
'సీఎం అబ్బా అనడం ఖాయం'
రైతులు, మహిళలు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
కర్నూలు: రైతులు, మహిళలు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. మయసభ తరహాలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నైజం అందరికీ తెలుసునని, నంద్యాల దెబ్బకు ఆయన అబ్బా అనడం ఖాయమన్నారు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో మాదిరిగా నంద్యాలలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ప్రలోభాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు రాగానే చంద్రబాబుకు నంద్యాల గుర్తొచ్చిందని, ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్యే అంజాద్ బాషా అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా వైఎస్సార్ సీపీతోనే ఉన్నారని చెప్పారు. నిరుపేదలకు మేలు చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే చెందుతుందని అన్నారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబు ఎవ్వరికీ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు.