
గజదొంగ అరెస్ట్ : 1.88 కోట్ల సొత్తు స్వాధీనం
గంటూరు: కరుడుగట్టిన ఘరానా దొంగల ముఠా గుట్టును గుంటూరు నగర పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.1. 88 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సీసీఎస్ అడిషినల్ ఎస్పీ వీపీ తిరుపాల్, అడిషినల్ ఎస్పీ భాస్కర్రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నర్సారావుపేట రూరల్ మండలం కేతానుపల్లి గ్రామానికి చెందిన రాయపాటి వెంకన్న అలియాస్ వెంకయ్య 2003 నుంచి తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, పెద్దాపురం, కర్నూలు తదితర చోట్ల పలు భారీ చోరీలకు పాల్పడ్డాడని చెప్పారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయని తెలిపారు.
ఈ చోరీలలో వెంకన్నకు సహకరించిన వెల్లంపల్లి వినోద్కుమార్, దినేష్లను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.88 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు.