
సాక్షి, గుంటూరు: ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. 85 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన బస్సు వంతెన పైనుంచి కాల్వలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన చిన్నారులను స్థానిక ఆసపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
తమ పిల్లలు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన పిల్లలను తరలించిన ఆస్పత్రికి చేరుకొని.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అంతకుముందు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడ్డవారికి తనవంతు సాయం అందించారు. ఆస్పత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. బస్సు కండీషన్, డ్రైవర్ తీరుపై స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.