
న్యూఢిల్లీ: చైనీస్ దిగ్గజ సంస్థ ఆలీబాబా భారత్లో తమ క్లౌడ్ సేవలను మరింత విస్తరించనుంది. త్వరలోనే ముంబై డేటా సెంటర్లో మరో క్లౌడ్ ఇన్ఫ్రాను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈఏడాది ప్రారంభంలో క్లౌడ్ సేవలను ఇక్కడి మార్కెట్లో ప్రారంభించిన ఈ సంస్థ.. నెలల వ్యవధిలోనే తమకు లభించిన విశేష స్పందన చూసి, 2వ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ఈ అంశంపై మాట్లాడిన సంస్థ జనరల్ మేనేజర్ అలెక్స్ లీ.. ‘వచ్చే ఏడాది మార్చిలో రెండవ సెంటర్ ప్రారంభంకానుంది. ఇక్కడి మార్కెట్ నుంచి వచ్చిన విశేష స్పందన కారణంగానే అనతికాలంలో 2వ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుచేయనున్నాం.’ అని వ్యాఖ్యానించారు. విదేశీ ఈ–కామర్స్, సోషల్ మీడియా సంస్థలు భారత్లో నిర్వహిస్తున్న సమాచారానికి భద్రత కల్పించే దిశగా భాతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించిన ఆయన ఇక్కడి చట్టాలపై తమకు గౌరవం ఉందని అన్నారు.