నీళ్లివ్వకపోతే ఆత్మహత్యలే | Farmers Protest For Water In Kurnool | Sakshi
Sakshi News home page

నీళ్లివ్వకపోతే ఆత్మహత్యలే

Sep 8 2018 2:06 PM | Updated on Jun 4 2019 5:16 PM

Farmers Protest For Water In Kurnool - Sakshi

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

‘మా పొలాల వెంటే తెలుగుగంగ కాలువలో నీరు వెళుతోంది. కానీ ఏం ప్రయోజనం? మా పొలాలకు నీటిని వదలడం లేదు. వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నాం. తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా నీరు వదలాలి. లేకపోతే కార్యాలయం వద్దే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామ’నిశిరివెళ్ల మండల రైతులు నంద్యాలపట్టణంలోని తెలుగుగంగ కార్యాలయం వద్ద శుక్రవారం అందోళన చేపట్టారు.

 కర్నూలు, నంద్యాల: శిరివెళ్ల మండలం గోవిందపల్లె వద్ద తెలుగుగంగ కాలువ 13వబ్లాక్‌ కింద తొమ్మిది వేల ఎకరాల సాగుభూమి ఉంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి వదిలిన నీటితో తెలుగుగంగ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా ఈ సాగుభూమికి చుక్కనీరు వదలడం లేదు. పైగా ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు లేక రైతులు, ప్రజలు తాగు, సాగునీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు గంగ కాలువలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నా.. పొలాలకు ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం పురుగు మందు డబ్బాలతో  తెలుగుగంగ కార్యాలయానికి చేరుకున్నారు. తమ గ్రామ పొలాలకు నీరివ్వాలని డిమాండ్‌ చేశారు. పొలాలు ఎత్తులో ఉన్నందున నీళ్లురావడం కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. కాలువలో నీళ్లు తక్కువగా ఉంటే మీరు చెప్పిన మాటలు నమ్ముతామని, ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్నందున నీరు వదలాల్సిందేనని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటూ వెంటతెచ్చుకున్న పురుగుల మందుల డబ్బాలను పైకెత్తారు. తెలుగుగంగ ఈఈ పురుషోత్తంరెడ్డి స్పందిస్తూ ఈ రాత్రికే బ్లాక్‌ కాలువను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చినా వారు వినలేదు. వరిపైరు ఎండుతోందని, తక్షణమే నీరివ్వాలని పట్టుబట్టారు. చివరకు పొలాలకు నీరందించే బాధ్యత తాను తీసుకుంటానని ఈఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement