
అధికార పార్టీ
♦ గుర్రప్పడియలో గెలుపే లక్ష్యం
♦ పోలీసులను అడ్డుపెట్టి దౌర్జన్యం
♦ సర్పంచ్ అభ్యర్థితో పాటు ఓటర్లను భయపెడుతున్న వైనం
♦ సోదాల పేరుతో ఇళ్లపై దాడులు
♦ గుర్రప్పడియ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకే
♦ అధికార పార్టీ అడ్డదారులు
♦ సజావుగా ఎన్నికకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేనా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి మండలం గుర్రప్పడియ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ నానా రకాల అడ్డదారులు తొక్కుతోంది. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి దత్తత గ్రామం కావడంతో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ అరాచకానికి తెర తీసింది. పోలీసులను అడ్డుపెట్టి పోటీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులతో పాటు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు కూడా అనుమతించటం లేదు.
పైగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. సోదాల పేరుతో దౌర్జన్యానికి దిగి అరాచకం సృష్టిస్తున్నారు. గుర్రప్పడియ గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన బీసీ మహిâ¶ళ బాపట్ల కొండమ్మ 11 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. తరువాత ఆమె మృతి చెందారు. ఉపసర్పంచ్ ఇన్చార్జి సర్పంచ్గా ఇప్పటి వరకు కొనసాగారు.
అయితే గుర్రప్పడియ సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు గురువారం సర్పంచ్ ఎన్నికకు పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. కాగా టీడీపీ మద్దతుదారుగా బీసీ వర్గానికి చెందిన మాదాల శాయమ్మ, వైఎస్సార్సీపీ మద్దతుదారుగా అదే వర్గానికి చెందిన బాపట్ల లక్ష్మమ్మ పోటీలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయంపై ధీమాతో ఉండగా ఎన్నికలు ఎలాగైనా నెగ్గేందుకు అధికార పార్టీ సామదానభేదదండోపాయలు ప్రయోగిస్తోంది. గుర్రప్పడియ కొండపి ఎమ్మెల్యే స్వామి దత్తత గ్రామం కావడంతో ఎమ్మెల్యే ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
దీంతో పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారు. ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తమకు ఓట్లేయకపోతే పింఛన్లు, రేషన్కార్డులు తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు. పక్కా గృహాలు రాకుండా చేస్తామని, ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామంటూ మరింతగా బెదిరింపులకు గురి చేశారు. ఇక పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులు ప్రచారం చేసుకోకుండా అడ్డుకున్నారు. నలుగురు కనిపిస్తే చాలు పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారు. అసలు ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధిస్తున్నారు.
పోలింగ్ను ఏకపక్షంగా నిర్వహించుకోవడంతో పాటు అవసరమనుకుంటే తమ అభ్యర్థిని దౌర్జన్యకరంగానైనా గెలిచినట్లు డిక్లేర్ చేసేందుకు కూడా అధికార పార్టీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో గురువారం జరిగే పోలింగ్, కౌంటింగ్లను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థితో పాటు ఓటర్లకు రక్షణ కల్పించాలని పంచాయతీకి చెందిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, ఓటర్లు కోరుతున్నారు. గురువారం జరిగే పోలింగ్లో అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే !