
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్య సాధనకు కేంద్రం కట్టుబడి ఉండాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. మరోవైపు గత నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన సంస్కరణలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
వస్తు, సేవల పన్నుల విధానం, దివాలా చట్టం వంటి సంక్లిష్టమైన చట్టాలను ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు ఇబ్బందిపడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రవేశపెట్టడంతో పాటు అమలు చేయడంలోనూ గణనీయంగా పురోగతి సాధించిందని అరవింద్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక స్థిరీకరణనేది ప్రస్తుత ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి. ఇది స్థూల ఆర్థిక స్థిరత్వ సాధనలో కీలకపాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యాలను మార్చుకోరాదు‘ అని ఆయన పేర్కొన్నారు.