రండి.. ఇసుక మేటలు చూపిస్తా | Sand dunes in the crop fields | Sakshi
Sakshi News home page

రండి.. ఇసుక మేటలు చూపిస్తా

Published Tue, Dec 23 2014 3:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

రండి.. ఇసుక మేటలు చూపిస్తా - Sakshi

రండి.. ఇసుక మేటలు చూపిస్తా

ఎల్.ఎన్.పేట: జిల్లాల్లో వంశధార, నాగావళి నదుల వరద వల్ల ఏటా పంట భూముల్లో ఇసుక మేటలు వేస్తున్నాయని, దీని వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతోందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. బాధిత రైతులను ఆదుకోవడంతో పాటు పొలాల్లో మేటలు వేసిన ఇసుకను రైతులే అమ్ముకునే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. వంశధార, నాగావళి నదులకు వచ్చిన వరదలు వల్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అని ఎమ్మెల్యే కలమట వ్యవసాయాశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.
 
 మంత్రి పత్తిపాటి  స్పందిస్తూ పొలాల్లో ఇసుకమేటలే లేవంటూ సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానంపై ఎమ్మెల్యే కలమట మాట్లాడుతూ జిల్లాలోని పొలాల్లో ఇసుక మేటలు ఉన్నాయని, మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీని నాతో పంపిస్తే పొలాల్లోని ఇసుక మేటలను చూపిస్తానని, లేకుంటే సభలో క్షమాపణలు చెబుతానని సవాల్ చేశారు. అధికారులు ప్రభుత్వాన్ని, మంత్రులను తప్పుదారి పట్టించి తప్పుడు నివేదికలు ఇస్తున్నారనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇసుక మేటలు చూపిస్తే బాధిత అధికారులపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో వరదలు కారణంగా నాగావళి, వంశధార నదుల తీరలో ఉన్న 825 హెక్టారుల్లో ఇసుక మేటలు వేశాయన్నారు. పొలాల్లోని ఇసుకను తొలగించేందుకు హెక్టారుకు రూ.8,600 ఇవ్వాలని జీవో విడుదల చేశామన్నారు. పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను అమ్ముకుంటామని రైతులు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఇస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement