
చీమకుర్తిలో బారులు తీరిన ఓటర్లు
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్లు పెరిగాయి. దీంతో పోలింగ్ శాతం 85.7 నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన సంతనూతలపాడు అసెంబ్లీ ఎన్నికలలో 2,11,396 ఓట్లుకు గాను మ్తొతం 1,70,166 పైగా ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్ అధికారి సీ.రేణుక ప్రకటించారు. పోలైన ఓట్లు మొత్తం ఓట్లలో 85.7 శాతంగా నమోదయింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019 అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లు పెరగడంతో శాతం పెరిగింది. 2014లో మొత్తం ఓట్లు 2,01,813 ఓట్లుకు గాను 1,67,590 ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో 83 శాతంగా నమోదయింది.
రాత్రి 11 గంటల వరకు కూడా రాని ఓట్లు వివరాలు
సంతనూతలపాడు మండలం సెక్టార్ 14లో 8 పోలింగ్ స్టేషన్లకు సంబందించిన ఓట్ల వివరాలు గురువారం రాత్రి 11.30 గంటల వరకు కూడా చీమకుర్తి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోలేదు. సంతనూతలపాడులోని తక్కెళ్లపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఘర్షణల కారణంగా ఆయా ప్రాంతాలలోని పీఓల నుంచి ఓట్ల వివరాలను సెక్టార్ ఆఫీసర్ స్వరూపకు అందని కారణంగా వివరాలను అందించలేకపోయారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు దాదాపు 5 వేల ఓట్లు ఉండొచ్చని రెవెన్యూ అధికారులు అంచనా వేసి మొత్తం ఓట్లును లెక్కగట్టి 85.7 శాతం పోలై ఉండొచ్చని అంచనా వేశారు.