
ఏసీ ఎక్కడున్నా 18 శాతం జీఎస్టీ
రెస్టారెంట్లలో పన్నుపై సీబీఈసీ స్పష్టత
న్యూఢిల్లీ: ఏసీ రెస్టారెంట్లలో జీఎస్టీ కింద 18 శాతం పన్ను ప్రస్తుతం అమల్లో ఉండగా, అదే రెస్టారెంట్లో ఏసీ లేని విభాగంలో వడ్డించే ఆహారంపైనా, తీసుకెళ్లే పార్సిళ్లపైనా 18 శాతం పన్ను పడనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఎక్సేజ్ కస్టమ్స్ మండలి (సీబీఈసీ) స్పష్టం చేసింది.
వాస్తవానికి ఏసీ లేని హోటళ్లు, రెస్టారెంట్లలో జీఎస్టీ 12 శాతంగా, ఏసీ రెస్టారెంట్లు, లిక్కర్ లైసెన్స్ కలిగి ఉన్న వాటిపై 18 శాతం, 5 స్టార్ హోటళ్లపై 28 శాతం జీఎస్టీని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్, బార్ కలిగి ఉన్న చోట ఏసీ, నాన్ ఏసీ రెండు విభాగాలనూ నిర్వహిస్తుండడంతో పన్ను రేటు ఎంత పడుతుందన్న సందేహాలు ఎదురయ్యాయి. వీటికి సీబీఈసీ స్పష్టత ఇచ్చింది. రెస్టారెంట్లో ఎక్కడో ఒక చోట ఏసీ ఉంటే, ఆహారం ఏ విభాగంలో సరఫరా చేశారన్న దానితో సంబంధం లేకుండా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది.