ఎయిర్ఏసియా ఆఫర్, టిక్కెట్ ధరెంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : మలేషియా బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ఏసియా ప్రమోషనల్ స్కీమ్ ప్రారంభించింది. ఈ ప్రమోషనల్ స్కీమ్లో పరిమిత కాల వ్యవధిలో ఎంపికచేసిన వన్-వే విమానాలకు టిక్కెట్ను రూ.999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ టిక్కెట్ ధరలోనే అన్ని ఛార్జీలు కలిపి ఉంటాయి. ''7 డేస్ ఆఫ్ మ్యాడ్ డీల్స్'' పేరు మీద ఈ ప్రమోషనల్ స్కీమ్ను ఎయిర్ఏసియా ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్ కింద విమాన ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో చెప్పింది.
ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 26 నుంచి 2018 ఆగస్టు 28 వరకు ప్రయాణాలకు అందుబాటులో ఉంటుంది. వెబ్, ఎయిర్ఏసియా మొబైల్ యాప్ ద్వారా 2017 ఆగస్టు 27 వరకు ఈ 7-డే సేల్ కింద బుకింగ్స్ చేపట్టవచ్చు. ''ప్రమోషనల్ స్కీమ్ కింద అందించే సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ స్కీమ్ వర్తించదు. కొత్త కొనుగోళ్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది'' అని ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో తెలిపింది. ఈ ప్రమోషనల్ స్కీమ్ కిందనే భువనేశ్వర్-కోల్కత్తా, గోవా-బెంగళూరు, గౌహతి-ఇంఫాల్, హైదరాబాద్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు మార్గాల టిక్కెట్ ధర రూ.1,099గా ఉంది.