సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తరగతులు సరిగ్గా జరక్క విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే విద్యాసంస్థలు మా త్రం అవేమీ పట్టించుకోవడం లేదు.
=విద్యార్థుల నుంచి ఎక్కువ మొత్తంలో పది పరీక్షల ఫీజు వసూలు
= ప్రైవేటులోనే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అదే తీరు
=అధికారులకు ఫిర్యాదుల వెల్లువ
చిత్తూరు(టౌన్), న్యూస్లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తరగతులు సరిగ్గా జరక్క విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే విద్యాసంస్థలు మా త్రం అవేమీ పట్టించుకోవడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి అధిక మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. 2014 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ ప రీక్షలు రాసేందుకు రెగ్యులర్ విద్యార్థులకు రూ.125 ఫీజుగా నిర్ణయించారు.
అయితే జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి నాలుగైదు ఇంతలు ఎక్కువగా వసూలు చేస్తూ జేబులు నింపుకునే పనిలో పడ్డారు. రెం డ్రోజుల క్రితం జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబర్లు ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. 50కు పైగా పాఠశాలల్లో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు అధికారులకు మేసేజ్లు వచ్చాయి. అధిక మొత్తంలో వసూలు చేసిన వాటిలో ప్రభుత్వ పాఠశాలలూ ఉండడం గమనార్హం.
రూ.వెయ్యి వరకూ వసూలు
పదో తరగతి ఫీజు 125 రూపాయలే. కొన్ని వి ద్యాసంస్థలు విద్యార్థుల నుంచి రూ.500, రూ. 600 వరకు వసూలు చేసినట్టు తల్లిదండ్రులు మేసేజ్ల ద్వారా ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. నాలుగైదు పాఠశాలల్లో అయితే వెయ్యి వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులందాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారో అని సదరు యా జమాన్యాన్ని అడుగుదామంటే, పరీక్షల సమయంలో హాల్టిక్కెట్ ఇవ్వరేమోననే భయంతో ఇవ్వాల్సి వచ్చిందని ఓ విద్యార్థి తండ్రి అధికారులతో వాపోయాడు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకసారి ఫెయిల్ అయి, పరీక్షలు రాసే విద్యార్థుల నుంచి వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులు డీఈవో ప్రతాప్ రెడ్డి దృష్టికి వెళ్లాయి.
అధికారులకు ఇవ్వాలి ..
‘ఎక్కువ డబ్బులు తీసుకుంటోంది మా కోసం కాదు.. పరీక్షలు నిర్వహించే అధికారుల కోసం’ అంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లి దండ్రులను బోల్తాకొట్టిస్తున్నాయి. పరీక్షల సిబ్బంది నుంచి ఐసీఆర్ (ఇంటెలిజెంట్ క్యారక్టర్ రికగ్నేషన్) ఫారాలు తీసుకునేటప్పు డు, తర్వాత వారికి నామినల్ రోల్స్ సమర్పించేటప్పుడు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అనధికారికంగా కొంత మొత్తం ఇస్తారు. అందువల్లే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తాయని పలువురు అంటున్నారు. అయితే అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. తప్పు ఎవరిదైనా ఈ విషయంలో విద్యార్థులే చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు 21వ తేదీ వరకు సమయం ఉండడంతో విద్యాశాఖ అధికారులు వెంటనే మేల్కొనాల్సి ఉంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
నిబంధనల ప్రకారమే పదో తరగతి విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేయాలి. ఎక్కువగా వసూలు చేసే పాఠశాలల వివరాలు చెప్పాలని కోరగా, కొందరు తల్లిదండ్రులు స్పందించారు. వీటిపై చర్యలు తీసుకుంటాం. అలాగే ఐసీఆర్ ఫారాలు తీసుకొనేప్పుడు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగినా నేరుగా ఫిర్యాదు చేయాలి,
-ప్రతాప్రెడ్డి, డీఈవో