
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సాగునీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విభజన చట్టం ప్రకారం నదీ జలాల నిర్వహణ బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టును చేపట్టినా వీటి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి నిర్ధిష్ట కేటాయింపులు జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకోసం ఇప్పటికే శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రస్తుత ఆయకట్టుకు కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో ఎట్టి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకోవాలని ఉమాభారతిని కోరారు.