జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.
కడప అర్బన్, న్యూస్లైన్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ మనీష్కుమార్ సిన్హా తన బాధ్యతలను అశోక్కుమార్కు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడారు.
తొలుత జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తాను ఎస్పీగా మొదట కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల సంక్షేమానికి ఎస్పీ మనీశ్కుమార్ సిన్హా తీసుకున్న చర్యలను కొనసాగిస్తానని చెప్పారు. కానిస్టేబుల్ స్థాయినుంచి అధికారి స్థాయి వరకు అహర్నిశలు పనిచేస్తూ తమ ఆరోగ్యాన్ని సక్రమంగా పట్టించుకునే పరిస్థితుల్లో ఉండరన్నారు. అందువల్ల పోలీసు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో ఎస్పీతోపాటు ఓఎస్డీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ అశోక్ ప్రస్థానం :
సివిల్ ఇంజినీరుగా కోర్సు పూర్తి చేశాక స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో పీజీ చేశారు. 1996లో డీఎస్పీగా పోలీసు శాఖలో అడుగు పెట్టారు. తొలుత నల్గొండలో శిక్షణ పూర్తి చేసుకుని అనంతపురంలో డీఎస్పీగా నాలుగేళ్లపాటు విధులు నిర్వహించారు. అనంతరం అక్కడే ఇన్చార్జ్ ఏఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓఎస్టీగా పనిచేశారు. తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్సీ విభాగంలో ఏఎస్పీగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు సూడాన్లో ఏడాది పాటు పనిచేశారు. తర్వాత హైదరాబాదులో ట్రాఫిక్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఐపీఎస్ హోదా వచ్చింది. తిరుమల-తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఏడాదిన్నరపాటు విధులు నిర్వహించారు. తర్వాత జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు.