
పాలకాయతిప్ప బీచ్ వద్ద ఎగసిపడుతున్న అలలు
కృష్ణాజిల్లా,కోడూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్గా మారి శుక్రవారం ఉదయం తీరాన్ని తాకే సమయంలో హంసలదీవిలోని సాగరతీరం, పాలకాయతిప్ప బీచ్ ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్రం సుమారు 150మీటర్ల మేర ముందుకు చొచ్చుకు వచ్చి, రోడ్డును తాకగా, సంగమం వద్ద విశ్రాంతి భవనం వరకు చేరాయి. వాయుగుండం ప్రభావం పూర్తిగా పోయే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
భారీగా కోత..
అలల ఉధృతికి సాగరతీరం పొడవునా ఉన్న ఇసుకతిన్నెలు భారీస్థాయిలో కోతకు గురయ్యాయి. సముద్రం నుంచి సంగమం వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మేర తీరం రహదారిలో గుంతలు ఏర్పడ్డాయి. సాగరతీరం వద్ద భయానక పరిస్థితులు చోటు చేసుకోవడంతో మెరైన్ పోలీసులు మధ్యాహ్నం వరకు పర్యాటకులను బీచ్లోకి అనుమతించలేదు. సాయంత్రం నుంచి నిబంధనలను సడలించి, స్నానాలకు అనుమతిచ్చారు.