
ముంబై: కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాలలో కోతలు విధిస్తున్నాయి. తాజాగా ప్రయివేట్ దిగ్గజ బ్యాంక్(యెస్ బ్యాంక్) ఉద్యోగుల వేతనాల్లో మార్పులను చేస్తున్నట్లు తెలిపింది. సీనియర్ ఉద్యోగులకు వేతన మార్పు వర్తిస్తుందని తెలిపింది. ఉద్యోగుల వార్షిక వేతనంలో మూడో వంతు వాటాను వేరిమబుల్ పేకు చేర్చినట్లు ప్రకటించింది. 2020-21 సంవత్సరం సీనియర్ ఉద్యోగులకు 30 శాతం వాటా మార్పు వర్తిస్తుందని పేర్కొంది.
సాధారణంగా సంస్థ వృద్ధి సాధించినప్పుడు ఉద్యోగులకు ఇచ్చే మొత్తాన్ని వేరియబుల్ పే అంటారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కంపెనీ వృద్ధి చెందడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న నూతన సంస్కరణలను అధ్యయనం చేస్తున్నామని.. ప్రజలకు మరింత సులభతరంగా సేవలందించేందుకు నూతన సాంకేతికతను అధ్యయనం చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు.