
సరికొత్త హైబ్రిడ్ కారు, లీటరుకు 100 కి.మీ.
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన వాహనాలు తయారీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దశలో కంపెనీల మధ్య పోటీ కూడా బాగా పెరిగింది. కేంద్రప్రభుత్వం సైతం ఇలాంటి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లనే ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఓ సరికొత్త కారును రూపొందించింది. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో లో రెనో తన కొత్త హైబ్రిడ్ కారును ప్రదర్శించింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాచ్ బ్యాక్ కారు లీటరు పెట్రోలుతో సుమారు వంద కిలోమీటర్లు నడుస్తుందని ధీమాగా చెబుతోంది. హై ఎండ్ లుక్తో ఆకట్టుకుంటున్న ఈ కాంపాక్ట్ కార్ పెట్రోలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటితోనూ పనిచేస్తుందట.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం... రెనో ఆవిష్కరించిన ఈ కాంపాక్ట్ కారు మిగతావాటితో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుంది. దీని బరువు వెయ్యి కిలోల లోపే ఉండటం వల్ల ఇంధనం వినియోగం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అల్యూమినియం, స్టీలు, మెగ్నీషియం లాంటి లోహాలను ఈ కారు తయారీలో వాడడంతో బరువు తగ్గిందని రెనో పేర్కొంది. అయితే రెనో ఒక శాంపిల్గా మాత్రమే ఈ కారును ఆటో ఎక్స్పో లో చూపింది. కానీ మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ధర ఎంత వివరాలను మాత్రం ప్రకటించలేదు.