
రేషన్ దుకాణంలో పెట్టిన ఈ–కేవైసీ నోటీసు బోర్డు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత పారదర్శంగా అసలైన అర్హులకు అందివ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా తెల్ల రేషన్ కార్డు దారులంతా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. అంటే కుటుంబంలోని సభ్యులంతా తమ ఆధార్ను రేషన్ కార్డుకు లింక్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది.
సాక్షి, విజయవాడ: తెల్ల రేషన్ కార్డుదారులంతా తప్పని సరిగా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్(ఈ–కేవైసీ).. అంటే కార్డుదారులు తమ ఆధార్ కార్డును తెల్లకార్డుతో అనుసంధానం చేయడం. అయితే కేవలం కు టుంబంలో ఒక్కరు కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది వెళ్లి తమ వేలిముద్రలు వేసి ఆధార్ నంబర్ను తెల్లకార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో 12.40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు సుమారు 9 లక్షల కార్డులకు చెందిన వారు ఈ–కేవైసీనీ చేయించుకున్నారు. అయితే మరో మూడు లక్షల కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. దీని కోసం ముందుగా ప్రజాసాధికారిక సర్వే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 9వ తేదితో ఈ–కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు నిర్ణయించింది. దీనికితోడు రేషన్ దుకాణదారుడే తమ వద్దకు వచ్చే కార్డుదారులకు ఈ–కేవైసీ చేయాలని నిబంధన పౌరసరఫరాల అధికారులు విధించారు. దీంతో డీలర్లు జోరుగా ఈ–కేవైసీలు చేయిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల లబ్ధి ఇలా..
ప్రస్తుతం తెల్లకార్డు ఉంటేనే రాష్ట్రంలో పేదలుగా గుర్తింపు పొందుతారు. ప్రభుత్వ పథకాలు వల్ల ఏదైనా లబ్ధిపొందాలంటే తప్పని సరిగా తెల్లకార్డు అవసరం. అయితే ఈ–కేవైసీ చేయించుకోని కార్డులను నాలుగైదు నెలలు వరకు గడువు ఇచ్చి ఆ కార్డుదారులు ఎక్కడ ఉన్నారా? అని అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అందువల్ల తెల్లకార్డుదారులంతా త్వరగా ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అమ్మఒడి, సన్నబియ్యం, ఉచిత గృహాలు, పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వల్ల లబ్ధిచేకూరాలంటే ఈ–కేవైసీ తప్పని సరిగా ఉండాలి.
అనర్హులు, బోగస్కార్డుల ఏరివేత
ఈ–కేవైసీ ప్రక్రియ ద్వారా అనర్హులు, బోగస్ కార్డులు బయటపడే అవకాశం ఉంది. అనేక మందికి రెండు చోట్ల తెల్లకార్డులు ఉన్నాయి. అలాగే ప్రభుత్యోద్యోగులకు తెల్లకార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది చనిపోయినా వారి పేరుతో కుటుంబ సభ్యులు రేషన్ పొందుతున్నారు. ఇక లబ్ధిదారులు స్థానికంగా ఉండకపోయినా ఉన్నట్లు చూపించుకుని ఫలాలు పొందుతున్నారు. ఇటువంటి వారంతా ఈ–కేవైసీ అనుసంధానం ద్వారా బయటపడతారని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల నిజమైన అర్హులకే ప్రభుత్వ పథకాల అందుతాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment