
సాక్షి, చెన్నై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. పన్నుఎగవేత ఆరోపణలతో వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. 2016-17 సంవత్సరానికి సంబంధించిన రూ.2500కోట్లకు పైగా పన్నులు చెల్లించలేదంటూ ఆదాయ పన్ను శాఖ ఈ చర్యలు చేపట్టింది.
ఆదాయం పన్ను చట్టం ప్రకారం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిటిటి) 2,500 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు చెల్లించలేదని సీనియర్ టాక్స్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో చెన్నై, ముంబైలోని బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ గతవారం స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై కాగ్నిజెంట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కాగ్నిజెంట్ అధికారి ప్రతినిధి అన్నిబకాయిలను చెల్లించామని వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలను నిషేధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని ప్రకటించారు. అయితే మరిన్ని వివరాలను అందించడానికి నిరాకరించారు.