ఎరువు ధర  తగ్గిందోచ్‌! | Reduced Fertilizer Prices | Sakshi
Sakshi News home page

ఎరువు ధర  తగ్గిందోచ్‌!

Aug 21 2019 10:05 AM | Updated on Aug 21 2019 10:06 AM

Reduced Fertilizer Prices - Sakshi

ఎట్టకేలకు ఎరువుల ధరలు తగ్గాయి. రైతుకు పెద్ద భారం తగ్గింది. ఏటా  పెరుగుతున్న ధరలతో రైతు దిగాలుపడినా... తప్పనిసరి పరిస్థితుల్లో భారం భరించేవాడు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. రైతు మోములో  చిరునవ్వు కనిపించింది.

బొండపల్లి(గజపతినగరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆసరాగా నిలవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం పెరిగిన ఎరువుల ధరలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులకు వ్యవసాయం పెనుభారంగా పరిణమించిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పాలకులు ఎరువుల ధరలను భారీగా పెంచడంతో రైతులపై పెనుభారం పడింది. కేవలం రూ. 950లున్న డీఏపీ బస్తా ధర గడచిన ఐదేళ్లలో రూ. 1430ల వరకు పెరిగింది. అంతే గాకుం డా అన్ని రకాల ఎరువుల ధరలు గత ఐదేళ్లలో రూ. 200 లు నుంచి రూ. 400 ల వరకు పెరి గింది. ఈ తరుణంలో రైతులపై పడిన భారాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సముచితమని రైతాం గం అభిప్రాయపడుతోంది. తగ్గించిన ధరలు ఈ నెల మొదటివారంనుంచి అమలులోకి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డీలర్లు, సహకార సంఘాల వద్ద ఇప్పటికే నిల్వ ఉన్న సరకు తాజాగా నిర్థారించిన ధరలకే విక్రయిం చాలని ప్రభుత్వం అందరు డీలర్లు,  సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. అలా కాదని పాత ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

రైతులకు ఉపశమనం..
ఎరువుల ధరలు తగ్గించడం వల్ల రైతులపై భా రం తగ్గనుంది. ప్రతి బస్తా పైనా రెండు నెలల క్రితం రూ. 125 ల నుంచి రూ. 150ల వరకు కంపెనీని బట్టి ధరలు పెంచగా, ప్రభుత్వం దా నిని సవరిస్తూ ఒక్కో బస్తాపై రూ. 50ల వరకు తగ్గించింది. డీఏపీతోపాటు కొన్ని రకాల కాంపె ్లక్స్‌ ఎరువుల ధరలు తగ్గించడంతో రైతులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు దొరకనుంది. 

రైతుకు ఆసరా.. 
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎరువుల ధరలు తగ్గడం వల్ల రైతులకు కొంత వరకు ఆసరాగా ఉంటుంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం భారంగా మారింది. ఈ తరుణంలో ధరలు తగ్గిస్తూ మంచి నిర్ణయం తీసుకోవడం ముదావహం.
– గెద్ద సత్యనారాయణ రైతు, బొండపల్లి 

కొత్త ధరలకే విక్రయించాలి..
ప్రభుత్వం డీఏపీ, పొటాష్‌తో సహా కొన్ని రకాలైన ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఒక్కో బస్తాపై రూ. 50లు తగ్గించింది. డీలర్లు, సహకార సంఘాల్లో ఎరువులు విక్రయించేవారు కొత్త ధరలకే ఎరువులు విక్రయించాలి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
– కె,మహరాజన్, ఏడీఏ, గజపతినగరం

రైతులకు కొంతవరకు మేలు..
ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత వరకు రైతులకు ఉపశమనం కలగనుంది. ఇప్పటిప్పుడే మండలం లో కురుస్తున్న వర్షాలకు నాట్లు పడుతున్నా యి. ఇప్పుడు డీఏపీ, పొటాష్‌ వంటి ఎరువుల అవసరం ఉంటుంది. ధరలు తగ్గడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది తొలగనుంది.
– కర్రోతు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, వేండ్రాం, బొండపల్లి మండలం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement