
అండగా ఉంటా.. ఆందోళన వద్దు..
- ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
పామిడి: ‘మీకు అండగా నేనుంటాను. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి. లేదంటే కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మీరెవ్వరూ ఆందోళన పడవద్దు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఆయన అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లిలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇగ్గుడ వన్నూరప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వన్నూరప్ప భార్య లక్ష్మీదేవితో జరిపిన సంభాషణ ఇలా...
జగన్: ఎందుకమ్మా.. మీ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు?
అప్పులు ఎంతయ్యాయి తల్లీ?
లక్ష్మీదేవి: వర్షాలు కురవక పంట మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. దీంతో అప్పులపాలయ్యాం. అప్పులు ఎలా తీర్చాలో తెలియని నా భర్త వన్నూరప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం రూ.3 లక్షల 9 వేల అప్పు ఉంది. అందులో ఎద్దులపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.9 వేల క్రాప్లోన్తో పాటు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.3 లక్షల అప్పు ఉంది సార్.
జగన్: ప్రభుత్వ సాయం అందిందామ్మా? వితంతు పింఛన్ అయినా ఇచ్చారా?
లక్ష్మీదేవి: ప్రభుత్వ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు, ఫించన్ ఇవ్వలేదు సార్
అనంతరం జగన్ వన్నూరప్ప కుమారుడు ఎర్రిస్వామి, కుమార్తె పావనిలతో మాట్లాడి చక్కగా చదువుకోవాలని సూచించారు. లక్ష్మీదేవి తన ఆర్ధిక స్థితి సహకరించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా అక్కడ చేరిన డ్వాక్రా మహిళలతో వైఎస్ జగన్.. మాట్లాడారు. అక్కడే ఉన్న కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..కేన్సర్ చికిత్స కోసం రూ.6 లక్షల దాకా అప్పు చేశానని తనను ఆదుకోవాలని జగన్కు విన్నవించింది. జగన్ స్పందిస్తూ వన్నూరప్ప పిల్లల పై చదువులకు, కేన్సర్ బాధితురాలు భాగ్యలక్ష్మినీ ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వెంకట్రామిరెడ్డికి సూచించారు.