
ప్రధాని ఫొటోలు ఎందుకు వాడారు?
జియో, పేటీఎంలకు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: జియో, పేటీఎంలు తమ ప్రకటనల్లో ప్రధానమంత్రి ఫొటోలను వినియోగించడంపై కేంద్రం స్పందించింది. ఇలా ఎందుకుచేశారని ప్రశ్నిస్తూ, నోటీసులు జారీ చేసింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే శుక్రవారంనాడు ఈ విషయాన్ని తెలిపారు. ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్(ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్) యాక్ట్ 1950 కింద నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత స్థాయి ప్రతి ష్టకు కస్టోడియన్గా వ్యవహరించే వినియోగ వ్యవహారాల శాఖ తెలిపింది.
ఈ చట్టం కింద అత్యున్నత స్థాయి ప్రతిష్టను తగ్గించే చర్యలకు జరిమానా విధించే వీలుంది. తాజా పరిణామంపై ఈ–మెయిల్ ప్రశ్నలకు అటు జియో కానీ ఇటు పేటీఎంకానీ స్పందించలేదు. జియో తన 4జీ సేవల ప్రకటనలకు సంబంధించి ప్రధాని ఫొటోను వినియోగించుకుంది. ఇక పెద్ద నోట్ల రద్దు అనంతరం పేటీఎం ప్రకటనల్లో మోదీ ఫొటోలు చోటుచేసుకున్నాయి.