
న్యూఢిల్లీ : కొన్ని బ్యాంకులను ప్రభుత్వం మూసివేస్తుందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దానిలో నిజమెంతో తెలియకుండానే ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తున్నారు కొందరు. అయితే ఏ ప్రభుత్వ రంగ బ్యాంకును తాము మూసివేయడం లేదని ఇటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, అటు కేంద్ర ప్రభుత్వం రెండూ నేడు క్లారిటీ ఇచ్చేశాయి. గత కొంత కాలంగా విపరీతంగా చక్కర్లు కొడుతున్న రూమర్లకు చెక్పెట్టాయి. పీసీఎ కింద కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేస్తున్నారంటూ కొన్ని సెక్షన్ల మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారం సర్క్యూలేట్ అవుతుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రూమర్లను కేంద్ర ప్రభుత్వం కూడా కొట్టిపారేస్తుందని, దీనికి భిన్నంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసే ప్రణాళికలో తామున్నట్టు కేంద్రం పేర్కొంది.
రూ.2.11 లక్షల రీక్యాపిటలైజేషన్ ప్లాన్తో బ్యాంకులను ప్రభుత్వం బలపరుస్తుందని ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం సంస్కరణల రోడ్మ్యాప్ను కూడా రూపొందించినట్టు పేర్కొన్నారు. బ్యాంకు ఆఫ్ ఇండియాపై సత్వర దిద్దుబాటులు చర్యలు(పీసీఏ) తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ పీసీఏ ఫ్రేమ్వర్క్ సాధారణ ప్రజలకు బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రించటానికి ఉద్దేశించినది కాదని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇదే రకమైన స్పష్టతను సెంట్రల్ బ్యాంకు జూన్లో కూడా ఇచ్చింది.