భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు | police complaint on husband harassment | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు

Published Mon, Dec 16 2013 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

police complaint on husband harassment

మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్:  దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ తల్లి కట్టెలమ్మి చదివించింది. బీఈడీ వరకు చదివిన ఆ యువతి గ్రామానికి చెందిన ఓ అగ్రవర్ణానికి చెందిన యువకుడి ప్రేమలో పడింది. బాగా చూసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకుని బిడ్డను కన్న తర్వాత అతనికి కులం అడ్డొచ్చింది. భార్యాబిడ్డను అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఊరువదిలి వెళ్లిపోతున్న భార్య, అత్తను అంతమొందించేందుకు యత్నించాడు. బాధితులు ఆదివారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. వాల్మీకిపురం మండలం పత్తేపురానికి చెందిన అలివేలమ్మ కుమార్తె విజయలక్ష్మి(23). బీఈడీ వరకు చదివింది.

ఏడాదిన్నర క్రితం గ్రామానికి చెందిన అమరనాథ్‌రెడ్డి ప్రేమిస్తున్నానని వెంటపడడంతో అతన్ని నమ్మి ప్రేమవివాహం చేసుకుంది. ఇద్దరూ హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడ్డారు. పెళ్లి అయిన అయిదు నెలలకు విజయలక్ష్మి గర్భవతి అయింది. అదే సమయంలో భర్త అమరనాథ్‌రెడ్డి తన పది ఎకరాల ఆస్తికి తల్లీ,బిడ్డ అడ్డొస్తారని భావించాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించాడు. తలచిందే తడువుగా ఆమెను హైదరాబాద్‌లోనే వదిలి స్వగ్రామానికి వచ్చేశాడు. బాధితురాలు మోసపోయానని భావించి పుట్టింటికి చేరింది. గ్రామంలో ఉన్న భర్తను నిలదీసింది. అతను చేరదీయకపోవడంతో ఎస్పీకి మొరపెట్టుకుంది. పోలీసుల జోక్యంతో ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. మదనపల్లెలోని బాలాజీనగర్‌లో కాపురం పెట్టారు. వీరికి కుమారుడు అజిత్‌రెడ్డి ఉన్నాడు. బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ అతని ఆందోళన పెరిగింది.

 తల్లీబిడ్డను  వదిలించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. తరచూ కొట్టడం, ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటూ వేధింపులకు గురిచేయడం తీవ్రతరం చేశాడు. రెండు రోజుల క్రితం భార్యాబిడ్డపై హత్యాయత్నానికి యత్నించాడు. భర్త వికృతచేష్టలు చూసి ఏ క్షణంలో ఏమిచేస్తాడోనని భయపడిన విజయలక్షి బిడ్డను తీసుకుని తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుంది. బతకాలంటే ఈ ఊరు వదిలివెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. తల్లి అలివేలమ్మ(45) బాలాజీనగర్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లి ఇంట్లోని బట్టలు, కొన్ని పాత్రలను మూటగట్టుకుంటుని బయల్దేరేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అమరనాథ్‌రెడ్డి అత్తపై దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగాడు. గాయపడిన బాధితురాలిని స్థాని కులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లిని చూసిన విజయలక్ష్మి ఆవేదనకు లోనైంది. భర్త వేధింపులపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement