భీమవరం : సైకో సూదిగాడి పీడ వదల్లేదు. తరచూ ఏదోమూల ఇంజెక్షన్ దాడులు జరిగాయంటూ కలకలం రేగుతూనే ఉంది. ఆగంతకుణ్ణి పట్టుకునేందుకు ఊరూవాడా జల్లెడ పడుతున్నామని.. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పోలీసు అధికారులు ప్రకటిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేయిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతుండటంతోపాటు ఒకదాని వెనుక ఒకటిగా సైకో ఊహాచిత్రాలు.. వివిధచోట్ల సీసీ టీవీల్లో రికార్డైన పుటేజీలు విడుదల చేస్తున్నారు. మొదటి రోజుల్లో నమోదైనవి మాత్రమే సూదిగాడి ఇంజెక్షన్ దాడులని..
ఆ తరువాత జరిగినవన్నీ వదంతులతో కూడిన ఉత్తుత్తి దాడులేనని చెప్పుకొస్తున్నారు. ఇంజెక్షన్ దాడుల కవరేజీ విషయంలో మీడియా సంయమనం పాటించాలని.. ఇలాంటి ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించవద్దని ప్రకటనలు సైతం జారీ చేస్తున్నారు. ఏదిఏమైనా సూదిగాడిని పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం యావత్తు కదన రంగంలోకి దూకింది. అయినా ఆగంతకుడి ఆచూకీని పసిగట్టలేకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతోపాటు ఎక్కడికక్కడ తనిఖీలు.. ఉన్నతాధికారుల సమీక్షలు చేస్తున్నా ప్రయోజనం లేకపోవడం పోలీస్ శాఖకు సవాల్గా మారింది.
సైకో నీడ.. వదలని పీడ
Published Sun, Sep 13 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement
Advertisement