రియల్ దందాపై స్పందించిన యంత్రాంగం | RDO examining the Some occupied lands in bhadrachalam | Sakshi
Sakshi News home page

రియల్ దందాపై స్పందించిన యంత్రాంగం

Published Sun, Dec 22 2013 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

RDO examining the Some occupied lands in bhadrachalam

భద్రాచలం, న్యూస్‌లై న్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  భద్రాచలం ఆర్‌డీఓ కాసా వెంకటేశ్వర్లు హెచ్చరిం చారు. గిరిజన చట్టాలను కాలరాస్తూ భద్రాచలంలో సాగుతున్న ‘రియల్ దందా’ పై సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆర్‌డీఓ స్పందించారు. స్థానిక రెవెన్యూ, ఇతర సిబ్బందితో కలసి భద్రాచలం పట్టణంతో పాటు, ఎటపాక, గుండాల కాలనీల్లో పర్యటించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అదే విధంగా 1/70 చట్టానికి విరుద్దంగా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై స్వయంగా  ఆరా తీశారు. గుండాల కాలనీలో కొంతమంది ప్లాట్లను చేసి విక్రయిస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న భూమిని పరిశీలించారు.
 
 దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు తనకు అందజేయాలని తహశీల్‌దార్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఎటపాక సమీపంలోని ఆక్రమిత భూములను కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న పదిఎకరాల తొమ్మిది సెంట్ల భూమిలో 5 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా ఉన్నందున దీనిపై సమగ్రంగా సర్వే జరిపి ప్రభుత్వ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఆదేశించారు. అలాగే చర్ల రోడ్‌లో పాలకేంద్రం వద్ద ఆక్రమిత భూములను కూడా పరిశీలించారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో సర్వేచేసి నివేదిక అందజేయాలని తహశీల్‌దార్ కనకదుర్గకు సూచించారు. భద్రాచలం డివిజన్‌లో ఎన్‌వోసీ లేకుండా కొత్తగా నిర్మాణాలు చేపట్టరాదని, అటువంటి వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతి లేని భూముల్లో నిర్మాణాలు చేపడితే ఎల్‌టీఆర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిరిజనేతరుల మధ్య ఎటువంటి భూ క్రయ విక్రయాలు జరగడానికి వీల్లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌డీఓ వెంట పర్యటనలో తహశీల్‌దార్ కనకదుర్గ, ఆర్‌ఐ మోహన్‌రావు, వీఆర్‌వోలు లక్ష్మణ్‌రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
 రియల్ దందాపై సర్వత్రా చర్చ :
 భద్రాచలంలో సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రభుత్వ భూ ఆక్రమణలను తేటతెల్లం చేస్తూ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘రియల్ దందా’ కథనంపై శనివారం పట్టణంలో సర్వత్రా చర్చసాగింది. దీనిపై భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి కూడా స్పందించి రియల్ దందాతో తనకెటువ ంటి సంబంధం లేదని విలేకరుల సమావేశంలో వెల్లడించటం గమనార్హం.  భూ ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సాక్షి కథనం ఎంతో ఉపయోగరంగా ఉందని గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సోందివీరయ్య  ‘న్యూస్‌లైన్’తో అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement