
తుర్కపల్లి (ఆలేరు) : వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన నవవధువు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన బత్తుల అనూష(22)కు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన జనార్దన్తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని భర్త జనార్దన్, అత్త కృష్ణ కుమారి, మామ భరత్కుమార్, ఆడపడుచు వేదవతిలు అనూషను వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన అనూష అత్తగారింట్లోనే ఈ నెల 5న గుర్తు తెలియని ద్రావకం తాగి పుట్టింటికి వచ్చింది. (కాళ్ల పారాణి ఆరకముందే... )
కాసేపటికే అనూష కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రి, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అనూష ఆరోగ్యం మెరుగు పడడంతో 6వ తేదీన వాసాలమర్రిలోని పుట్టింటికి తీసుకువచ్చారు. అదే రోజు మధ్యాహ్నం అనూషకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దుబ్బాల బాలమణి ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. (కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా)