొంతునొప్పినే స్వైన్ఫ్లూగా అనుమానించి పరీక్షలు చేసి డబ్బులు గుంజుతున్నారు. ఒక్కసారి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు పరీక్షలకు రూ.పది వేలు వరకు ఖర్చవుతోంది. ఇక స్వైన్ఫ్లూ ఉన్నట్టు తేలితే ఇక రోగులకు చుక్కలే. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన నమూనాలను కాకినాడ జీజీహెచ్లో ఉచితంగా పరిశీలిస్తారు. అదే ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఒక్కోదానికి రూ.3,500 నుంచి రూ.ఐదు వేలు వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. వైద్యపరంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను అనుమానాస్పద స్వైన్ఫ్లూ కేసుగా అడ్మిట్ చేసుకుని వైద్యం ముసుగులో దోచుకుంటున్నారు. కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన ఆమెకు రోజుకు రూ.13వేలు ఫీజు రూపంలో, రూ.12 వేలు మందుల రూపంలో దాదాపు పది రోజుల పాటు వసూలు చేశారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ‘వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా’ సోకడంతో ఆమెను శనివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్లోని ఆర్ఐఎస్యూలో చికిత్స నిమిత్తం తరలించారు. వారి చేతిలో మోసపోవద్దు చాలా ప్రాంతాల్లో ప్రజలకు స్వైన్ఫ్లూపై సరైన అవగాహన లేదు. హైజిన్ లోపం, పిల్లలకు ఇమ్యూనైజేషన్ సరిగా చేయించకపోవడం, గాలి వెలుతురు సోకని గదుల్లో ఎక్కువ మంది నివసిస్తుండడమే ఫ్లూ విస్తరణకు కారణం. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు చూడడానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ తేడా ఉంది. ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే కేవలం క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వ్యాధిని గుర్తించే అవకాశం ఉంది. కానీ కొన్ని ఆసుపత్రులు అవసరం లేకపోయినా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాకినాడ జీజీహెచ్లో ప్రత్యే క వార్డులను ఏర్పాటు చేశాం. ఇక్కడ రోగులకు అన్ని రకాల సేవలు ఉచితంగా అందిస్తుంది. జ్వ రం, జలుబుతో ఆందోళన చెంది ప్రైవేటు ఆసుపత్రుకు పరుగులు తీసి, వారి చేతిలో మోసపోవద్దు. డాక్టర్ రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, స్వైన్ఫ్లూ నోడల్ అధికారి, జీజీహెచ్, కాకినాడ -
వ్యాధుల కలకలంతో కలవరం
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన టి. రాజశేఖర్రెడ్డి(28) స్వైన్ఫ్లూతో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో నవ్యాంధ్ర రాజధాని జిల్లా గుంటూరులో స్వైన్ఫ్లూ కలవరం ప్రారంభమైంది.వ్యాధి పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. తొలుత రాయలసీమ జిల్లాలకే పరిమితమైన కేసులు నేడు రాజధాని జిల్లాలో కూడా నమోదవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ముగ్గురికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు వైద్యాధికారులు నిర్ధారణ చేయగా వారిలో ఒకరు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులకు స్వైన్ఫ్లూ ఉన్నట్లు అనుమానంతో గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో అడ్మిట్ చేసి వైద్య సేవల్ని అందిస్తున్నారు. గుంటూరు మెడికల్: నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు నేడు వ్యాధులకు నిలయంగా మారుతోంది. ఈ ఏడాది మార్చిలో డయేరియా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. సుమారు 2,400 మంది వ్యాధి బారిన పడగా 20 మందికి పైగా మరణించటం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం కలిగించింది. ఆగస్టులో కనీవిని ఎరుగని రీతితో డెంగీ కేసులు నమోదయ్యాయి. సుమారు 100 మంది వరకు వ్యాధి బారిన పడ్డారు. తాజాగా ఈనెలలో ముగ్గురికి స్వైన్ఫ్లూ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారణ చేయడంతో గుంటూరు ప్రజలు భయపడిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాదిరిగా రాజధాని నగరంలో అధిక సంఖ్యలో జ్వరాలు నమోదు అవ్వడంపై సీఎం ఆగస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం బాధితుల వివరాలను అధికారులు బయటకు చెప్పకుండా దాచిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి జిల్లావ్యాప్తంగా మలేరియా 279 కేసులు నమోదు కాగా ఇందులో గుంటూరు పట్టణంలోనే 172 ఉన్నాయి. ఇక డెంగీ బాధితులు జిల్లావ్యాప్తంగా 87 కేసులు నమోదు కాగా గుంటూరు పట్టణంలో 42 ఉన్నాయి. వణికిస్తున్న స్వైన్ఫ్లూ గుంటూరులో 2015లో స్వైన్ఫ్లూ అనుమానిత కేసులుగా 72 మందికి వైద్య పరీక్షలు చేయించగా 38 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. వీరిలో తొమ్మిది మంది చనిపోయారు. 2016లో స్వైన్ఫ్లూ అనుమానిత కేసులుగా 15 మందికి పరీక్షలు చేశారు. 2017లో జిల్లాలో 14 మందికి వ్యాధి సోకగా వారిలో ఆరుగురు వ్యాధి బారిన పడి మృతిచెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు గుంటూరు నగరానికి చెందిన వారే ఉండటంతో ప్రజలు స్వైన్ఫ్లూ పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు గుంటూరు ఏటిఅగ్రహారానికి చెందిన డ్రైవర్గా వైద్యాధికారులు నిర్ధారించారు. ఒకే కుటుంబంలో నలుగురికి డెంగీ లక్షణాలు దుగ్గిరాల: డెంగీ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శుక్రవారం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. స్థానిక జెండాచెట్టు ప్రాంతానికి తూములూరు నాగరాజు, ఈమని రాజ్యలక్ష్మి , ఈమని అభినయ్, ఈమని తనీష్లు దసరా సెలవులు కావడంతో మద్రాసు వెళ్లారు. సెలవులు ముగిసిన తర్వాత తిరిగి వచ్చారు. నలుగురికి జ్వరం రావడంతో తొలుత స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందారు. అభినయ్కి శుక్రవారం జ్వరం అధికం కావడంతో దుగ్గిరాల ప్రాథమి ఆరోగ్యకేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యాధికారి కృష్ణవేణి నాలుగురికి వైద్య పరీక్షలు నిర్వíßహించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి స్వైన్ఫ్లూ వైరస్ను పూర్తిగా నిరోధించే మందులు లేవు. చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం టామిఫ్లూ, రెలెంజా వంటి యాంటీ వైరల్ మందులు వాడుతున్నారు. ఇవి వైరస్ ఉధృతిని మాత్రమే తగ్గించగలవు. ఈ మందులు కూడా వ్యాధి సోకిన తొలిదశలోనే బాగా పనిచేస్తాయి. వ్యాధి సోకకుండా ప్రయాణాలు... ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి. దగ్గినా, తుమ్మినా ముఖానికి కర్చీఫ్ను అడ్డుపెట్టుకోవాలి. మాస్క్లు ధరించటం ఉత్తమం. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు బయటపడితే ఇంటికే పరిమితం అవ్వాలి. ఇతర కుటుంబ సభ్యులకు సోకుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి.– డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరు హోమియోతో డెంగీ, స్వైన్ఫ్లూకి చెక్ గుంటూరు మెడికల్ : హోమియో మందులతో స్వైన్ఫ్లూ, డెంగీ రాకుండా జాగ్రత్తపడొచ్చని ప్రభుత్వ హోమియో వైద్య నిపుణులు వెల్లడించారు. ముందస్తుగా మందులు మింగటం ద్వారా వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఆర్సినికాల్బ్ (30 పవర్) మూడు రోజులు మింగితే స్వైన్ఫ్లూ వ్యాధి సోకదు. ప్రతిరోజూ ఉదయం ఒక్కపూట మాత్రమే మందులు మింగితే సరిపోతుంది. పదేళ్లలోపు పిల్లలకు మూడు మాత్రలు, పదేళ్లు దాటిన వారికి ఐదు మాత్రలు మింగితే చాలు. ఇపటోరియం పర్ఫరేట్ అనే మందు మూడు రోజులపాటు మింగితే డెంగీ దరి చేరదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. గుంటూరు బ్రాడీపేట ఒకలో లైన్లోని ప్రభుత్వ హోమియో వైద్యశాల, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, తాడికొండ, సింగంపాలెం, ఐనవోలు, జిల్లెల్లమూడి, దొండపాడు, పసుమర్రు, ముప్పాళ్ల , మన్నవ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో స్వైన్ఫ్లూ, డెంగీ జ్వరాల నియంత్రణ మాత్రలు అందుబాటులో ఉన్నాయి. -
జిల్లాలో స్వైన్ ఫ్లూ జాడలు!
సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసిన మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. 2017లో జనవరి నుంచి మార్చి నెలాఖరుకు 16 మందికి సోకిన ఈ వ్యాధి తాజాగా ఇద్దరికి విస్తరించింది. వ్యాధి బారినపడిన వీరు విజయవాడ, నెల్లూరులో చికిత్స పొందుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే వ్యాధి తీవ్రత పెరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు బాధితులు జిల్లాకు చెందిన ఇద్దరికి ఇప్పటికే వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కైకలూరుకు నియోజకవర్గం పాతవరపాడు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి నెల్లూరులోని క్యాన్సర్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లగా.. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన సాంబశివరావుకు తలనొప్పి, జ్వరం సోకడంతో వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా.. స్వైన్ ఫ్లూ వ్యాపించడంతో పోరంకిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఏడాది అనంతరం పంజా ♦ జిల్లాలో స్వైన్ ఫ్లూ ఏడాది అనంతరం మళ్లీ పంజా విసురుతోంది. గతేడాది మూడు మాసాల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గతంలో స్వైన్ ఫ్లూ కేసులను బహిర్గం చేయడంలో వైద్యాధికారులు గోప్యత పాటించినట్లు తెలిసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సోకిన రెండు రోజుల వ్యవధిలోనే రెండు కేసులు నమోదయ్యాయి. జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలైంది. లక్షణాలు ఇవీ... ♦ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి చీదినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా(గాలి ద్వారా) ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపిస్తుంది. ♦ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులకు త్వరగా వ్యాపిస్తుంది. ♦ అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం, పెదాలు నీలి రంగులోకి మారడం, కఫం ద్వారా రక్తం పడటం లాంటి లక్షణాలు ఉంటాయి. ♦ దగ్గు, గొంతు తడారిపోవడం, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, వణుకుట తదితర లక్షణాలు ఉంటాయి. జాగ్రత్తలు ఇలా.. ♦ దగ్గినా, చీదినా ముక్కుకు అడ్డంగా గుడ్డ పెట్టుకోవాలి. ♦ చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ♦ ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా సంచరించకూడదు. ♦ నీళ్లు బాగా తాగాలి. మంచి పోషాకాహారాన్ని తీసుకోవాలి. ఏం చేయకూడదంటే.. ♦ ఎవరినైనా కలిసినప్పుడు కరచాలనం, కౌగిలించుకోవడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ♦ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు. ♦ వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే మందులు వాడాలి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం స్వైన్ ఫ్లూ నుంచి ప్రజలను రక్షించేందుకు అవరసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని పీహెచ్సీల వైద్య సిబ్బందని అప్రమత్తం చేశాం. వ్యాధి ఎలా వ్యాపిస్తుందన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్ పోస్టర్లు, వైద్య సిబ్బంది సైతం గ్రామాలకు వెళ్లి వివరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. –ఎ.నాగేశ్వరరావు,అంటువ్యాధుల వైద్య నిపుణులు -
బొబ్బిలిలో స్వైన్ఫ్లూ కలకలం!
విజయనగరం, బొబ్బిలి: జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు, పాలిథిన్ కవర్ల నిషేధం, వాటర్ ప్యాకెట్ల అమ్మకాల నిషేధం వంటి అంశాల్లో ఎన్నో అవార్డులు సాధించిన బొబ్బిలిలో స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. ఇటీవలే డెంగీ వ్యాధి సోకి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో మహిళకు ప్రమాదకర స్వైన్ఫ్లూ సోకడంతో పట్టణవా సుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలోని పారిశుద్ధ్యం ఏస్థాయిలో ఉందో ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఆరో వార్డు అగురువీధిలో నివాసముంటున్న ఓ మహిళ(38) గత పదిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సనిమిత్తం చేర్పించినాఎప్పటికీ తగ్గకపోవడం... రక్తంలోని ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గిపోవడంతో చికిత్స చేస్తున్న వైద్యుడు జి.శశిభూషణ రావు సూచన మేరకు విశాఖలోని గురుద్వార సమీపంలో ఉన్న వెంకటేశ్వర మెడికల్స్లో చేర్చారు. అక్కడి డాక్టర్లు పరీక్షిం చి ఆమెకు స్వైన్ ఫ్లూ అనుమానంతో టీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు స్వైన్ఫ్లూ ఉందని నిర్థారించారు. పేదకుటుంబానికి పెద్ద దెబ్బ బాధిత కుటుంబం అసలే పేదరికంలో ఉంది. ఆమె భర్త టైలర్ వృత్తితో కుటుం బాన్ని పోషిం చుకుంటున్నారు.అయినా నానా అవస్థలు పడు తూ ప్రస్తుతం చికిత్స చేయిస్తున్నా రు. వారు ని వాసం ఉంటున్న బొబ్బిలి వీధిలో కాలువలు ముగుతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా వాటికి సమాంతరంగా కా లు వలు నిర్మించకుండా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీని వల్ల కాలువల్లో పురుగులు, దోమలు పెరిగి వ్యాధులకు కారణాలవుతున్నాయని స్థానికులుఆవేదన చెందుతున్నారు. అపారిశుద్ధ్యమే అసలు సమస్య స్వైన్ఫ్లూ సోకిన మహిళ ఇంటివద్ద ఘోరమైన దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ వ్యాధులన్నీ సోకుతున్నాయని, నిరుపేదలు వేలల్లో ఖర్చు చేసుకుని వైద్య చికిత్సలు ఎలా పొందగలరని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో మార్లు మున్సిపల్ కమిషర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. అవార్డులను అందుకునేందుకు ముందుకు వెళ్లే మున్సిపల్ యంత్రాంగం ప్ర జల బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు. ఫాగింగ్ కానీ, కాలువల్లో మురుగు తొలగింపు కానీ చేపట్టడం లేదన్నారు. విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో మన జిల్లాకు చెందిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని శంకరరావు తెలిపా రు. జిల్లాలో ఇప్పటివరకూ ముగ్గురికి స్వైన్ఫ్లూ సోకిందని దీనిపై ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన కోరారు.