
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వేడిగాలులు, ఉక్కపోత కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. పలు చోట్ల నిప్పుల వానలా ఎండ కాస్తుందని తెలిపింది. రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వివరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావొ ద్దని అధికారులు సూచిస్తున్నారు.
అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఇలా ఉండగా ఉపరితల ద్రోణి,ఆవర్తనం కారణంగా మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.